రిటైర్డ్ డీజీపీ భార్య హత్య కేసులో పురోగతి
ABN , Publish Date - May 16 , 2026 | 09:19 AM
హైదరాబాద్ జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో రిటైర్డ్ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ భార్యను హత్య చేసి భారీ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది.
పోలీసుల అదుపులో నిందితుడు?
కల్పనకు ఆశ్రయం ఇచ్చింది సాహూ ముఠానేనా!
ముందస్తు ప్లాన్ ప్రకారమే కల్పన భర్త పరారీ
హైదరాబాద్ సిటీ: జూబ్లీహిల్స్ ప్రశాసన్నగర్లో రిటైర్డ్ డీజీపీ వినయ్ రంజన్ రాయ్ భార్యను హత్య చేసి భారీ దోపిడీకి పాల్పడిన కేసులో పోలీసులు పురోగతి సాధించినట్లు తెలిసింది. ఓ నిందితుడిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం. ముందస్తు ప్లాన్ ప్రకారమే పక్కాగా స్కెచ్ వేసిన పని మనిషి కల్పన.. తన అనుచరులతో ఈ దోపిడీకి పాల్పడినట్లు పోలీసులు నిర్ధారించారు. హత్య, దోపిడీ అనంతరం నాంపల్లిలో తెలంగాణ ఎక్స్ప్రె్సలో పారిపోయిన కల్పన ముఠా.. మార్గమధ్యలో కాజీపేటలో దిగారనీ, ఆ తర్వాత ఎవరెవరు ఎటు వెళ్లారు? బార్డర్ దాటారా? లేక దేశంలోనే దాక్కున్నారా? అనే కోణంలో పోలీసులు దర్యాప్తు కొనసాగిస్తున్నారు. నిందితులు ఇప్పటి వరకు నేపాల్కు చేరుకోలేదని గుర్తించిన పోలీసులు ఇప్పటికే ఒకరిని అదుపులోకి తీసుకున్నట్లు సమాచారం.
సాహూ ఆశ్రయం ఇచ్చాడా..?
దేశంలో ఉన్న పలు నేపాల్ దొంగల ముఠాలకు నేత్ర బహదూర్ సాహి అలియాస్ నేత్ర గ్యాంగ్ లీడర్గా వ్యవహరిస్తున్నట్లు గతంలోనే పోలీసులు గుర్తించారు. అయితే జూబ్లీహిల్స్ దోపిడీ కేసులోనూ నేత్ర సాహూ హస్తం ఉండొచ్చని పోలీసులు అనుమానిస్తున్నారు. కల్పన ముఠాకు సాహూ ముఠానే ఆశ్రయం కల్పించి ఉండొచ్చునా అనే కోణంలో పోలీసులు దర్యాప్తు చేస్తున్నారు. టెలికాం, సర్వీస్ ప్రొవైడర్ల ద్వారా అన్ని కోణాల్లో పోలీసులు సాంకేతిక ఆధారాలు సేకరిస్తున్నారు.
నేపాల్ దేశం కైలాలీ జిల్లాకు చెందిన నేత్ర సాహు. బెంగళూరులో ఉంటాడు. బతుకుదెరువుకోసం భారత్కు వచ్చిన పనివాళ్లను లక్ష్యంగా చేసుకుంటాడు. వివిధ నగరాల్లో వంటవాళ్లుగా, పనివాళ్లుగా, సెక్యూరిటీ గార్డులుగా చేరిన వారి డేటాను సేకరిస్తాడు. వారిలో ఖరీదైన, ధనవంతుల ఇళ్లలో పనిచేస్తున్న వారి వివరాలను గుర్తించి అందరి ఫోన్ నంబర్లు తీసుకుని పరిచయం చేసుకుంటాడు. సులభంగా రూ. కోట్ల సొత్తును కొల్లగొట్టి సెటిలైపోదామని నమ్మిస్తాడు. దోపిడీ ఎలా చేయాలో, ఎలా తప్పించుకోవాలో ప్లాన్ చేసి వాళ్లతో అమలు చేయిస్తాడు.
భోజనంలో మత్తుమందు కలిసి ఇంటి యజమానులను మత్తులోకి జారుకునేలా చేయిచి దోపిడీకి పథకం రచిస్తాడు. దోపిడీకి రెండు రోజులు ముందే తన అనుచరులను నగరానికి పంపిస్తాడు. ఇళ్లును గుల్ల చేసి రూ. కోట్లలో సొత్తును కొల్లగొట్టిన తర్వాత మరుసటి యజమానులు స్పృహలోకి వచ్చేలోగా రాష్ట్రం దాటేసి, సొత్తును మాయం చేస్తారు. నిందితులంతా నేపాల్కు చేరుకుంటారు. కల్పన ముఠా కూడా సాహూ ఆశ్రయం కల్పించి ఉంటాడని పోలీసులు అనుమానిస్తున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
తిరుమల వేంకటేశ్వరస్వామి సర్వదర్శనానికి 12 గంటల సమయం
గోల్డ్, సిల్వర్ రేట్స్ పతనం.. ప్రస్తుతం ధరలు ఎలా ఉన్నాయంటే..
Read Latest AP News And Telangana News And International News And Telugu News