Telangana Cabinet: స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం
ABN , Publish Date - Oct 16 , 2025 | 09:28 PM
స్థానిక సంస్థల ఎన్నికల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని కేబినెట్ తీర్మానం చేసింది. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఉండటంతో ఆశావాహులు పోటీ నుంచి వెనక్కు తగ్గారు. ఈ క్రమంలో ఈ నిర్ణయంపై కేబినెట్ ఇవాళ పునారాలోచన చేసింది. ఈ నేపథ్యంలో మంత్రుల అభిప్రాయం మేరకు ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
హైదరాబాద్, అక్టోబరు 16 (ఆంధ్రజ్యోతి): స్థానిక సంస్థల ఎన్నిక (Local Body Elections)ల్లో పోటీకి ఇద్దరు పిల్లల నిబంధన తొలగించాలని కేబినెట్ తీర్మానం చేసింది. స్థానిక ఎన్నికల్లో ఇద్దరు పిల్లల నిబంధన ఉండటంతో ఆశావాహులు పోటీ నుంచి వెనక్కు తగ్గారు. ఈ క్రమంలో ఈ నిర్ణయంపై కేబినెట్ ఇవాళ పునారాలోచన చేసింది. ఈ నేపథ్యంలో మంత్రుల అభిప్రాయం మేరకు ఇద్దరు పిల్లల నిబంధన తొలగిస్తూ కేబినెట్ నిర్ణయం తీసుకుంది.
తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్రెడ్డి (CM Revanth Reddy) అధ్యక్షతన రాష్ట్ర సచివాలయంలో ఇవాళ (గురువారం) మంత్రిమండలి (Telangana Cabinet) సమావేశం జరిగింది. ఈ సమావేశంలో పలు కీలక అంశాలపై కేబినెట్తో సీఎం రేవంత్రెడ్డి చర్చించారు. కేబినెట్కి సంబంధించిన విషయాలను మీడియాకు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి (Minister Ponguleti Srinivas Reddy) వెల్లడించారు. బీసీ రిజర్వేషన్లపై 23వ తేదీన జరిగే కేబినెట్ సమావేశంలో చర్చించి నిర్ణయం తీసుకుంటామని తెలిపారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.

కేంద్రం సహకరించక పోయినా..
తెలంగాణలో 1.48లక్షల మెట్రిక్ టన్నుల వరి ధాన్యం పండిందని చెప్పుకొచ్చారు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ రాష్ట్రంలో కూడా ఇంత దిగుబడి రాలేదని తెలిపారు. 80లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం సేకరణ చేయాల్సి ఉందని వివరించారు. కేంద్ర ప్రభుత్వం రూ. 50లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం మాత్రమే తీసుకుంటామని అంటుందని పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం సహకరించక పోయినా రాష్ట్ర ప్రభుత్వం ప్రతీ గింజను కొనాలని నిర్ణయం తీసుకుందని తెలిపారు. సన్న వరికి రూ.500బోనస్ ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. కొడంగల్, హుజూర్ నగర్, నిజామాబాద్లో కొత్తగా మూడు వ్యవసాయ కాలేజీలు ఏర్పాటు చేయాలని తీర్మానం చేశామని వెల్లడించారు. ప్రజాపాలన ఉత్సవాల కోసం కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేస్తూ నిర్ణయం తీసుకున్నామని పేర్కొన్నారు మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి.
నల్సార్లో స్థానికులకు 50శాతం సీట్లు..
నల్సార్ యూనివర్సిటీకి ఏడు ఎకరాలు ఇవ్వాలని కేబినెట్ ఆమోదించిందని తెలిపారు. నల్సార్లో స్థానికులకు 50శాతం సీట్లు ఇవ్వాలని నిర్ణయం తీసుకున్నామని చెప్పుకొచ్చారు. మెట్రో రైల్ రెండోదశ ప్రతిపాదనలకు కేంద్ర ప్రభుత్వం కొర్రీలు పెట్టిందని అన్నారు. కొత్త ప్రతిపాదనల కోసం ఉన్నతాధికారులతో కమిటీ ఏర్పాటు చేశామని వివరించారు. ఆర్ అండ్బీలో 5,565 వేల కిలోమీటర్ల హామ్ రోడ్ల టెండర్లకు మంత్రిమండలి ఆమోదించిందని వెల్లడించారు. కృష్ణా జిల్లా - వికారాబాద్ మధ్య రైల్వేలైన్ భూ సేకరణకు ఆమోదించామని తెలిపారు. మున్ననూర్, శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి కేబినెట్ గ్రీన్ సిగ్నల్ ఇచ్చిందని మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి పేర్కొన్నారు.
