రుయాకు ‘గుండె’ జబ్బు
ABN , Publish Date - Feb 03 , 2026 | 11:01 AM
తిరుపతిలోని రుయా ఆసుపత్రిలో కార్డియాలజీ విభాగంలో వసతులు లేకపోవడంతో ఇక్కడి ప్రజలు ఇబ్బందులు ఎదుర్కోవాల్సి వస్తోంది. జిల్లానుంచేగాక చుట్టుపక్కల జిల్లాల నుంచి కూడా రోగులు వస్తుంటారు. అయితే... ప్రధానంగా కార్డియాలజీ విభాగంలో వసతులు లేక రోగులు ఇబ్బందుతు పడుతున్నారు.
కార్డియాలజీ విభాగంలో వసతులు కరువు
మూలనపడిన టీఎంటీ మిషన్
క్యాత్ల్యాబ్ కోసం స్విమ్స్కు వెళ్లాల్సిందే
వేధిస్తున్న బెడ్ల కొరత
తిరుపతి ఆంధ్రజ్యోతి:
తిరుపతి రుయాస్పత్రి కార్డియాలజీ విభాగాన్ని వసతుల కొరత వేధిస్తోంది. కొన్నేళ్లుగా ఇదే పరిస్థితి ఉన్నా చికిత్స చేసే వైద్యుడే కనిపించడం లేదు. రాయలసీమ పరిధిలోని ఉమ్మడి చిత్తూరు జిల్లా నుంచే కాకుండా కడప, నెల్లూరు, అనంతపురం, కర్నూలు జిల్లాల నుంచి గుండె జబ్బు బాధితులు ఇక్కడకు వస్తుంటారు. దీనికి తగ్గట్లు ఇక్కడ వైద్య పరీక్షలు, సేవలు పూర్తి స్థాయిలో లేకపోవడంతో రోగులు ఇబ్బంది పడుతున్నారు.
తూతూమంత్రంగా సేవలు
రుయా కార్డియాలజీ విభాగంలో సోమ, బుధ, శుక్రవారం మాత్రమే ఓపీలు చూస్తారు. ఈ మూడు రోజుల్లోనే దాదాపు 500మంది వరకు గుండె సంబంధిత వ్యాధిగ్రస్తులు వస్తున్నారు. వీరిలో 100 నుంచి 120 మంది అడ్మిట్ అవుతున్నారు. వీరికి సరిపడా బెడ్లు అందుబాటులో లేవు. కేవలం 10 బెడ్లు మాత్రమే ఉండడంతో జనరల్ మెడిసిన్ వార్డులో అడ్మిట్ చేసి తూతూమంత్రంగా వైద్య సేవలు చేస్తున్నారనే విమర్శలు వినిపిస్తున్నాయి. పైగా డాక్టర్లు రాసిచ్చే వైద్య పరీక్షలు అందుబాటులో లేకపోవడంతో స్విమ్స్కు వెళ్లి వేలాది రూపాయలు వెచ్చించి చేయించుకోవాల్సి వస్తోంది. ఇక్కడకు వస్తున్న రోగుల్లో ఈసీజీ తీసి అందులో తేడాలుంటే 2డీ ఎకో స్కానింగ్ తీస్తారు. దానికి సంబంధించి ఒక మిషన్ మాత్రమే ఉండటంతో రోజుల తరబడి నిరీక్షణ తప్పడం లేదు. సాంకేతిక నిపుణులు కూడా అందుబాటులో లేరు.
ఐసీయూ వార్డు కోసం ఎదురు చూపులు
రుయాలో గుండె సంబంధిత రోగులకు అవసరమైన ఐసీయూ వార్డు లేదు. 20 ఏళ్లుగా ఈ వార్డు ఏర్పాటుకు అధికారులు చేస్తున్న కృషి ఫలించడం లేదు. దీనికితోడు ఈ యూనిట్లో ఇద్దరు ప్రొఫెసర్లు, ఇద్దరు అసోసియేట్ ప్రొఫెసర్లు, అసిస్టెంట్ ఫ్రొఫెసర్లు ఉండాలి. ప్రస్తుతం ఒకే అసిస్టెంట్ ఫ్రొఫెసర్ ఉన్నారు. వైద్య సిబ్బంది కొరత తీవ్రంగా ఉన్నా పట్టించుకునే దిక్కు లేకుండా పోయింది.
మూలనపడిన టీఎంటీ మెషిన్
గుండె పనితీరును తెలుసుకోవడం కోసం 30ఏళ్ల క్రితం ఏర్పాటు చేసిన ట్రెడ్ మిల్ టెస్టు మెషిన్(టీఎంటీ) కొన్ని రోజుల క్రితం పాడైంది. దాన్ని పూర్తిగా మూలనపడేశారు. ఈ పరీక్షల కోసం రోగులను స్విమ్స్కు రెఫర్ చేస్తున్నారు. క్యాత్ల్యాబ్(ఆపరేషన్) కోసం స్విమ్స్కే వెళ్లాల్సి వస్తోంది. అక్కడకు వెళ్లి మళ్లీ ఓపీ తీసుకుని సంబంధిత వైద్యుడు పరీక్షించి, వైద్యం అందించే లోపు కొన్ని సందర్భాల్లో జరగరాని నష్టం జరిగిపోతోంది.
ఈ వార్తలు కూడా చదవండి.
దిగి వస్తున్నాయి.. ఈ రోజు మీ నగరంలో బంగారం, వెండి ధరలు ఎలా ఉన్నాయంటే..
రైల్వే బడ్జెట్లో.. రాష్ట్రానికి 10134 కోట్లు
Read Latest Telangana News and National News