Share News

కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌

ABN , Publish Date - Jul 22 , 2026 | 05:36 AM

ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు.

కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌

  • పీఎంఈజీపీ నిధులు పెంచండి

  • కేంద్ర మంత్రి మాంఝీకి మంత్రి కొండపల్లి వినతి

న్యూఢిల్లీ, జూలై 21(ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్‌ ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా అమలు చేస్తున్న ‘ఒక కుటుంబం-ఒక పారిశ్రామికవేత్త’ లక్ష్య సాధనకు కేంద్ర ప్రభుత్వం సహాయ సహకారాలు అందించాలని రాష్ట్ర మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కేంద్ర మంత్రులకు విజ్ఞప్తి చేశారు. ఢిల్లీ పర్యటనలో ఉన్న ఆయన మంగళవారం కేంద్ర సూక్ష్మ, చిన్న, మధ్యతరహా పరిశ్రమల శాఖ మంత్రి జితిన్‌రామ్‌ మాంఝీ, ఆ శాఖ సహాయ మంత్రి శోభా కరంద్లాజేతో సమావేశమయ్యారు. పీఎంఈజీపీలో కేంద్ర ప్రభుత్వం ఇచ్చిన లక్ష్యాలను 170శాతం సాధించినట్లు కొండపల్లి తెలిపారు. అందువల్ల 2026-27లో కేటాయింపులను పెంచి రాష్ట్ర ప్రభుత్వాన్ని ప్రోత్సహించాలని కోరారు. కడప జిల్లాలోని కొప్పర్తిలో ఎంఎస్ఎంఈ టెక్నాలజీ సెంటర్‌ ఏర్పాటు చేయాలని, ఎస్‌కే యూనివర్సిటీ, విజయనగరం జేఎన్‌టీయూలలో ఎంఎస్ఎంఈ ఎక్స్‌టెన్షన్‌ సెంటర్ల ఏర్పాటు కార్యాచరణను వేగవంతం చేయాలని కోరగా.. కేంద్ర మంత్రి మాంఝీ సుముఖత వ్యక్తం చేశారు. ఏపీ చాంబర్‌ ఆఫ్‌ కామర్స్‌ ఆధ్వర్యంలో సెప్టెంబరులో విశాఖపట్నంలో నిర్వహించనున్న ఎంఎస్ఎంఈ ఎక్స్‌పో కార్యక్రమానికి హాజరుకావాలని జితిన్‌ రామ్‌ మాంఝీని కొండపల్లి ఆహ్వానించారు.


పీఎంఎఫ్ఎంఈ సబ్సిడీని స్త్రీ నిధి ఖాతాకు విడుదల చేయండి

స్త్రీ నిధి రుణాలతో ఏర్పాటు చేసే పీఎంఎస్ఎంఈ యూనిట్ల సబ్సిడీ మొత్తాన్ని నేరుగా ‘స్త్రీ నిధి’ ఖాతాకే విడుదల చేయాలని మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ కేంద్రాన్ని కోరారు. స్త్రీ నిధి మేనేజింగ్‌ డైరెక్టర్‌తో కలిసి కేంద్ర ఆహార ప్రాసెసింగ్‌ పరిశ్రమల కార్యదర్శి అవినాష్‌ ప్రకాశ్‌ జోషి, సంయుక్త కార్యదర్శి దేవేష్‌ దేవల్‌తో మంగళవారం ఆయన భేటీ అయ్యారు. పీఎంఎస్ఎంఈ అమలును వేగవంతం చేయడం, మహిళా పారిశ్రామికవేత్తలకు సాధికారత కల్పించే లక్ష్యంతో కొన్ని కీలక ప్రతిపాదనలను వారికి అందజేశారు. పీఎంఎస్ఎంఈ పథకం కింద స్త్రీ నిధి ద్వారా స్వయం సహాయక మహిళలకు అందించే రుణాలకు వడ్డీ రాయితీ వర్తింపజేయాలని విజ్ఞప్తి చేశారు. మహిళా పారిశ్రామికవేత్తలకు శిక్షణ, మార్గదర్శకత్వం, హ్యాండ్‌హోల్డింగ్‌ సేవలు అందించేందుకు జిల్లా, మండల సమాఖ్యలను పీఎంఎస్ఎంఈ జిల్లా వనరుల సంస్థలుగా గుర్తించాలన్న తన విజ్ఞప్తికి కేంద్ర అధికారులు సానుకూలంగా స్పందించారని మంత్రి కొండపల్లి తెలిపారు.

‘భోగాపురం’లో స్వయం బ్రాండ్‌ స్టాల్‌ ఏర్పాటుకు వినతి

రాష్ట్రంలోని స్వయం సహాయక సంఘాల మహిళలు తయారు చేసే స్వయం బ్రాండ్‌ ఉత్పత్తులకు గ్లోబల్‌ మార్కెటింగ్‌ కల్పించే క్రమంలో భోగాపురం విమానాశ్రయంలో స్వయం ఉత్పత్తుల విక్రయం కోసం ప్రత్యేక స్టాల్‌ కేటాయించాలని కేంద్ర మంత్రి రామ్మోహన్‌ నాయుడు, జీఎంఆర్‌ యాజమన్యానికి మంత్రి కొండపల్లి శ్రీనివాస్‌ విజ్ఞప్తి చేశారు. దీనిపై వారు సానుకూలంగా స్పందించారని మంత్రి కొండపల్లి తెలిపారు.

Updated Date - Jul 22 , 2026 | 05:37 AM