Share News

విజయవాడలో అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఒకరి మృతి

ABN , Publish Date - May 12 , 2026 | 03:02 PM

విజయవాడలోని పటమటలంక ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రత్యూష అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది.

విజయవాడలో అగ్నిప్రమాదం.. గ్యాస్ సిలిండర్ పేలి ఒకరి మృతి
Vijayawada Fire Accident

విజయవాడ, మే12 (ఆంధ్రజ్యోతి): విజయవాడలోని పటమటలంక ప్రాంతంలో విషాదకర ఘటన చోటుచేసుకుంది. ప్రత్యూష అపార్ట్‌మెంట్‌లో అగ్నిప్రమాదం జరిగింది. ఈ ఘటన స్థానికంగా తీవ్ర కలకలం రేపింది. ఎండల తీవ్రత కారణంగా షార్ట్ సర్క్యూట్ జరిగి ఏసీ అవుట్‌డోర్ యూనిట్‌లో మంటలు చెలరేగినట్లు సమాచారం. అనంతరం ఆ మంటలు పక్కనే ఉన్న గ్యాస్ సిలిండర్‌కు వ్యాపించడంతో భారీ పేలుడు సంభవించింది. సమాచారం అందుకున్న అగ్నిమాపక అధికారులు, పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు. ఈ ఘటనపై పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు.


ఏసీ షార్ట్ సర్క్యూట్‌తో ప్రమాదం..

పోలీసులు తెలిపిన వివరాల ప్రకారం.. ప్రత్యూష అపార్ట్‌మెంట్ బాల్కానీలో ఏర్పాటు చేసిన ఎయిర్ కండీషనర్ అవుట్‌డోర్ యూనిట్‌లో ఒక్కసారిగా మంటలు చెలరేగాయి. కాసేపటికే మంటలు వేగంగా వ్యాపించి సమీపంలో ఉన్న గ్యాస్ సిలిండర్‌ను అంటుకున్నాయి. మంటలు గ్యాస్ సిలిండర్‌ను తాకడంతో భారీ శబ్దంతో పేలుడు సంభవించింది. పేలుడు తీవ్రతకు బాల్కనీ గోడ పూర్తిగా ధ్వంసమైంది. గోడ రాళ్లు ఎగిరిపడి పక్కన ఉన్న అపార్ట్‌మెంట్ వాసులకు తగిలాయి.


రాయి తగిలి వ్యక్తి మృతి..

పేలుడు సమయంలో ఎగిరి వచ్చిన రాయి శ్రీనివాసరావు అనే వ్యక్తి తలకు బలంగా తగిలింది. తీవ్ర గాయాలతో కుప్పకూలిన ఆయనను ఆస్పత్రికి తరలించేలోపే మృతి చెందినట్లు అధికారులు తెలిపారు. ఈ ఘటనలో పలువురు గాయపడ్డారు. ఈ ప్రమాదం స్థానికులను తీవ్ర విషాదంలో ముంచెత్తింది.


రంగంలోకి ఫైర్ సిబ్బంది..

సమాచారం అందుకున్న వెంటనే అగ్నిమాపక సిబ్బంది సంఘటనా స్థలానికి చేరుకుని మంటలను అదుపులోకి తీసుకువచ్చారు. సమయానికి స్పందించడంతో మరింత పెద్దప్రమాదం తప్పిందని అధికారులు తెలిపారు.


పోలీసుల చర్యలు..

ఈ ఘటనపై పటమట పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. షార్ట్ సర్క్యూట్ కారణంగానే ప్రమాదం జరిగిందా?, లేక ఇతర కారణాలున్నాయా? అనే కోణంలో విచారణ చేపట్టారు. అపార్ట్‌మెంట్‌లో భద్రతా ప్రమాణాలు పాటించారా లేదా అనే అంశాలపై కూడా అధికారులు ఆరా తీస్తున్నారు.


స్థానికుల్లో భయం..

ఈ ఘటనతో పటమటలంక ప్రాంతంలో భయాందోళనలు నెలకొన్నాయి. వేసవి కాలంలో ఎలక్ట్రికల్ పరికరాల వినియోగంలో జాగ్రత్తలు తీసుకోవాలని అధికారులు సూచిస్తున్నారు. ముఖ్యంగా ఏసీ యూనిట్లు, గ్యాస్ సిలిండర్లను ఆ సమీపంలో ఉంచకుండా జాగ్రత్తపడాలని హెచ్చరిస్తున్నారు.


ఈ వార్తలు కూడా చదవండి...

టెక్నాలజీ హబ్‌గా ఏపీని తీర్చిదిద్దుతున్నాం: సీఎం చంద్రబాబు

ప్రజాసమస్యల పరిష్కారానికి పవన్ కల్యాణ్ ఎల్లప్పుడూ కట్టుబడి ఉంటారు: అన్నామలై

అనధికార లౌడ్‌స్పీకర్లపై డీజీపీకి రఘురామ లేఖ

Read Latest AP News And Telangana News And International News And Telugu News

Updated Date - May 12 , 2026 | 03:27 PM