Puja Family in Trouble Again: మళ్లీ వార్తల్లో మాజీ ఐఏఎస్ ఫ్యామిలీ
ABN , Publish Date - Sep 15 , 2025 | 09:15 AM
మాజీ ఐఏఎస్ అధికారి పూజా ఖేద్కర్ ప్యామిలీ మరో సారి వార్తల్లో నిలిచింది. ఇప్పటికే తప్పుడు ధృవ పత్రాలతో ఐఏఎస్ దొడ్డి దారిలో సాధించిన ఆమెను ఈ ఉద్యోగం నుంచి బహిష్కరించింది. అంతేకాదు మళ్లీ ఈ పరీక్ష రాయకుండా ఆమెపై యూపీఎస్సీ నిషేధం విధించింది.
పుణె, సెప్టెంబర్ 15: తప్పుడు ధృవపత్రాలతో ఐఏఎస్ సాధించినట్లు వెల్లడికావడంతో పూజా ఖేద్కర్ను యూపీఎస్సీ విధుల నుంచి తొలగించిన సంగతి తెలిసిందే. మళ్లీ ఈ పరీక్షలకు హాజరు కాకుండా ఆమెపై నిషేధం సైతం విధించింది. అలాంటి పూజా ఖేద్కర్ ఫ్యామిలీ మరోసారి వార్తల్లో నిలిచింది. అయితే లారీ డ్రైవర్ కిడ్నాప్ వ్యవహారంలో ఆమె కుటుంబంపై పోలీసులు కేసు నమోదు చేశారు. సెప్టెంబర్ 13న నవీ ముంబైలోని అయిరోలి సిగ్నల్స్ వద్ద ఒక కారును ట్రక్ ఢీ కొట్టింది. అనంతరం ఆ ట్రక్ డ్రైవర్ ఆచూకీ లేకుండా పోయాడు.
దాంతో ట్రక్ డ్రైవర్ కుటుంబ సభ్యులు పోలీసులను ఆశ్రయించారు. పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేపట్టారు. అందులో భాగంగా ఈ ప్రమాదం జరిగిన ప్రాంతంలోని సీసీ ఫుటేజ్లను పోలీసులు జల్లెడ పట్టారు. ఈ ప్రమాదం జరిగిన వెంటనే ఇద్దరు వ్యక్తులు.. బలవంతంగా ఆ లారీ డ్రైవర్ను తమ కారులోకి ఎక్కించుకొని తీసుకు వెళ్లినట్లు పోలీసులు గుర్తించారు. దీంతో ఈ కారు నెంబర్ ఆధారంగా.. దాని ఆచూకీని పోలీసులు కనుగోన్నారు.
సదరు కారు పుణెలో చతుశృంగి ప్రాంతంలోని పూజా ఖేద్కర్ నివాసంలో ఉన్నట్లు గుర్తించారు. దాంతో లారీ డ్రైవర్ ప్రహ్లాద్ కుమార్ను విడిపించేందుకు పూజా ఖేద్కర్ నివాసానికి పోలీసులు వెళ్లారు. కానీ తమ నివాసంలోకి పోలీసులకు అనుమతి లేదంటూ ఆమె తల్లి మనోరమా ఖేద్కర్ తలుపులు తెరవలేదు. వారెంట్తో వచ్చామంటూ ఆమెకు పోలీసులు స్పష్టం చేశారు. ఆ క్రమంలో పోలీసులను మనోరమా ఖేద్కర్ తీవ్రంగా ప్రతిఘటించింది. దీంతో ఇరువైపులా వాదోపవాదాలు జరిగాయి. చివరకు చేసేది లేక.. పూజా ఖేద్కర్ నివాసంలోకి పోలీసులు దూసుకు వెళ్లారు. కిడ్నాప్నకు గురైన లారీ డ్రైవర్ను తమతో ముంబైకి పోలీసులు తీసుకు వెళ్లారు. ఇక పోలీసులను మనోరమా ఖేద్కర్ ప్రతిఘటిస్తున్న వీడియో సోషల్ మీడియాలో వైరల్గా మారింది.
పూజా ఖేద్కర్.. గతేడాది పుణె ట్రైయినీ కలెకర్ట్గా విధులు నిర్వహిస్తూ.. మరో ఉన్నతాధికారి కార్యాలయాన్ని ఆయన అనుమతి లేకుండా వినియోగించుకున్నారు. ఈ విషయాన్ని సదరు ఉన్నతాధికారి జిల్లా కలెక్టర్కు ఫిర్యాదు చేశారు. ఈ అంశాన్ని ప్రభుత్వం దృష్టికి జిల్లా కలెక్టర్ తీసుకు వెళ్లారు. దీనిపై స్పష్టమైన నివేదిక అందజేయాలంటూ జిల్లా కలెక్టర్ను ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి ఆదేశించారు. ఆ క్రమంలో పూజా ఖేద్కర్పై ప్రభుత్వానికి నివేదిక అందజేశారు.
అలాగే ఆమె వ్యవహారంపై అప్పటికే యూపీఎస్సీకి పలు ఫిర్యాదులు అందాయి. దీంతో విచారణ జరిపి.. ఆమె తప్పుడు ధృవపత్రాలతో ఐఏఎస్ పరీక్షల్లో ఉత్తీర్ణత సాధించినట్లు యూపీఎస్సీ గుర్తించింది. ఈ నేపథ్యంలో ఆమెను విధుల నుంచి బహిష్కరించడమే కాదు.. మరోమారి యూపీఎస్సీ పరీక్షలకు హాజరుకాకుండా పూజా ఖేద్కర్పై నిషేధం వేటు వేసిన విషయం తెలిసిందే.
అదే సమయంలో మహారాష్ట్రలో రైతులను బెదిరించినట్లు ఆమె తల్లి మనోరమా ఖేద్కర్పై విమర్శలు వెల్లువెత్తాయి. ఈ బెదిరింపు సమయంలో రైతులతో మాట్లాడుతూ ఆమె తన చేతితో తుపాకీ తిప్పుతున్న వీడియో సైతం సోషల్ మీడియాలో వైరల్ అయిన విషయం విదితమే.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆదాయం పెంచేందుకు ప్రభుత్వం కీలక కార్యాచరణ
టార్గెట్ జూబ్లీహిల్స్.. రంగంలోకి కేటీఆర్
For National News And Telugu News