ప్రకాశం జిల్లాలో అగ్నిప్రమాదం.. ఏం జరిగిందంటే..
ABN , Publish Date - Mar 01 , 2026 | 08:28 AM
ప్రకాశం జిల్లా టంగుటూరులోని ఓ పొగాకు కంపెనీలో ఆదివారం అగ్నిప్రమాదం జరిగింది. షార్ట్ సర్క్యూట్ కారణంగా పొగాకు బేళ్లకు మంటలు అంటుకున్నాయి. ఈ ప్రమాదంలో సుమారు 2 వేలకు పైగా పొగాకు బేళ్లు దగ్ధమయ్యాయి.
ప్రకాశం జిల్లా, మార్చి 1(ఆంధ్రజ్యోతి): ప్రకాశం జిల్లా టంగుటూరు మండలంలోని ప్రముఖ పొగాకు గ్రేడింగ్ కంపెనీ గాడ్ఫ్రే ఫిలిప్స్ ఇండియా (Godfrey Phillips India)లో ఇవాళ(ఆదివారం) అగ్నిప్రమాదం జరిగింది. ఈ ప్రమాదంలో భారీగా ఆస్తి నష్టం వాటిల్లింది. పొగాకు గ్రేడింగ్ యూనిట్లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. వెంటనే నిర్వాహకులు అగ్నిమాపక అధికారులకు, పోలీసులకు సమాచారం అందజేశారు. అగ్నిమాపక సిబ్బంది ఘటన స్థలానికి చేరుకొని సహాయక చర్యలు చేపట్టారు.
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. కంపెనీలోని విద్యుత్ సరఫరాలో ఏర్పడిన షార్ట్ సర్క్యూట్ కారణంగా మంటలు అంటుకున్నట్లు తెలుస్తోంది. పొగాకు బేళ్లు త్వరగా మంటలను ఆకర్షించే స్వభావం కలిగి ఉండటంతో, నిమిషాల వ్యవధిలోనే మంటలు కంపెనీ అంతటా వ్యాపించాయి. ఈ అగ్నిప్రమాదంలో కంపెనీకి కోట్లలో నష్టం వాటిల్లిందని అంచనా వేస్తున్నారు. సుమారు 2 వేలకు పైగా పొగాకు బేళ్లు మంటల్లో పూర్తిగా కాలి బూడిదయ్యాయి. మంటలు చెలరేగిన వెంటనే కంపెనీ సిబ్బంది అగ్నిమాపక కేంద్రానికి సమాచారం అందించారు. టంగుటూరు సమీప ప్రాంతాల నుంచి చేరుకున్న ఫైర్ సిబ్బంది ఎంతగానో శ్రమించి మంటలను అదుపులోకి తీసుకుచ్చారు. మంటలు పక్కనే ఉన్న ఇతర గోదాములకు వ్యాపించకుండా సకాలంలో అగ్నిమాపక యంత్రాలు చేరుకోవడంతో పెద్ద ప్రమాదం తప్పింది. ఈ ఘటనపై అధికారులు విచారణ జరుపుతున్నారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల ఘటన.. భారీ సాయం ప్రకటించిన సీఎం చంద్రబాబు
కాకినాడ జిల్లా బాణాసంచా పేలుళ్ల కారణాలపై విచారణ చేస్తున్నాం: పవన్ కల్యాణ్
Read Latest Telangana News And AP News And Telugu News