భారీవర్షం
ABN , Publish Date - May 02 , 2026 | 01:02 AM
ఎండ తీవ్రతతో అల్లాడితున్న నగరవాసులకు ఉపశమనం కలిగించేలా శుక్రవారం వర్షం కురిసింది.
చల్లబడిన వాతావరణం...సేదతీరిన జనం
ఏటా మే 1న వర్షం?
విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):
ఎండ తీవ్రతతో అల్లాడితున్న నగరవాసులకు ఉపశమనం కలిగించేలా శుక్రవారం వర్షం కురిసింది. గురువారం అర్ధరాత్రి ఆకాశం మేఘావృతమై అనేకచోట్ల జల్లులు కురిశాయి. ఉపరితల ద్రోణి, వాతావరణ అనిశ్చితి ప్రభావంతో శుక్రవారం ఉదయం నుంచీ అడపాదడపా చిరుజల్లులు కురవడంతో వాతావరణం చల్లబడింది. మధ్యాహ్నం, సాయంత్రం సమయాల్లో అనేకచోట్ల భారీవర్షం కురిసింది. ఆనందపురంలో 51.5 మిల్లీమీటర్లు, పరదేశిపాలెంలో 33.5, పెందుర్తి బీసీ కాలనీలో 23.7, మధురవాడ జెడ్పీ హైస్కూల్ వద్ద 22, కాపులుప్పాడలో 16.2 మిల్లీమీటర్ల వర్షపాతం నమోదైంది. కొద్దిరోజులుగా తీవ్రమైన ఎండ, ఉక్కపోతతో అల్లాడిన ప్రజలు ఈ వర్షంతో సేదతీరారు. రానున్న రెండు, మూడు రోజుల్లో ఉరుములు, ఈదురుగాలులతో కూడిన వర్షాలు కురుస్తాయని వాతావరణ శాఖ వెల్లడించింది. కాగా, ఒక్క 2024లో తప్ప 2018 నుంచి 2026 వరకు ఏటా మే ఒకటో తేదీన విశాఖపట్నంలో వర్షం కురుస్తున్నదని వెదర్మ్యాన్ ఒకరు పోస్టు చేశారు.
జిల్లా గ్రంథాలయ సంస్థ భవన నిర్మాణానికి రూ.20 కోట్లు
విశాఖపట్నం, మే 1 (ఆంధ్రజ్యోతి):
జిల్లా గ్రంథాలయ సంస్థ భవన నిర్మాణానికి రూ.20 కోట్లు విడుదలకు ప్రభుత్వం పాలనామోదం తెలిపింది. ఈ మేరకు రాష్ట్ర గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ ఎ.కృష్ణమోహన్ ఉత్తర్వులు జారీచేశారు. భవన నిర్మాణ బాధ్యతలను ఏపీ విద్యా, సంక్షేమ మౌలిక సదుపాయాల అభివృద్ధి సంస్థ (ఏపీఈడబ్ల్యు ఐడీసీ)కు అప్పగించారు. ప్రస్తుత ఆర్థిక సంవత్సరంలో రూ.20 కోట్లు వ్యయం చేయాలని తాజా ఉత్తర్వులలో పేర్కొన్నారు. భవన నిర్మాణానికి రూ.రెండు కోట్లు (ఏపీఈడబ్ల్యుఐడీసీ) ఖాతాలో జమ చేశారు. కాగా భవన నిర్మాణం పూర్తిచేయడానికి మిగిలిన మొత్తం సీఎస్సార్ నిధులు, ఎంపీ ల్యాడ్స్ నుంచి సమీకరించాలని గ్రంథాలయ సంస్థ డైరెక్టర్ సూచించారు. భవన నిర్మాణానికి రూ.20 కోట్ల నిధులకు మంజూరుచేయడంపై జిల్లా గ్రంథాలయ సంస్థ చైర్మన్ వన్నంరెడ్డి సతీష్కుమార్ హర్షం వ్యక్తంచేశారు.