Share News

Scanning Centers: స్కానింగ్‌ సెంటర్ల అక్రమ వసూళ్లు

ABN , Publish Date - Sep 15 , 2025 | 10:41 AM

జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్కానింగ్‌సెంటర్లు ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల నియంత్రణ లేకపోవడంతో ఒక్కోస్కానింగ్‌ సెంటర్‌లో పరీక్షలకు ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు.

 Scanning Centers: స్కానింగ్‌ సెంటర్ల అక్రమ వసూళ్లు
Scanning Centers

  • పలు స్కానింగ్‌ సెంటర్ల అక్రమ దందా

  • బోర్డుపై ఓ రేటు...వసూలు చేసేది మరో రేటు

  • సీటీ స్కాన్‌, ఎంఆర్‌ఐ, ఎక్స్‌రేలకు అంతా రెఫరల్‌

  • పలు సెంటర్లలో టెక్నీషియన్లుగా జూనియర్లు

  • నామమాత్రంగా అధికారుల తనిఖీలు

జగిత్యాల, సెప్టెంబరు 14 (ఆంధ్రజ్యోతి): జిల్లాలోని పలు ప్రాంతాల్లో స్కానింగ్‌సెంటర్లు (Scanning Centers) ఇష్టారాజ్యంగా వ్యవహరిస్తూ ప్రజలను దోచుకుంటున్నాయనే విమర్శలు వెల్లువెత్తుతున్నాయి. ధరల నియంత్రణ లేకపోవడంతో ఒక్కోస్కానింగ్‌ సెంటర్‌లో పరీక్షలకు ఒక్కో రకంగా ఫీజులు వసూలు చేస్తున్నారు. కొన్నిసెంటర్ల నిర్వాహకులు రెఫరల్‌ డాక్టర్లకు కమీషన్లు ముట్టజెబుతూ లక్షల రూపాయలు సంపాదిస్తున్నారనే ఆరోపణలున్నాయి.


ప్రధానంగా జగిత్యాలతో పాటు కోరుట్ల, మెట్‌పల్లి, ధర్మపురి, రాయికల్‌ తదితర ప్రాంతాల్లో ఈ దందా జోరుగా సాగుతోంది. గర్భిణులతో పాటు ఇతరులకు చెస్ట్‌, గ్యాస్టో, లివర్‌ తదితర సమస్యలు తెలుసుకు నేందుకు సంబంధిత వైద్యులు స్కానింగ్‌కు రిఫర్‌ చేస్తుంటారు. గాయాలు, తలనొప్పి, చెస్ట్‌, నరాల సమస్య ఎదుర్కొనే రోగులకు ఆర్థో, ఇతర వైద్యులు ఎక్కువగా ఎక్స్‌రే, సీటీస్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐలను రాస్తుం టారు. అందులో వచ్చే రిపోర్టు ఆధారంగానే వైద్యు లు చికిత్స చేస్తారు.


అధికంగా ఫీజుల వసూళ్లు..

ఎక్స్‌రే కోసం రూ.500 నుంచి రూ.1200, స్కానింగ్‌ కు రూ.800నుంచి రూ.2000వరకు రోగుల నుంచి నిర్వాహకులు వసూలు చేస్తున్నారు. ఇక సిటీస్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐల విషయానికొస్తే ఫీజులు వేలల్లో ఉంటు న్నాయి. జిల్లా వ్యాప్తంగా సుమారు 80వరకు అలా్ట్ర సౌండ్‌ స్కానింగ్‌ సెంటర్లు, పదుల సంఖ్యలో ఎక్స్‌రే, సిటీ స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐలు ఉన్నాయి. పలు సెంట ర్లలో ధరల నియంత్రణ పాటించడం లేదు. పేరుకు మాత్రమే ధరలబోర్డు ప్రదర్శిస్తూ ఇష్టారీతిన వసూ లుచేస్తూన్నారని రోగుల బంధువులు ఆరోపిస్తున్నారు. నిబంధనలకు విరుద్ధంగా వ్యవహరిస్తున్న స్కానింగ్‌ సెంటర్లలో తనిఖీలు చేయాల్సిన వైద్యారోగ్యశాఖ అటువైపు కనెత్తి చూడటం లేదనే విమర్శలు వస్తున్నాయి.


