విజయవాడలో అమానుషం.. రెండేళ్ల చిన్నారి దారుణ హత్య
ABN , Publish Date - May 01 , 2026 | 08:17 AM
విజయవాడలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. గన్నవరం చెంచుల కాలనీకి చెందిన ఒక మహిళకు, వంశీ అనే వ్యక్తితో ఏర్పడిన వివాహేతర సంబంధం.. రెండేళ్ల చిన్నారి దారుణ హత్యకు కారణమైంది.
విజయవాడ, మే1 (ఆంధ్రజ్యోతి): విజయవాడలో అమానుష ఘటన వెలుగులోకి వచ్చింది. గన్నవరం చెంచుల కాలనీకి చెందిన ఒక మహిళకు, వంశీ అనే వ్యక్తితో ఏర్పడిన వివాహేతర సంబంధం.. రెండేళ్ల చిన్నారి దారుణ హత్యకు కారణమైంది. సమాచారం అందుకున్న పోలీసులు ఘటన స్థలానికి చేరుకుని వివరాలు సేకరించారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.
విజయవాడలో సహజీవనం..
పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. విజయవాడలోని సత్యనారాయణపురంలో వంశీతో కలిసి ఓ మహిళ సహజీవనం చేస్తోంది. తన భర్తను, కుటుంబాన్ని వదిలేసి, గత రెండు నెలలుగా తన ఇద్దరు పిల్లలతో (ఐదేళ్ల కుమారుడు, రెండేళ్ల కుమార్తె) కూడా అక్కడే ఉంటున్నారు. ఇటీవల వంశీకి, ఆ మహిళకు మధ్య తీవ్రస్థాయిలో గొడవ జరిగింది. ఆ వాగ్వాదంలో ఆగ్రహానికి లోనైన వంశీ.. రెండేళ్ల చిన్నారిని విచక్షణారహితంగా కొట్టాడు. ఆ దెబ్బలకు తాళలేక పాప ప్రాణాలు విడిచింది. చిన్నారి చనిపోయిన తర్వాత, విషయం బయటకు రాకుండా ఉండేందుకు అనారోగ్యంతో చనిపోయిందని ఆమె తన భర్తకు సమాచారం ఇచ్చింది.
పోలీసుల చర్యలు..
పాప తల్లి, ఆమె ప్రియుడు పన్నిన కుట్రను భర్త పసిగట్టగలిగారు. ఈ మొత్తం దారుణాన్ని ఆమె ఐదేళ్ల కుమారుడు కళ్లారా చూశాడు. తండ్రి అడిగినప్పుడు, వంశీనే తన చెల్లిని కొట్టి చంపినట్లు ఆ బాలుడు వివరించాడు. కొడుకు చెప్పిన మాటలు, పాప మృతిపై ఉన్న అనుమానాలతో తండ్రి పోలీసులను ఆశ్రయించాడు. పోలీసులు రంగంలోకి దిగి విచారణ చేపట్టగా.. పోస్టుమార్టం నివేదిక, బాలుడి వాంగ్మూలం ఆధారంగా వంశీనే హత్య చేసినట్లు నిర్ధారించారు. నిందితుడు వంశీని అదుపులోకి తీసుకున్నారు. మహిళ పాత్రపై కూడా పోలీసుల విచారణ కొనసాగుతోంది.
ఈ వార్తలు కూడా చదవండి...
టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు
ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన టైటాన్ సంస్థ
Read Latest AP News And Telangana News And International News And Telugu News