చైర్మన్ పోడియం వద్ద వైసీపీ నిరసన.. తీవ్ర గందరగోళం
ABN , Publish Date - Mar 05 , 2026 | 02:19 PM
చైర్మన్ను ఉద్దేశించి మంత్రి అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై ప్రభుత్వం సమాధానం చెప్పాలంటూ శాసనమండలిలో వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. దీంతో సభలో తీవ్ర గందరగోళం నెలకొంది.
అమరావతి, మార్చి 5: ఏపీ శాసనమండలిలో(AP Legislative Council) మరోసారి గందరగోళం నెలకొంది. తిరుమల నెయ్యి కల్తీ అంశంపై లఘు చర్చ సందర్భంగా మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి (Minister Anam Ramanarayana Reddy) ఈ అంశంపై వివరణ ఇస్తుండగా వైసీపీ సభ్యులు ఆందోళనకు దిగారు. మంత్రి వివరణ సమయంలోనే మతాల ప్రస్తావన చేసిన అచ్చెన్నాయుడిని మంత్రి పదవి నుంచి తొలగించాలని వైసీపీ సభ్యులు నినాదాలు చేశారు. వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియం పైకి ఎక్కి నిరసన చేయడంతో సభను కొద్ది సేపు వాయిదా వేశారు చైర్మన్.
నిన్న చైర్మన్పై అచ్చెన్నాయుడు చేసిన వ్యాఖ్యలపై సోషల్ మీడియాలో వచ్చిన పోస్టులపై వైసీపీ అభ్యంతరం వ్యక్తం చేసింది. దీనిపై ప్రభుత్వం సమాధానం చెప్పాలని వైసీపీ సభ్యుడు అప్పిరెడ్డి డిమాండ్ చేశారు. అప్పిరెడ్డి డిమాండ్పై ప్రభుత్వం చర్యలు తీసుకోవాలని చైర్మన్ ఆదేశాలు ఇచ్చారు. దీనిపై మంత్రి అచ్చెన్నాయుడు అభ్యంతరం వ్యక్తం చేశారు. తాను చైర్మన్ను ఉద్దేశించి నిన్న చేసిన వ్యాఖ్యలపై వెంటనే వివరణ ఇచ్చానని మంత్రి చెప్పారు. ‘పోస్టులు పెట్టేది వాళ్లే, ప్రస్తావించేది వాళ్లే’ అని వైసీపీ సభ్యులను ఉద్దేశించి వ్యాఖ్యానించారు.
అయితే, నిన్న వైసీపీ అధినేత జగన్ క్రిస్టియన్ అని తాను చేసిన వ్యాఖ్యలపై ఇంతవరకు సమాధానం లేదని, ఆ వ్యాఖ్యలకు తాను ఇప్పటికీ కట్టుబడి ఉన్నానని మంత్రి స్పష్టం చేశారు. అచ్చెన్నాయుడు వ్యాఖ్యలపై వెంటనే క్షమాపణ చెప్పాలని వైసీపీ డిమాండ్ చేసింది. వైసీపీ సభ్యులు చైర్మన్ పోడియంను చుట్టుముట్టారు. నిరసన మధ్యనే లడ్డూ అంశంపై స్టేట్మెంట్ ఇవ్వడం ప్రారంభించారు మంత్రి ఆనం రామనారాయణ రెడ్డి. అయినప్పటికీ వైసీపీ నిరసనలు కొనసాగడంతో చైర్మన్ సభను కొద్దిసేపు వాయిదా వేశారు.
ఇవి కూడా చదవండి...
మనమిత్ర ద్వారా పదో తరగతి హాల్ టికెట్స్
లేట్ నైట్ రివ్యూలు తగ్గించండి.. మంత్రికి ఎమ్మెల్యే సూచన
Read Latest AP News And Telugu News