మంగళగిరి అభివృద్ధి కోసం చంద్రబాబుతో గొడవ పెట్టుకున్నా: మంత్రి లోకేశ్
ABN , Publish Date - Jul 22 , 2026 | 10:50 AM
గుంటూరు జిల్లా మంగళగిరి నియోజకవర్గంలో రెండో రోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ‘మన ఇల్లు - మన లోకేశ్’ పేరిట మంత్రి నారా లోకేశ్.. ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు.
గుంటూరు జిల్లా, జులై 22: మంగళగిరి నియోజకవర్గంలో రెండో రోజు పేదలకు ఇళ్ల పట్టాల పంపిణీ కార్యక్రమం కొనసాగుతోంది. ‘మన ఇల్లు - మన లోకేశ్’ పేరిట మంత్రి నారా లోకేశ్.. ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టారు. రెండు రోజుల్లో 3,000 మందికి పట్టాలను పంపిణీ చేయనున్నారు. కొండవాలు ప్రాంతాలు, అటవీ భూములు, దేవాలయ భూముల్లో ఇల్లు నిర్మించుకొని దశాబ్దాలుగా ప్రజలు నివసిస్తున్నారు. దీంతో అర్హులైన పేద కుటుంబాలకు మంత్రి బట్టలు పెట్టి.. పసుపు, కుంకుమలతో పట్టాలను అందజేశారు. ఈ సందర్భంగా లోకేశ్ మాట్లాడుతూ.. రాష్ట్రానికి బడ్జెట్ కొరత ఉన్నా మంగళగిరిలో అభివృద్ధి ఆగట్లేదని తెలిపారు.
మంగళగిరి అభివృద్ధి కోసం సీఎం చంద్రబాబుతో కూడా గొడవ పెట్టుకుంటున్నట్లు మంత్రి వెల్లడించారు. ప్రభుత్వ నిధులతో ఇబ్బంది ఉంటే సీఎస్సార్ నిధులు, వివిధ ప్రత్యామ్నాయ మార్గాలు చూసుకుని అభివృద్ధి పనులు చేస్తున్నామన్నారు. ఎక్కడా ఎలాంటి ఆరోపణలు లేకుండా పారదర్శకంగా ఇళ్ల పట్టాల పంపిణీ చేపట్టామన్నారు. ఇచ్చిన హామీ మేరకు బొట్టు పెట్టి ఇళ్ల పట్టాలను అందజేస్తున్నట్లు చెప్పారు. దేశం మొత్తం నిడమర్రు పాఠశాల గురించి మాట్లాడుకోవడం గర్వంగా ఉందన్నారు. ఇంటి పట్టాలతో పాటు భూగర్భ డ్రైనేజీ, 100 పడకల ఆసుపత్రి, నీటి సమస్య.. ఇలా అన్నింటికీ రెండేళ్లలోనే పరిష్కారం చూపిస్తున్నామని తెలిపారు. మంగళగిరి ప్రజలు ఓడించారనే కసితో ఇంకా బాగా పనిచేశానని చెప్పుకొచ్చారు. ప్రతిపక్షంలో ఉండగా 29 సంక్షేమ పథకాలను సొంత నిధులతో అమలు చేసి.. అధికారం ఇస్తే ఇంకెలా చేస్తానో అనే భరోసా కల్పించానని మంత్రి లోకేశ్ పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి..
ఆ మైదానంలో ఆక్రమణలు లేకుండా చర్యలు: మంత్రి టీజీ భరత్
‘పిల్లలను చదివించే ప్రతి తల్లికీ నా వందనం’: మంత్రి లోకేశ్
Read Latest AP News And Telugu News