కేబినెట్ కీలక నిర్ణయాలివే...
1. వానాకాలంలో 1.48 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం దిగుబడి వస్తుంది. దేశంలోనే ఇది రికార్డు స్థాయి ఉత్పత్తి. ఇందులో రాష్ట్రంలో 80 లక్షల మెట్రిక్ టన్నుల ధాన్యం కొనుగోలు కేంద్రాలకు వస్తుందని పౌరసరఫరాల విభాగం అంచనా వేసింది.
• కేంద్ర ప్రభుత్వం 50 లక్షల మెట్రిక్ టన్నుల సేకరణకు అంగీకరించింది. మరో 15 లక్షల మెట్రిక్ టన్నులు సేకరించాలని కేంద్ర ప్రభుత్వానికి విజ్ఞప్తి చేయాలని మంత్రి వర్గం నిర్ణయించింది.
• వానకాలం సీజన్లో పండించిన ధాన్యం కొనుగోళ్లను పకడ్బందీగా నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది.
• వ్యవసాయ శాఖ, రెవెన్యూ శాఖ, పౌర సరఫరాల శాఖ, రవాణా శాఖ సమన్వయంతో రైతులకు ఎలాంటి ఇబ్బంది లేకుండా ధాన్యం కొనుగోలు ప్రక్రియ చేపట్టాలని నిర్ణయించింది.
• ధాన్యానికి చెల్లించే మద్దతు ధరతో పాటు సన్న వడ్లకు ఇచ్చే రూ.500 బోనస్ రైతుల ఖాతాల్లో త్వరగా జమ చేయాలని నిర్ణయం తీసుకుంది.
• కలెక్టర్లు, అదనపు కలెక్టర్లు కొనుగోలు కేంద్రాలను తనిఖీ చేయాలని.. ప్రతి కొనుగోలు కేంద్రం పర్యవేక్షణ, సమన్వయానికి ఒక్కో అధికారికి ప్రత్యేక బాధ్యతలు అప్పగించాలని మంత్రివర్గం నిర్ణయించింది.
2. తెలంగాణ రాష్ట్రంలో కొత్తగా మూడు (3) అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. హుజూర్నగర్, కొడంగల్, నిజామాబాద్లో అగ్రికల్చర్ కాలేజీల ఏర్పాటుకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
3. రాష్ట్రంలో ప్రజాప్రభుత్వం ఏర్పడి రెండేళ్లు పూర్తయిన సందర్భంగా ప్రజా పాలన - ప్రజా విజయోత్సవాలను నిర్వహించాలని కేబినెట్ నిర్ణయించింది. డిసెంబర్ 1వ తేదీ నుంచి 9వ తేదీ వరకు ఉత్సవాలు నిర్వహిస్తుంది. ఉత్సవాల నిర్వహణ.. సంబంధిత ఏర్పాట్లపై కేబినెట్ సబ్ కమిటీ ఏర్పాటు చేయాలని నిర్ణయం.
4. ఇద్దరు పిల్లలకు మించి సంతానమున్న వారు స్థానిక ఎన్నికల్లో పోటీ చేసేందుకు అనర్హులనే నిబంధనను మంత్రివర్గం పునరాలోచన చేసింది. రాష్ట్రంలో జనాభా నియంత్రణ కట్టుదిట్టంగా అమలవుతున్న తరుణంలో ఈ గరిష్ట నిబంధనను అమలు చేయాల్సిన అవసరం లేదనే అభిప్రాయాలు వ్యక్తం అయ్యాయి. ఈ నిబంధనను ఎత్తివేసేందుకు కేబినెట్ సూచనప్రాయంగా అంగీకరించింది.
5. భద్రాద్రి కొత్తగూడెం జిల్లా జూలూరుపాడులో ఏన్కూర్ మార్కెట్ యార్డ్కు పది ఎకరాలు కేటాయిస్తూ కేబినెట్ తీర్మానం చేసింది.
6. నల్సార్ న్యాయ విశ్వ విద్యాలయానికి ఇప్పుడున్న చోటనే అదనంగా 7 ఎకరాల భూమిని కేటాయించే ప్రతిపాదనలకు కేబినెట్ ఆమోదం తెలిపింది.
