CM Chandrababu: ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్.. ఒక చిన్న మొక్క నుంచి పెద్ద వృక్షంగా మారింది
ABN , Publish Date - Dec 27 , 2025 | 07:08 PM
ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని సీఎం చంద్రబాబు కొనియాడారు. కొంతమంది గ్రూప్ వన్ పాస్ అయ్యారని.. మరి కొంతమంది దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారని ప్రశంసించారు.
హైదరాబాద్, డిసెంబరు 27 (ఆంధ్రజ్యోతి): ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్ను ఆరోజు 131 మందితో ప్రారంభించామని.. ఇప్పుడు వేల మంది పిల్లలు చదువుకుంటున్నారని ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (AP CM Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. హెరిటేజ్ ఫుడ్స్ను 1993లో.. ఆ తర్వాత ఎన్టీఆర్ ట్రస్ట్ను ప్రారంభించామని పేర్కొన్నారు. తనకు గండిపేటకు వస్తే చాలా విషయాలు గుర్తుకు వస్తాయని.. మొదట్లో ఇది తెలుగుదేశం పార్టీ హెడ్ ఆఫీస్ అని గుర్తుచేసుకున్నారు. ఒకప్పుడు రాజకీయ నాయకులకు ఇది శిక్షణ కేంద్రమని.. ఇప్పుడు పిల్లలకు శిక్షణ ఇస్తున్నారని వివరించారు. గండిపేటలోని ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్ ఇనిస్టిట్యూషన్స్ వార్షికోత్సవం ఇవాళ(శనివారం) జరిగింది. ఈ వేడుకలో పాల్గొని ప్రసంగించారు సీఎం చంద్రబాబు.
ఇప్పుడు విద్యార్థులు చదువుకుంటున్న క్లాస్ రూముల్లో.. ఆరోజు రాజకీయ నాయకులు శిక్షణ తీసుకున్నారని గుర్తుచేశారు. పది ఎకరాలు ఉన్న ఈ క్యాంపస్.. అప్పుడు ఒక చిన్న మొక్కలా ఉందని.. ఇప్పుడు పెద్ద వృక్షంలాగా మారిందని చెప్పుకొచ్చారు. తన సతీమణి భువనేశ్వరి ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్ ఇనిస్టిట్యూషన్స్ ను సమర్ధవంతంగా నిర్వహిస్తున్నారని కొనియాడారు. ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్లో చదువుకున్న విద్యార్థులు ఉన్నత స్థానంలో ఉన్నారని కీర్తించారు. కొంతమంది విద్యార్థులు గ్రూప్ వన్ పాస్ అయ్యారని.. మరి కొంతమంది దేశంలోని ప్రముఖ సంస్థల్లో ఉద్యోగాలు తెచ్చుకున్నారని ప్రశంసించారు.
1995లో తాను మొదటిసారిగా ముఖ్యమంత్రి అయ్యాక ఐటీని ప్రారంభించానని గుర్తుచేశారు. ఒక్క ఇంజనీరింగ్ కాలేజ్తో ఎన్టీఆర్ ఎడ్యుకేషనల్స్ను ప్రారంభించామని.. ఇప్పుడు వందల కాలేజ్లు ఉన్నాయని చెప్పుకొచ్చారు. దేశంలో ఇప్పుడు చాలా మంది హైదరాబాద్ వచ్చి చదువుకుంటున్నారని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి...
డ్రగ్స్ కేసులపై బండి సంజయ్ షాకింగ్ కామెంట్స్
దళితుల భూములను దౌర్జన్యంగా లాక్కున్నారు.. కవిత ఫైర్
Read Latest Telangana News And Telugu News