అంతా రెఫరల్‌

జిల్లాలో పలువురు సీనియర్‌ వైద్యులు సొంతగా ఆసుపత్రులు నడుపుతూ అవసరం ఉంటేనే ఎక్స్‌రే, స్కానింగ్‌, సీటీస్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ చేయించుకోవాలని రోగులకు సలహా ఇస్తున్నారు. కానీ కొన్ని మేనేజ్‌మెంట్‌ ఆసుపత్రుల్లోని వైద్యులు మాత్రం ప్రతి చిన్న సమస్యకు ఎక్స్‌రే, సిటీస్కాన్‌, స్కానింగ్‌, ఎమ్‌ఆర్‌ఐలు రాస్తున్నారు. ఇలా రిఫరల్‌ దందా చేస్తూ కొంతమంది వైద్యులు కమీషన్లు తీసుకుంటున్నారని బహిరంగంగా చర్చించుకుంటున్నారు. రూ.1000 ఫీజుకు రూ.300 చొప్పున కమీషన్‌ తీసుకుంటున్నట్లు సమాచారం.


జూనియర్లతోనే నిర్వహణ..

ఎక్స్‌రే, స్కానింగ్‌, సిటీస్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ ఏది తీయాలన్నా అనుభవం, అర్హత ఉన్న టెక్నీషియన్‌ ఉండాలి. డీఎమ్‌ ఐటీ (డిప్లొమా ఇన్‌ మెడికల్‌ ఇమేజింగ్‌ టెక్నాలజీ) కోర్సు చేసి శిక్షణ తీసుకోవాల్సి ఉంటుంది. అయితే మల్టీ, సూపర్‌ స్పెషాలటీ, పెద్ద ప్రైవేట్‌ ఆసుపత్రుల్లో టెక్నీషియన్లకు రూ.35వేల నుంచి 50వేల వరకు వేతనాలు ఇవ్వాల్సి ఉం టుంది. దీంతో జూనియర్లకు రూ.20వేలలోపు జీతాలు ఇచ్చి నిబంధనలకు విరుద్ధంగా నడిపిస్తున్నారు. జూనియర్లు ఇచ్చే స్కానింగ్‌ రిపోర్టులో తేడా వస్తే ఎవరు బాధ్యత వహిస్తారనేది ప్రశ్నార్థకంగా మిగులుతోంది.


నిబంధనలు పాటించకుంటే తప్పవు

జిల్లాలోని అన్ని స్కానింగ్‌ సెంటర్లలో ఇప్పటికే తనిఖీలు చేశాం. నిబంధనలు పాటించాలని పలుమార్లు హెచ్చ రించాం. స్కానింగ్‌ విషయంలో తప్పుడు రిపోర్టులు ఇచ్చినట్లు మా దృష్టికి వస్తే కచ్చితంగా చర్యలు తీసుకుంటాం. సెంటర్లలో ప్రత్యేకబృందం సైతం తనిఖీలు చేస్తూనే ఉంది. నిబంధనలు పాటించని ఎక్స్‌రే, స్కానింగ్‌, సిటీ స్కాన్‌, ఎమ్‌ఆర్‌ఐ తదితర సెంటర్ల నిర్వాహకులపై చర్యలు తప్పవు. బాధితులు ఎవరైనా ఉంటే నేరుగా జిల్లా వైద్య మరి యు ఆరోగ్య శాఖ అధికారులకు ఫిర్యాదు చేయాలి.

-డాక్టర్‌ ప్రమోద్‌ కుమార్‌, డీఎంహెచ్‌వో


ఈ వార్తలు కూడా చదవండి..

మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ

టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్

For TG News And Telugu News

Updated Date - Sep 15 , 2025 | 10:43 AM