ఏపీ వక్ఫ్ బోర్డ్ కీలక నిర్ణయం.. విద్యార్థులకు మరో విద్యా పథకం
ABN , Publish Date - Apr 21 , 2026 | 05:29 PM
ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 14వ వక్ఫ్ బోర్డ్ సమావేశం మంగళవారం జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆయా అజెండాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు.
విజయవాడ, ఏప్రిల్ 21 (ఆంధ్రజ్యోతి): ఆంధ్రప్రదేశ్ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ అధ్యక్షతన 14వ వక్ఫ్ బోర్డ్ సమావేశం ఈరోజు (మంగళవారం) జరిగింది. ఈ సమావేశంలో పలు అంశాలపై చర్చించారు. ఆయా అజెండాలపై ఏకగ్రీవంగా తీర్మానాలు ఆమోదించారు. ఈ మేరకు ఏపీ వక్ఫ్ బోర్డ్ చైర్మన్ అబ్దుల్ అజీజ్ ఓ ప్రకటన విడుదల చేశారు. ముస్లిం విద్యార్థులకు కార్పొరేట్ విద్య ఖర్చులను వక్ఫ్ బోర్డ్ భరిస్తుందని తెలిపారు. ‘తాలీం ఏ హునర్’ పేరుతో వక్ఫ్ బోర్డు ఇప్పటికే స్కిల్ డెవలప్మెంట్ కేంద్రాలు నడుపుతోందని.. అదే పేరుతో ఈ విద్యా పథకం కొనసాగుతుందని స్పష్టం చేశారు.
ప్రతి సంవత్సరం 500 మందికి ఉచిత ఇంటర్మీడియట్ రెసిడెన్షియల్ విద్యను అమలు చేస్తామని వెల్లడించారు. రెసిడెన్షియల్ ఇంటర్మీడియట్ విద్యతో పాటు జేఈఈ మెయిన్స్, నీట్ కోసం ఉచిత శిక్షణ ఇప్పిస్తామని వివరించారు. మొదటి ఏడాది 250 మందితో ఈ పథకాన్ని ప్రారంభిస్తామని.. రెండో ఏడాది నుంచి ఏటా 500 మందికి ఉచిత విద్య అందజేస్తామని తెలిపారు. ట్యాలెంట్ టెస్ట్ ద్వారా ముస్లిం విద్యార్థులను ఎంపిక చేస్తామని అన్నారు. వక్ఫ్ బోర్డ్ ఆధ్వర్యంలో నాణ్యమైన ఉన్నత విద్యకు ప్రాధాన్యం కల్పిస్తామని చెప్పుకొచ్చారు. పదోతరగతి ఫలితాల తర్వాత ట్యాలెంట్ టెస్ట్ నిర్వహిస్తామని అబ్దుల్ అజీజ్ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మహిళా బిల్లును డీఎంకే అడ్డుకుంది.. సీఎం చంద్రబాబు ధ్వజం
అభివృద్ధి దిశగా రాష్ట్రాన్ని నడిపించే విజనరీ లీడర్ చంద్రబాబు: జనార్దన్ రెడ్డి
జగన్వి క్రిమినల్ రాజకీయాలు.. మంత్రి నిమ్మల ధ్వజం
Read Latest AP News And Telangana News And International News And Telugu News