తెలుగు ప్రజలంతా గర్వించాల్సిన సమయమిది: కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు
ABN , Publish Date - Apr 02 , 2026 | 02:40 PM
రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని తమ నాయకుడు సీఎం చంద్రబాబు నేర్పించారని కేంద్రమంత్రి రామ్మోహన్ నాయుడు తెలిపారు. తెలుగు ప్రజలందరికీ నేడు చరిత్రాత్మకమైన రోజు అని ఆయన అన్నారు.
అమరావతి: తెలుగు ప్రజలందరికీ నేడు చరిత్రాత్మకమైన రోజు అని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు అన్నారు. ఆంధ్రప్రదేశ్ రాజధాని అమరావతి బిల్లును తెలుగు ప్రజలంతా గర్వంగా భావిస్తున్నారని ఆయన చెప్పారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ విభజన తర్వాత రాజధాని లేని రాష్ట్రంగా ఏపీ మారిందని.. నేడు ఆ లోటు భర్తీ కానుందని రామ్మోహన్ నాయుడు సంతోషం వ్యక్తం చేశారు. ఏపీ విభజన జరిగిన తీరుకు తాము వ్యతిరేకమని.. రాజధాని బిల్లు ఎందుకు తెచ్చారనేది అందరూ తెలుసుకోవాలని విజ్ఞప్తి చేశారు.
రాజధాని లేని రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్ ఉన్నప్పటికీ సంక్షోభాలను అవకాశాలుగా మలుచుకోవాలని తమ నాయకుడు సీఎం చంద్రబాబు నేర్పించారని కేంద్ర మంత్రి అన్నారు. వాజ్పేయి హయాంలో 3 రాష్ట్రాల విభజన జరిగిందని.. ఆ సమయంలో ఎలాంటి ఇబ్బందులూ రాలేదన్నారు. కానీ, ఆంధ్రప్రదేశ్ విభజన సమయంలో ఏపీకి రాజధాని లేకుండా వదిలేయడంతోనే సమస్య మొదలైందన్నారు. ఆ సమయంలో ఏపీకి రూ.16 వేల కోట్ల రెవెన్యూ లోటు ఉందని చెప్పుకొచ్చారు. 2019 నుంచి 2024 మధ్య ఏపీలో చీకటి రోజులు ఉన్నాయని రామ్మోహన్ నాయుడు అన్నారు.
మూడు రాజధానుల పేరుతో గందరగోళం సృష్టించారని.. రాజధాని కోసం ఉద్యమించిన రైతులను తీవ్రంగా హింసించారని కేంద్ర మంత్రి ఆవేదన వ్యక్తం చేశారు. గర్భిణులు అని కూడా చూడకుండా లాఠీలతో కొట్టించారని మండిపడ్డారు. ప్రజా రాజధాని అమరావతి చరిత్రలో గుర్తుంటుందన్నారు. కృష్ణానది తీరంలో అమరావతి నిర్మించాలనేది ఏపీ ప్రభుత్వ నిర్ణయమని.. ఐకానిక్, వరల్డ్ క్లాస్ రాజధానిగా నిర్మాణం జరుగుతోందని కేంద్ర మంత్రి రామ్మోహన్ నాయుడు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
అమరావతే ఏకైక రాజధాని.. సంబరాలు జరపండి: మంత్రి నాదెండ్ల మనోహర్
ఏపీ రాజధాని బిల్లు రైతుల విజయం: రేణుకా చౌదరి