మళ్లీ ఉల్లి సాగు..
ABN , Publish Date - Sep 08 , 2026 | 01:55 PM
అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని సానిపల్లి ఉల్లి సాగుకు ప్రసిద్ధి. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో పంట పెట్టేవారు.
ధరల పెరుగుదలతో రైతుల ఆసక్తి
సానిపల్లిలో ముగిసిన పంట విరామం
60 ఎకరాల్లో సాగు
మరింత పెరుగుతున్న విస్తీర్ణం
రొద్దం(అనంతపురం): అనంతపురం జిల్లా రొద్దం మండలంలోని సానిపల్లి ఉల్లి సాగుకు ప్రసిద్ధి. ఉమ్మడి జిల్లాలోనే అత్యధిక విస్తీర్ణంలో పంట పెట్టేవారు. పదేళ్లుగా ఉల్లికి ధరలు లేక పంట సాగుకు గ్రామ రైతులు దూరమయ్యారు. పంట విరామం ప్రకటించారు. ప్రస్తుతం ధరలు పెరుగుతుండడంతో మళ్లీ ఉల్లి సాగు వైపు మళ్లారు. ఇప్పటికే 60 ఎకరాల్లో పంట సాగులో ఉంది. ఇది మరింత పెరుగుతోంది. సానిపల్లిలో ఒకప్పుడు 200 ఎకరాల్లో ఉల్లి సాగు చేసేవారు. ఏడాదికి రెండు పంటలు సాగుచేస్తూ రూ.కోటిదాకా ఆదాయం పొందేవారు.
పదేళ్లుగా ఉల్లి సాగుచేసి ధరలులేక రైతులు నష్టపోయారు. దీంతో ఉల్లి పంటకు విరామం ఇచ్చారు. ప్రస్తుతం ధరలు పెరుగుతుండడంతో రైతులు ఉల్లి సాగుకు ఆసక్తి చూపుతున్నారు. ఉల్లి విత్తనాలు కిలో రూ.3 వేలు పలుకుతున్నాయి. ఎకరాకి 3 కిలోలు అవసరం. ఇతర సేద్యం పనులు, కూలీలు, రసాయన మందుల ఖర్చులు కలిపి ఎకరాకి రూ.లక్షదాకా పెట్టుబడి వస్తుంది. ఎకరాకి 300 క్వింటాళ్లదాకా పండుతుంది. ధరలు బాగా ఉంటే రూ.4లక్షలు ఆదాయం వచ్చే అవకాశం ఉందని రైతులు చెబుతున్నారు.
ప్రభుత్వం ప్రోత్సాహకాలు ఇవ్వాలి
ఎకరాలో ఉల్లి సాగుకు రూ.లక్ష ఖర్చవుతోంది. ప్రభుత్వం గతంలో ఉల్లి విత్తనాలు సబ్సిడీ ధరలతో పంపిణీ చేసేది. సానిపల్లిలోనే 200 ఎకరాల్లో పంట పెట్టి, రూ.కోటి ఆదాయం పొందేవారు. పంట సాగుకు ప్రభుత్వ ప్రోత్సాహకాలు పెంచాలి. మైక్రో స్ర్పింక్లర్లు సబ్సిడీ ధరలతో అందించాలి.
సూర్యనారాయణ, ఉల్లి రైతు, సానిపల్లి
గిట్టుబాటు ధర కల్పించాలి
ధరలు లేక కొన్నేళ్లపాటు పంట విరామం ప్రకటించాం. ప్రస్తుతం ధరలు ఆశాజనకంగా ఉండడంతో సాగు చేస్తున్నాం. గిట్టుబాటు ధర కల్పిస్తే సాగు విస్తీర్ణం మరింత పెరిగే అవకాశం ఉంది.
అశ్వత్థప్ప, ఉల్లి రైతు, సానిపల్లి
ఈ వార్తలు కూడా చదవండి:
అభివృద్ధితో ఓటు బ్యాంక్ పెంచుకుందాం
మెగా డీఎస్సీపై వైసీపీది తప్పుడు ప్రచారం
Read Latest AP News And Telangana News And International News And Telugu News