విశాఖ సముద్రంలో గల్లంతైన ఏడుగురిలో ఐదుగురి ఆచూకీ గుర్తింపు
ABN , Publish Date - Jul 05 , 2026 | 01:08 PM
విశాఖపట్నం సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు.
విశాఖపట్నం, జులై 5 (ఆంధ్రజ్యోతి): విశాఖపట్నం సముద్రంలో గల్లంతైన ఏడుగురు మత్స్యకారుల ఘటనలో కీలక పరిణామం చోటుచేసుకుంది. గల్లంతైన వారిలో ఐదుగురి ఆచూకీని అధికారులు గుర్తించారు. మరో ఇద్దరు మత్స్యకారుల కోసం సహాయక బృందాలు సముద్రంలో విస్తృతంగా గాలింపు చర్యలు కొనసాగిస్తున్నాయి. గల్లంతైన వారిలో కారె చిన్నాను ఓ వాణిజ్య నౌక సిబ్బంది గుర్తించి సురక్షితంగా రక్షించారు. అనంతరం సహాయక బృందాలు చిన్నాను ఒడ్డుకు తరలించాయి. చిన్నాతో పాటు మరో నలుగురు మత్స్యకారులు బోటు ఎక్కినట్లు సమాచారం. అయితే వారిని సురక్షిత ప్రాంతానికి తరలించేందుకు ప్రత్యామ్నాయ ఏర్పాట్లు చేస్తున్నట్లు అధికారులు వెల్లడించారు. ఇంకా ఆచూకీ లభించని ఇద్దరు మత్స్యకారుల కోసం గాలింపు చర్యలు కొనసాగుతున్నాయి.
విశాఖపట్నానికి 10 మైళ్ల దూరంలో ప్రమాదం: మత్స్యకారుడు చిన్న
గల్లంతైన బోటు,IND-AP-MM-V5-83 డ్రైవర్, మత్స్యకారుడు కారె చిన్న సురక్షితoగా ఉన్నారు. ఆయనను యూనివర్సల్, కార్గో షిప్ రక్షించాయి. ఈ సందర్భంగా చిన్న మాట్లాడారు. విశాఖపట్నానికి సుమారుగా 10 మైళ్ల దూరంలో ఉండగా, ఒక్కసారిగా పెద్ద గాలి రావడంతో బోటు బోల్తా పడిందని.. అదే బోటును పట్టుకొని రాత్రి 9 గంటల వరకు, అలాగే ఉన్నామని చెప్పారు. రాత్రి బోటు మునిగిపోయిన తర్వాత, తెల్లవారేసరికి ఐదుగురం ఈత ఈదుకుంటూ కొంత దూరం వెళ్లామని.. అక్కడ తమకు భారీ నౌక కనిపించిందని తెలిపారు. ఆ భారీ నౌక ఎదురుగా వెళ్లి యాంగర్ని తాను పట్టుకున్నానని చెప్పారు. తాను గట్టిగా అరవడంతో కార్గో షిప్ వాళ్లు గమనించి తనను పైకి లాగారని అన్నారు. మిగతా ముగ్గురు అక్కడ వరకు వచ్చి గల్లంతయ్యారని చెప్పారు. బోట్లో ఉన్న వాళ్లందరూ తమ కుటుంబ సభ్యులు తన కళ్లముందే.. గల్లంతయ్యారని కారె చిన్న తీవ్ర ఆవేదన వ్యక్తం చేశారు.
జులై 1న సముద్రంలో వేటకు..
కాగా, జులై 1వ తేదీ తెల్లవారుజామున సుమారు 3 గంటల ప్రాంతంలో విశాఖపట్నం ఫిషింగ్ హార్బర్ నుంచి IND-AP-MM-V5-83 నంబర్ గల బోటులో ఏడుగురు వ్యక్తులు సముద్రంలోకి వేటకు వెళ్లారు. అయితే సముద్రంలో ఒక్కసారిగా వాతావరణం ప్రతికూలంగా మారడంతో తిరిగి హార్బర్కు చేరుకోవాలని నిర్ణయించారు.
జులై 4న మత్స్యకారుల గల్లంతు..
అయితే, జులై 4వ తేదీ మధ్యాహ్నం 2 గంటల సమయంలో కుటుంబ సభ్యులకు ఫోన్ చేసి, మధ్యాహ్నం 3 గంటల్లోపు హార్బర్కు చేరుకుంటామని మత్స్యకారులు తెలిపారు. కానీ సాయంత్రం 5 గంటలు దాటినా వారి బోటు తిరిగి రాకపోవడంతో కుటుంబ సభ్యులు ఆందోళన చెందారు. అనంతరం మత్స్యకారుల వద్ద ఉన్న ఆరు మొబైల్ ఫోన్లు కూడా స్విచ్ఛాఫ్ కావడంతో అధికారులకు సమాచారం అందించారు.
గాలింపు చర్యలపై అధికారులకు సీఎం ఆదేశాలు..
ఈ ఘటనపై స్పందించిన ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు ఉన్నతాధికారులతో మాట్లాడి పరిస్థితిని సమీక్షించారు. గల్లంతైన మత్స్యకారులను గుర్తించి సురక్షితంగా తీసుకురావడానికి గాలింపు చర్యలను మరింత వేగవంతం చేయాలని అధికారులను ఆదేశించారు. సముద్రంలో కోస్ట్ గార్డ్, నేవీ, మెరైన్ పోలీసులు, మత్స్యశాఖ బృందాలు సమన్వయంతో సహాయక చర్యలు కొనసాగిస్తున్నాయి.
ఈ వార్తలు కూడా చదవండి...
అల్లూరి ఆశయాలే దేశానికి మార్గదర్శకం: పవన్ కల్యాణ్
డ్వాక్రా మహిళలను ఆర్థికంగా బలోపేతం చేసేలా తృప్తి క్యాంటీన్లను ప్రోత్సహిస్తున్నాం: మంత్రి నారాయణ
Read Latest AP News And Telangana News And National News
And Telugu News