కుర్చీ కోసం సొంత పార్టీ కార్యకర్తలనే బలితీసుకుంటున్నారు.. జగన్పై మంత్రి సవిత ఫైర్
ABN , Publish Date - Aug 08 , 2026 | 03:12 PM
రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు.
అమరావతి, ఆగస్టు 8: రెండేళ్లలో సంక్షేమం, అభివృద్ధే ధ్యేయంగా సుపరిపాలన అందిస్తున్నామని మంత్రి సవిత అన్నారు. ఈరోజు(శనివారం) మీడియాతో మాట్లాడుతూ.. ప్రధాని నరేంద్ర మోదీ ఆశీస్సులతో, సీఎం చంద్రబాబు విజన్, డిప్యూటీ సీఎం పవన్ కల్యాణ్ సహకారం, నారా లోకేశ్ కష్టంతో రాష్ట్రం ముందుకు సాగుతోందని తెలిపారు. గత ప్రభుత్వంలో నిలిచిపోయిన అమరావతి రాజధాని నిర్మాణం, పోలవరం పనులను శరవేగంగా పూర్తి చేస్తున్నామని చెప్పారు. గతంలో 151 సీట్లతో అధికారంలో ఉండి రాష్ట్రాన్ని విధ్వంసం చేసిన వైసీపీ ఒక ‘గొడ్డలి పార్టీ’, ‘క్రిమినల్ పార్టీ’ అంటూ వ్యాఖ్యానించారు.
గొడ్డలి పార్టీ అధినేత జగన్మోహన్ రెడ్డి.. కుర్చీ కోసం సొంత పార్టీ కార్యకర్తలను, నేతలనే బలితీసుకుంటున్నారని మంత్రి తెలిపారు. వైఎస్ వివేకానందరెడ్డి హత్య నుంచి సుధాకర్, అమర్నాథ్ గౌడ్, దళిత బిడ్డ డోర్ డెలివరీ ఘటనలే గత ప్రభుత్వ అరాచకాలకు నిదర్శనమన్నారు. దేవరపల్లిలో మునేశ్వరరావు, పలాసలో దానయ్య యాదవ్, పెంటపాడులో సింగయ్య, కడపలో దస్తగిరి, మాచర్లలో చెన్నారెడ్డి, ఇబ్రహీంపట్నంలో భార్గవ్ బాధితులుగా మారారని చెప్పుకొచ్చారు. పలాసాలో చనిపోయిన నిరుపేద కూలి దానయ్య యాదవ్ కుటుంబాన్ని పరామర్శించని జగన్, హత్య చేసిన వారిని వెళ్లి పరామర్శించడం దారుణమని మండిపడ్డారు. 44 ఏళ్ల నిరుపేద బీసీ బాధితుడు దానయ్య యాదవ్ చనిపోతే ‘వయసైపోయింది’ అని జగన్మోహన్ రెడ్డి సన్నాయి నొక్కులు నొక్కుతున్నారన్నారు.
పదవులు అనుభవించడానికి అవినాశ్ రెడ్డి, జగన్ మోహన్ రెడ్డి, జోగి రమేష్, అంబటి రాంబాబులకు వయసు అడ్డురాలేదా అని మంత్రి ప్రశ్నించారు. వైసీపీ నాయకులు, కార్యకర్తలు ఒకసారి నిజ నిజాలు ఆలోచించుకోవాలని.. పాము పడగ నీడన బతుకుతున్నారని తెలిపారు. వైసీపీ నేతలు రాజకీయ ప్రయోజనాల కోసం కార్యకర్తలను బలిపీఠం ఎక్కిస్తున్నారని మండిపడ్డారు. జగన్ రెడ్డి ‘నా బడుగు బలహీన వర్గాలు’ అని ఓట్లు వేయించుకుని, అధికారంలోకి వచ్చాక తీవ్రంగా ఇబ్బంది పెట్టారన్నారు. ఎన్టీఆర్ కాలం నుంచి నేటి వరకు బీసీలకు అండగా ఉన్నది తెలుగుదేశం పార్టీయే అని పేర్కొన్నారు. తొలి సంతకంతోనే మెగా డీఎస్సీ అమలు చేసి, కులమతాలకు అతీతంగా ఎంతోమంది బీసీ, బడుగు బలహీన వర్గాల యువతకు ఉద్యోగాలు అందించామని వెల్లడించారు. బీసీలను బ్యాక్బోన్గా మారుస్తూ ప్రతి కుటుంబం నుంచి ఒక పారిశ్రామికవేత్తను తయారు చేయడమే ప్రభుత్వ లక్ష్యమని మంత్రి సవిత స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
‘థాంక్యూ సీఎం సర్.. థాంక్యూ లోకేశ్ సర్’.. కొండారెడ్డి బురుజు వద్ద టీచర్స్ నినాదాలు
‘ఇష్టం వచ్చినట్లు వాగితే చూస్తూ ఊరుకోం’.. వైసీపీ నేతలకు బోండా ఉమ స్ట్రాంగ్ వార్నింగ్
Read Latest AP News And Telugu News