గొల్లగుప్ప ఘటనపై సమగ్ర విచారణకు మంత్రి సంధ్యారాణి ఆదేశం
ABN , Publish Date - Sep 02 , 2026 | 09:33 AM
పోలవరం జిల్లాలో మలేరియా నివారణ మాత్రలు వికటించి చిన్నారి మృతి చెందిన ఘటనపై ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడారు.
అమరావతి, సెప్టెంబర్ 2: పోలవరం జిల్లాలో మలేరియా నివారణ మాత్రలు(క్లోరోక్విన్) వికటించి చిన్నారి మృతి చెందిన ఘటనపై ఇన్ఛార్జ్ మంత్రి గుమ్మడి సంధ్యారాణి సమీక్ష నిర్వహించారు. ఈ ఘటనపై కలెక్టర్, ఉన్నతాధికారులతో మాట్లాడారు. ఘటనకు గల కారణాలపై సమగ్ర విచారణ జరిపి నివేదిక ఇవ్వాలని ఆదేశించారు. బాధితులకు ప్రభుత్వం పూర్తి అండగా ఉంటుందని హామీ ఇచ్చారు. చిన్నారి మృతిపై మంత్రి దిగ్భ్రాంతి వ్యక్తం చేశారు. కుటుంబ సభ్యులకు సానుభూతి తెలిపారు.
చనిపోయిన చిన్నారి కుటుంబ వైద్య హిస్టరీని అధ్యయనం చేస్తున్నట్లు మంత్రికి కలెక్టర్ తెలిపారు. ఇతర విద్యార్థుల ఆరోగ్యం నిలకడగా ఉందన్నారు. ఈరోజు(బుధవారం) మధ్యాహ్నం వరకూ స్పెషలిస్టుల అబ్జర్వేషన్లో ఉంచి డిశ్చార్జ్ చేయనున్నట్లు కలెక్టర్ తెలియజేశారు. పరిస్థితిని ఎప్పటికప్పుడు తెలియజేయాలని అధికారులకు మంత్రి సంధ్యారాణి సూచించారు.
కాగా.. పోలవరం జిల్లా గొల్లగుప్పలో మలేరియా నివారణ ట్యాబెట్లు వికటించి ఓ చిన్నారి చనిపోవడం తీవ్ర కలకలం రేపింది. మొత్తం 71 మందికి మాత్రలు పంపిణీ చేయగా.. 53 మంది అనారోగ్యానికి గురయ్యారు. వీరిలో 46 మంది చిన్నారులు ఉన్నట్లు అధికారులు తెలిపారు. ఓ చిన్నారి వాంతులు చేసుకోవడంతో ఆస్పత్రికి తరలించగా.. మృతి చెందినట్లు వైద్యులు వెల్లడించారు. 29 మంది తీవ్ర అస్వస్థతకు గురవ్వగా.. వారికి భద్రాచలం ఏరియా ఆస్పత్రిలో చికిత్స కొనసాగుతోంది. మరో 24 మందికి లక్ష్మీపురం పీహెచ్సీలో వైద్యులు చికిత్స అందజేస్తున్నారు.
ఇవి కూడా చదవండి...
అమెరికా దాడులతో పెళ్లింట పలువురి మృతి.. ఇరాన్ ప్రతీకార దాడులు
గొల్లగుప్ప ఘటనపై సీఎం చంద్రబాబు సమీక్ష.. కీలక ఆదేశాలు
Read Latest AP News And Telugu News