7. నల్సార్ యూనివర్సిటీ అడ్మిషన్లలో ఇప్పుడు తెలంగాణ స్థానికులకు కేటాయించిన 25 శాతం సీట్ల కోటాను 50 శాతం పెంచాలని కేబినెట్ తీర్మానం చేసింది.
8. హైదరాబాద్ మెట్రో రైలు విస్తరణ ప్రక్రియను వేగవంతం చేయాలని రాష్ట్ర మంత్రివర్గం నిర్ణయం తీసుకుంది. మెట్రో 2A, 2B విస్తరణకు అడ్డంకిగా మారిన మొదటి దశను పీపీపీ మోడ్లో నిర్వహిస్తున్న ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంపై సుదీర్ఘంగా కేబినెట్ చర్చించింది.
మెట్రో రైలును ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో సాధ్యాసాధ్యాలు, అందులో ముడిపడి ఉన్న అంశాలన్నింటినీ సమగ్ర అధ్యయనం చేసేందుకు ఉన్నత అధికారుల కమిటీ ఏర్పాటు చేయాలని మంత్రి మండలి నిర్ణయించింది.
తెలంగాణ ప్రభుత్వ సీఎస్ చైర్మన్గా, ఆర్థిక శాఖ ముఖ్య కార్యదర్శి, ఎంఏయూడీ కార్యదర్శి, లా సెక్రెటరీ, మెట్రో రైలు ఎండీ, అర్బన్ ట్రాన్స్పోర్ట్ అడ్వయిజర్ అధికారులు కమిటీలో సభ్యులుగా ఉంటారు.
అధికారుల కమిటీ తమ రిపోర్టును కేబినెట్ సబ్ కమిటీకి అందిస్తుంది. కేబినెట్ సబ్ కమిటీ సిఫారసుల ఆధారంగా మెట్రోను ఎల్ అండ్ టీ నుంచి స్వాధీనం చేసుకునే విషయంలో తుది నిర్ణయం తీసుకోవాలని మంత్రివర్గం తీర్మానించింది.
9. తెలంగాణ రాష్ట్రంలో హ్యామ్ మోడ్లో మొదటి దశలో 5,566 కిలోమీటర్ల రోడ్ల నిర్మాణానికి కేబినెట్ ఆమోదం తెలిపింది. జాతీయ రహదారులు, జిల్లా కేంద్రాలు, మండల కేంద్రాలు, పర్యాటక ప్రాంతాలు, ఇతర రాష్ట్రాలతో అనుసంధానమయ్యే రహదారులకు సంబంధించి అభివృద్ధి, విస్తరణ పనులు చేపడుతూ కేబినెట్ నిర్ణయం.
10. ప్యారడైజ్ జంక్షన్ నుంచి శామీర్పేట ఓఆర్ఆర్, ప్యారడైజ్ జంక్షన్ నుంచి డెయిరీ ఫాం రోడ్ వరకు నిర్మించే ఎలివేటెడ్ కారిడార్ల నిర్మాణానికి సంబంధించి రక్షణ శాఖ భూములు వినియోగించుకుంటున్నందున వారికి ప్రత్యామ్నాయంగా 435.08 ఎకరాల భూములను అప్పగిస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది.
11. కృష్ణా జిల్లా - వికారాబాద్ మధ్య బ్రాడ్గేజ్ రైలు మార్గం నిర్మాణానికి సంబంధించి 845 హైక్టార్ల భూ సేకరణకు అయ్యే రూ.438 కోట్ల వ్యయాన్ని రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ రాష్ట్ర కేబినెట్ తీర్మానం చేసింది.
12. మన్ననూర్ - శ్రీశైలం ఎలివేటెడ్ కారిడార్ నిర్మాణానికి సంబంధించి మొత్తం వ్యయంలో మూడో వంతు రాష్ట్ర ప్రభుత్వం భరించేందుకు అంగీకరిస్తూ మంత్రి మండలి తీర్మానం చేసింది.
ఈ వార్తలు కూడా చదవండి...
ప్రజాస్వామ్యబద్ధంగా డీసీసీ అధ్యక్ష ఎన్నిక: కొండా మురళి
తెలంగాణ కేబినెట్ భేటీ.. పలు కీలక అంశాలకి ఆమోదం
Read Latest Telangana News And Telugu News