శ్రామికులే దేశ అభివృద్ధికి బలం: మంత్రి నారా లోకేశ్
ABN , Publish Date - May 01 , 2026 | 09:10 AM
మే డే సందర్భంగా కార్మిక సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ శుభాకాంక్షలు తెలిపారు. సమాజ ప్రగతిలో కార్మికులు ముఖ్యపాత్ర పోషిస్తున్నారని ఈ సందర్భంగా ఆయన కొనియాడారు.
అమరావతి, మే1 (ఆంధ్రజ్యోతి): మే డే సందర్భంగా కార్మిక సోదరులందరికీ ఆంధ్రప్రదేశ్ విద్య, ఐటీ శాఖల మంత్రి నారా లోకేశ్ (AP Minister Nara Lokesh) శుభాకాంక్షలు తెలిపారు. సమాజ ప్రగతిలో ముఖ్యపాత్ర పోషిస్తున్న కార్మిక లోకానికి, శ్రమజీవులకు మే డే శుభాకాంక్షలు తెలియజేస్తున్నానని అన్నారు. శ్రమతోనే అభివృద్ధి సాధ్యమని, శ్రామికుడు లేనిదే ప్రపంచం లేదని చెప్పుకొచ్చారు. ఈ మేరకు సామాజిక మాధ్యమం ఎక్స్ వేదికగా పోస్ట్ చేశారాయన.
కార్మికుల సంక్షేమం కోసం ప్రజా ప్రభుత్వం అహర్నిశలు కృషిచేస్తోందని వ్యాఖ్యానించారు లోకేశ్. వారికోసం ప్రభుత్వం అనేక కార్యక్రమాలను రూపొందించి అమలుచేస్తోందన్నారు. కార్మికులు గౌరవంగా జీవించాలని.. ఇదే ప్రజా ప్రభుత్వ సంకల్పమని ఎక్స్లో పేర్కొన్నారు.
కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం ప్రభుత్వం కట్టుబడి ఉంది: హోంమంత్రి అనిత

అంకితభావం, కృషితో సమాజాన్ని ముందుకు నడిపిస్తున్న శ్రామిక సోదర సోదరీమణులందరికీ ఏపీ హోంమంత్రి వంగలపూడి అనిత అంతర్జాతీయ కార్మిక దినోత్సవ శుభాకాంక్షలు తెలిపారు. కార్మికుల హక్కులు, సంక్షేమం కోసం తమ ప్రభుత్వం కట్టుబడి ఉందని వ్యాఖ్యానించారు. కార్మికులు, కర్షకులే దేశ ఆర్థిక వ్యవస్థకు పునాది అని చెప్పుకొచ్చారు. మేడే కార్మికుల పోరాటాలకు ప్రతీక అని పేర్కొన్నారు. అన్నిరంగాల కార్మికులకు ఆరోగ్యం, ఆనందం కలగాలని ఆకాంక్షించారు. కార్మిక కుటుంబాలు సుఖసంతోషాలతో ఉండాలని కోరుకుంటున్నానని హోం మంత్రి అనిత పేర్కొన్నారు.
సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిది: ఆంజనేయులు

దేశ ప్రగతి చక్రం కార్మికుడి చెమట చుక్కతోనే తిరుగుతోందని ఏపీ ప్రభుత్వ చీఫ్ విప్ జీవీ ఆంజనేయులు వ్యాఖ్యానించారు. సమాజ నిర్మాణంలో కార్మికుల పాత్ర వెలకట్టలేనిదని తెలిపారు. ఈరోజు (శుక్రవారం) పల్నాడు జిల్లా వినుకొండలో మేడే వేడుకల్లో జీవీ ఆంజనేయులు పాల్గొని మాట్లాడారు. కూటమి ప్రభుత్వం కార్మికుల సంక్షేమానికి పెద్దపీట వేస్తూ, వారి సామాజిక భద్రత కోసం విప్లవాత్మక నిర్ణయాలు తీసుకుంటోందని అన్నారు. అసంఘటిత రంగ కార్మికులకు భారీ స్థాయిలో బీమా సౌకర్యం కల్పిస్తూ, వారి కుటుంబాలకు భరోసా ఇస్తున్నామని తెలిపారు. కార్మికులు ప్రమాదవశాత్తు మరణించినా లేదా అంగవైకల్యం పొందినా, వారి కుటుంబాలకు తక్షణ ఆర్థిక సాయం అందేలా చర్యలు తీసుకుంటున్నామని చెప్పుకొచ్చారు. కార్మికుల కోసం ప్రత్యేకంగా ఈఎస్ఐ ఆస్పత్రులను బలోపేతం చేస్తున్నామనితెలిపారు. కార్మికులకు నాణ్యమైన వైద్య సేవలను అందుబాటులోకి తీసుకువచ్చామని ఆంజనేయులు పేర్కొన్నారు..
ఈ వార్తలు కూడా చదవండి...
టీమ్ ఏపీ కృషితోనే బిజినెస్ రిఫార్మర్ అవార్డు: సీఎం చంద్రబాబు
ఏపీలో పెట్టుబడులకు ముందుకొచ్చిన టైటాన్ సంస్థ
Read Latest AP News And Telangana News And International News And Telugu News