రాజారెడ్డి హత్య కేసుపై పార్థసారథిరెడ్డి సంచలన వ్యాఖ్యలు.. జగన్పై తీవ్ర ఆరోపణలు
ABN , Publish Date - May 21 , 2026 | 06:31 PM
దివంగత సీఎం వైఎస్ రాజశేఖర్ రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పార్థసారథిరెడ్డి సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
కడప, మే 21 (ఆంధ్రజ్యోతి): దివంగత సీఎం వైఎస్ రాజశేఖర రెడ్డి తండ్రి రాజారెడ్డి హత్య కేసులో ప్రధాన నిందితుడిగా ఉన్న పార్థసారథిరెడ్డి (Parthasarathi Reddy) సంచలన వ్యాఖ్యలు చేశారు. ఈ సందర్భంగా వైసీపీ అధినేత వైఎస్ జగన్ మోహన్ రెడ్డిపై తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఈరోజు (గురువారం) కడప వేదికగా ఆయన మీడియాతో మాట్లాడారు. జగన్ చేసిన ప్రతి వ్యాఖ్యకు కౌంటర్ ఇస్తూ పార్థసారథిరెడ్డి ఆరోపణలు చేశారు. ‘నాపై హత్యాయత్నం చేసింది మీరు కాదా?’ అంటూ ప్రశ్నించారు. మంగలి కృష్ణతో కలిసి తనపై సూట్కేస్ బాంబు ప్రయోగించారని ఆయన ధ్వజమెత్తారు.
ఎన్నో హింసలకు గురిచేశారు..
‘మీ తాత మనుషులు నన్ను ఎలా నరికారో.. అలాగే మీ తాతను కూడా నా వర్గీయులు నరికారు. మీ నాన్న రాజకీయాలు మాత్రమే నేర్పించారని చెబుతున్నావు.. కానీ నా అంగబలం, అర్థబలంపై దెబ్బకొట్టి ఎన్నో హింసలకు గురిచేశారు. మీ తాత ఏదో మహాత్ముడు అన్నట్లు బిల్డప్ ఇవ్వొద్దు’ అంటూ జగన్పై షాకింగ్ కామెంట్స్ చేశారు. ‘నా అనుచరులను జైళ్లకు పంపించడం, గనుల వ్యాపారాన్ని రద్దు చేయించేందుకు నాపై కుట్రలు జరిగాయి. నువ్వేదో నాకు ప్రాణభిక్ష పెట్టినట్లు దండోరా వేయిస్తున్నావు.. ఎన్నో పోరాటాలు చేసి ప్రస్తుతం ఇలా నిలబడ్డా. మీరంతా తేనె పూసిన కత్తులైతే.. నేను పౌరుషంతో బతుకుతున్నా. నీ బ్లడ్డే వయలెన్స్.. నువ్వొక న్యూసెన్స్’ అంటూ జగన్పై పార్థసారథిరెడ్డి విమర్శలు చేశారు. ఈ విమర్శలు రాష్ట్ర రాజకీయాల్లో తీవ్ర చర్చకు దారితీశాయి.