పిల్ల కాంగ్రెస్ పిల్ల చేష్టలకు నివ్వెరపోతున్న ప్రపంచం: ఎంపీ లక్ష్మణ్
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:39 PM
రాజధాని అమరావతికి చట్టబద్ధత కల్పించే బిల్లు బుధవారం లోక్సభలో ఆమోదం పొందింది. అనంతరం ఈ బిల్లు రాజ్యసభకు చేరుకుంది. గురువారం రాజ్యసభలో ఈ బిల్లు ఆమోదంపై చర్చ జరిగింది. ఈ సందర్భంగా రాజ్యసభ సభ్యుడు, బీజేపీ సీనియర్ నేత కె.లక్ష్మణ్ సభలో మాట్లాడారు.
న్యూఢిల్లీ, ఏప్రిల్ 02: రాజధాని అమరావతి విషయంలో వైసీపీ తీరు చూసి ప్రజలు నవ్వుకుంటున్నారని బీజేపీ ఎంపీ కె.లక్ష్మణ్ ఎద్దేవా చేశారు. రాష్ట్రాలకు రాజధాని గురించి చట్టంలో ఉందా? అని ఆ పార్టీ అధినేత జగన్ ప్రశ్నిస్తున్నారని పేర్కొన్నారు. తాజాగా 'మావిగన్' అనే పేరు తీసుకొచ్చారని ఆయన వ్యంగ్యంగా అన్నారు. దాంతో పిల్ల కాంగ్రెస్ పిల్ల చేష్టలకు ప్రపంచం నివ్వెరపోయిందని ఎద్దేవా చేశారు. పిల్ల చేష్టలతో రాజధాని అంశంలో వైసీపీ మూడుముక్కలాట ఆడిందని మండిపడ్డారు.
ఎన్నికల్లో పిల్ల కాంగ్రెస్, తల్లి కాంగ్రెస్ను ప్రజలు మట్టి కరిపించారని గుర్తు చేశారు. రాజధాని అమరావతికి చట్టబద్ధత బిల్లు ఆమోదంపై గురువారం రాజ్యసభలో చర్చ జరిగింది. ఈ సందర్భంగా ఎంపీ కె.లక్ష్మణ్ మాట్లాడారు. దేశ భాషలందు తెలుగులెస్స అంటూ ఆయన తన ప్రసంగాన్ని ప్రారంభించారు.
అమరావతి కోసం సుదీర్ఘ పోరాటం చేసిన రైతులకు నమస్కారాలు తెలిపారు. తెలుగు జాతి చరిత్ర అందరూ తెలుసుకోవాల్సిన అవసరం ఉందన్నారు. ప్రత్యేక రాష్ట్రం కోసం పొట్టి శ్రీరాములు నిరాహార దీక్ష చేసి.. ప్రాణత్యాగం చేశారని గుర్తు చేశారు. రాజధాని కోసం 29 వేల మందికిపైగా రైతులు తమ భూములు ఇచ్చారని పేర్కొన్నారు.
ఏపీ, తెలంగాణను గతంలో కొంతమంది ప్రముఖులు విలీనం చేశారని ఎంపీ కె.లక్ష్మణ్ గుర్తు చేశారు. తెలంగాణకు ఇచ్చిన హామీలను గత ప్రభుత్వాలు నెరవేర్చలేదని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఆ క్రమంలో ప్రభుత్వాన్ని నిలదీసినందుకు ప్రజలను కాల్చి చంపిన చరిత్ర కాంగ్రెస్ పార్టీది అని అన్నారు. చొక్కాలు మార్చినట్లుగా సీఎంలను కాంగ్రెస్ పార్టీ మార్చిందని చెప్పారు. తెలుగు ప్రజల కోసం ఎన్టీఆర్ పార్టీ స్థాపించారన్నారు.
కాంగ్రెస్ విధానాలపై ఎన్టీఆర్ పోరాటం చేశారని గుర్తు చేశారు. అన్ని వర్గాల అభివృద్ధి కోసం ఎన్టీఆర్ కృషి చేశారని ఎంపీ కె.లక్ష్మణ్ తెలిపారు. బీసీలు, అట్టడుగు వర్గాలకు అవకాశాలు కల్పించిన వ్యక్తి ఎన్టీఆర్ అని కొనియాడారు. హైదరాబాద్ను ఐటీ హబ్గా మార్చడంలో చంద్రబాబు పాత్ర మరువలేనిదన్నారు. విభజన తర్వాత అమరావతి కోసం చంద్రబాబు సంకల్పం తీసుకున్నారని ఆయన పేర్కొన్నారు.
రాజధాని ఏర్పాటు సందర్భంగా పార్లమెంట్ నుంచి మట్టి, పవిత్ర జలాలను అమరావతికి ప్రధాని మోదీ తెచ్చారన్నారు. ఏపీకి అండగా ఉంటామని భరోసా ఇస్తూ అమరావతికి ప్రధాని మోదీ శంకుస్థాపన చేశారని తెలిపారు. అమరావతికి చట్టబద్ధత బిల్లు కోసం ప్రజలు ఎదురుచూస్తున్నారని అన్నారు. రాజధానిని ఎవరూ మార్చకుండా పార్లమెంట్లో చట్టం తెస్తున్నారని బీజేపీ ఎంపీ లక్ష్మణ్ వివరించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
For More AP News And Telugu News