జేపీ వెంచర్స్దే బాధ్యత
ABN , Publish Date - Jul 31 , 2026 | 09:12 AM
గత జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక క్వారీలలో అక్రమంగా మైనింగ్ చేసింది జేపీ వెంచర్స్ సంేస్థనని ఎన్జీటీ ఇప్పటికే స్పష్టంగా నిర్ధారించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వెల్లడించింది. ఈ వ్యవహారంపై ఎన్జీటీలో మరోసారి విచారణ జరపాల్సిన అవసరం లేదని తెలిపింది.
గత జగన్ ప్రభుత్వంలో ఇసుక అక్రమ మైనింగ్ తవ్వకాలు జరిపింది జేపీయేనని ఎన్జీటీ స్పష్టీకరణ
మళ్లీ విచారణ అవసరం లేదన్న ఏపీ సర్కార్
మావి 7 క్వారీలే.. 7 కోట్లు జరిమానా కట్టాం
మిగతా క్వారీల లైసెన్సులన్నీ ప్రభుత్వం పేరిటే
సుప్రీంలో జేపీ వెంచర్స్ వాదన.. ఖండించిన సర్కార్
ఎన్జీటికి పంపడంపై ఆగస్టు 11న తేలుస్తాం: సుప్రీం
న్యూఢిల్లీ, జూలై 30(ఆంధ్రజ్యోతి): గత జగన్ ప్రభుత్వ హయాంలో ఇసుక క్వారీలలో అక్రమంగా మైనింగ్ చేసింది జేపీ వెంచర్స్ సంేస్థనని ఎన్జీటీ ఇప్పటికే స్పష్టంగా నిర్ధారించిందని ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం సుప్రీం కోర్టులో వెల్లడించింది. ఈ వ్యవహారంపై ఎన్జీటీలో మరోసారి విచారణ జరపాల్సిన అవసరం లేదని తెలిపింది. అప్పట్లో జరిగిన ఇసుక రీచ్ల కేటాయింపులు, అక్రమ మైనింగ్పై నమోదైన ‘జైప్రకాశ్ పవర్ వెంచర్స్ లిమిటెడ్ వర్సెస్ నాగేంద్ర కుమార్’ సహా ఇతర పిటిషన్లు గురువారం జస్టిస్ సంజయ్ కరోల్ నేతృత్వంలోని జస్టిస్ అగస్టిన్ జార్జ్ మసీ్హలతో కూడిన సుప్రీం కోర్టు ద్విసభ్య ధర్మాసనం విచారించింది. తొలుత జేపీ వెంచర్స్ వాదనలు వినిపించింది.
గత జగన్ ప్రభుత్వ హయాంలో జరిగిన ఇసుక అక్రమ తవ్వకాలకు అసలు బాధ్యులెవరనేది నేషనల్ గ్రీన్ ట్రైబ్యునల్(ఎన్జీటీ)నే తేల్చాలని కోరింది. నాడు జరిగిన ఉల్లంఘనలు, కాంట్రాక్టు నిబంధనల అమలుపై సమగ్ర విచారణ జరిపి బాధ్యులెవరనేది నిర్ధారించే అధికారం ఎన్జీటీకే ఉందంటూ వాదించింది. ‘మా పేరిట ఉన్నవి 7 ఇసుక క్వారీ లైసెన్సులు మాత్రమే. అందుకే ట్రైబ్యునల్ ప్రాథమిక ఆదేశాల మేరకు రూ.7 కోట్లను కోర్టులో జమ చేశాం. కానీ ఎన్జీటీ జరిమానా విధించిన మిగతా ఇసుక క్వారీల లైసెన్సులన్నీ అప్పటి ప్రభుత్వం పేరుపైనే ఉన్నాయి. ఆ క్వారీలకు అసలు యజమానులు ఎవరు? అక్రమాలకు పాల్పడిందెవరు? అనే విషయాన్ని ఎన్జీటీ తేల్చాలి’ అని జేపీ వెంచర్స్ తరఫు న్యాయవాది కోరారు.
జేపీ వెంచర్స్ వాదనను ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వ న్యాయవాది ఖండించారు. సదరు ఇసుక క్వారీలలో అక్రమంగా మైనింగ్ చేసింది జేపీ వెంచర్స్ సంేస్థనని ఎన్జీటీ ఇప్పటికే స్పష్టంగా నిర్ధారించిందన్నారు. ఆ ఉల్లంఘనల ఆధారంగానే గతంలో రూ.18 కోట్ల భారీ జరిమానా విధించిందని గుర్తుచేశారు. ఎన్జీటీ ఇప్పటికే కేసును ముగించినందున, విధించిన జరిమానాపై సుప్రీంకోర్టే నిర్ణయం తీసుకోవాలని ఏపీ ప్రభుత్వం కోరింది. ఇరుపక్షాల వాదనలు విన్న ధర్మాసనం.. కేసును మళ్లీ ఎన్జీటీకి పంపాలా? లేదా? అన్న విషయంపై ఆగస్టు 11న నిర్ణయం తీసుకుంటామంది.
వార్తలు కూడా చదవండి...
హిందుత్వం అంటే మతం కాదు జీవన విధానం: వెంకయ్యనాయుడు
గాదె సాయి కృష్ణ కేసులో సిట్ దర్యాప్తు ముమ్మరం.. వారం రోజుల కస్టడీకి మాజీ సీఐ నాగరాజు
Read Latest AP News And Telangana News And National News
And Telugu News