Share News

త్రీమెన్ కమిటీ సమావేశం.. అమరావతి రైతుల సమస్యలపై ఫోకస్

ABN , Publish Date - May 05 , 2026 | 04:12 PM

రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశమైంది. రాజధాని గ్రామాల సమస్యలపై, ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలపై ఈ సమావేశంలో చర్చించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ తెలిపారు.

త్రీమెన్ కమిటీ సమావేశం.. అమరావతి రైతుల సమస్యలపై ఫోకస్
Amaravati capital

అమరావతి, మే 5: రాజధాని రైతుల సమస్యల పరిష్కారం కోసం సీఆర్డీఏ కార్యాలయంలో త్రీమెన్ కమిటీ సమావేశమైంది. ఈ సందర్భంగా కేంద్ర మంత్రి పెమ్మసాని చంద్రశేఖర్ మాట్లాడుతూ.. అనివార్య కారణాలు, అసెంబ్లీ సమావేశాల కారణంగా త్రీమెన్ కమిటీ సమావేశం కొంత ఆలస్యం అయ్యిందని తెలిపారు. కొత్తగా సీఆర్‌డీఏ కమిషనర్‌గా విజయరామరాజు బాధ్యతలు స్వీకరించారన్నారు. నేడు జరిగిన సమావేశంలో రాజధాని గ్రామాల సమస్యలపై కీలకంగా చర్చించామని, ఎన్ఎస్పీ ప్రభావిత బాధితుల ఇళ్ల సమస్యలపై చర్చించినట్లు చెప్పారు. ఎఫ్‌ఎస్‌ఐ అంశాలపై కూడా సుదీర్ఘంగా మాట్లాడామన్నారు.


రాజధాని ప్రాంతంలో గ్రామీణ రహదారులు, మౌలిక వసతుల అభివృద్ధికి ప్రాధాన్యం ఇవ్వాలని నిర్ణయించినట్లు కేంద్ర మంత్రి పెమ్మసాని తెలిపారు. మంత్రి నారాయణ, కమిషనర్‌‌లు, జాయింట్ కమిషనర్లు కూడా ఫీల్డ్ విజిట్‌లు చేపట్టాలని సమావేశంలో నిర్ణయం తీసుకున్నామన్నారు. ప్రజల సమస్యలను ప్రత్యక్షంగా తెలుసుకునే దిశగా చర్యలు తీసుకుంటున్నామని తెలిపారు. మరో 2-3 వారాల్లో రెగ్యులర్ మీటింగ్‌లు నిర్వహించాలని నిర్ణయించామన్నారు. అంశాల వారీగా సమీక్ష చేయడంతో పాటు, పరిష్కారాలపై ఎప్పటికప్పుడు అప్డేట్లు ఇవ్వాలని అధికారులకు సూచించామని పెమ్మసాని చంద్రశేఖర్ వెల్లడించారు.


పాలసీ ప్రకారమే అమలు: మంత్రి నారాయణ

narayana-amaravati.jpg

రాజధాని అమరావతిలో రైతుల సమస్యలపై త్రీమెన్ కమిటీ, అధికారులు కలిసి చర్చించామని మంత్రి నారాయణ తెలిపారు. రోడ్లు, డ్రైన్‌లు, వాటర్, పార్కులు వంటి వాటిపై చర్చించామన్నారు. సీఆర్‌డీఏ కమిషనర్ కొత్తగా వచ్చారని.. ఆయన కూడా అన్ని గ్రామాలకు వెళ్లి, వారితో మాట్లాడితే క్లారిటీ వస్తుందని భావిస్తున్నారని తెలిపారు. గ్రామ గ్రామానికీ వెళ్తే ప్రజలు ఎక్కువగా వస్తారని.. సమస్యలు చెబుతారన్నారు. అప్పుడు అధికార యంత్రాంగానికి కూడా సమస్యలపై క్లారిటీ వస్తుందని మంత్రి నారాయణ వెల్లడించారు.


పాలసీ ప్రకారమే అన్నీ అమలవుతాయని, ఎవరికీ మినహాయింపులు ఉండవని మంత్రి నారాయణ స్పష్టం చేశారు. ఆర్ ఫైవ్ జోన్‌ను వెనక్కి తీసుకున్నామని అన్నారు. అన్ని జోన్లలోనూ పనులు వేగంగా జరుగుతున్నాయని.. ఎక్కడా ఆలస్యం అనే మాటే లేదని మంత్రి తెలిపారు. హైటెన్షన్ వైర్ల రీ రూటింగ్.. శాఖమూరు పార్కు వరకు జరుగుతోందన్నారు. అక్కడి నుంచి ఎక్స్‌టెన్షన్.. రెండో దశ ల్యాండ్ పూలింగ్ తరువాత జరుగుతుందని చెప్పారు. రైతులకు కౌలు పెంపు విషయంలో ప్రభుత్వ నిర్ణయంపై చర్చించామన్నారు. రెండో దశలో కూడా ల్యాండ్ పూలింగ్‌కు రైతులు ముందుకు వస్తున్నారని తెలిపారు. ఈ నెలాఖరకు 60% భూ సమీకరణ పూర్తయ్యే అవకాశం ఉందని మంత్రి నారాయణ పేర్కొన్నారు.


ఇవి కూడా చదవండి...

ఐఏఎస్ అధికారి అహ్మద్ బాబుకు హైకోర్టులో ఎదురుదెబ్బ

మహానాడుపై కాకాణివి అనవసరపు మాటలు: కోటంరెడ్డి గిరిధర్ రెడ్డి

Read Latest AP News And Telugu News

Updated Date - May 05 , 2026 | 04:25 PM