Champions Trophy 2025: దుబాయ్ పిచ్ రిపోర్ట్.. భారత్-పాక్లో ఎవరికి అనుకూలం..
ABN , Publish Date - Feb 22 , 2025 | 03:31 PM
IND vs PAK: ఉద్విగ్న పోరుకు అంతా రెడీ అయింది. చిరకాల ప్రత్యర్థులు భారత్-పాకిస్థాన్ బరిలోకి దిగడమే తరువాయి. వీళ్ల కొట్లాట చూసేందుకు ఫ్యాన్స్ రెడీ అయిపోతున్నారు. మరి.. ఆదివారం నాడు జరిగే బ్లాక్బస్టర్ ఫైట్ కోసం దుబాయ్ గ్రౌండ్ను ఎలా సిద్ధం చేస్తున్నారు? అనేది ఇప్పుడు చూద్దాం..
చాంపియన్స్ ట్రోఫీలో టీమిండియా మరో ఇంట్రెస్టింగ్ ఫైట్కు సిద్ధమవుతోంది. చిరకాల ప్రత్యర్థి పాకిస్థాన్తో తాడోపేడో తేల్చుకోనుంది మెన్ ఇన్ బ్లూ. ఈ రెండు జట్ల మధ్య దుబాయ్ వేదికగా కీలక మ్యాచ్ జరగనుంది. ఇందులో గెలిస్తే నాకౌట్ ఫైట్కు క్వాలిఫై అవుతుంది భారత్. ఒకవేళ పాకిస్థాన్ నెగ్గితే ఆ టీమ్కు సెమీస్ ద్వారాలు తెరిచి ఉంటాయి. అందుకే అటు రిజ్వాన్, ఇటు రోహిత్ ఈ మ్యాచ్ను ప్రతిష్టాత్మకంగా తీసుకుంటున్నారు. ఈ నేపథ్యంలో ఈ మ్యాచ్కు ఆతిథ్యం ఇస్తున్న దుబాయ్ ఇంటర్నేషనల్ స్టేడియంలో పిచ్, కండీషన్స్ ఎలా ఉండనున్నాయి? ఎవరికి అనుకూలం? ఎవరికి డేంజర్? అనేది ఇప్పుడు చూద్దాం..
పిచ్ రిపోర్ట్
దుబాయ్ పిచ్ బౌలర్లకు అనుకూలించే అవకాశాలు ఎక్కువ. ఈ మధ్య కాలంలో ఆ గ్రౌండ్లో జరిగిన వన్డేలు చాలా మటుకు లోస్కోరింగ్గా ముగిశాయి. భారత్-బంగ్లాదేశ్ మ్యాచ్లోనూ పరుగులు చేసేందుకు బ్యాటర్లు ఆపసోపాలు పడ్డారు. క్రీజులో నిలదొక్కుకున్నా ఒక్కో పరుగు కోసం చెమటోడ్చక తప్పని పరిస్థితి. భారీ స్కోర్లు బాదడం ఇక్కడ చాలా కష్టం. ఈ మైదానంలో వన్డేల్లో నాలుగు సార్లు మాత్రమే 300 పైచిలుకు స్కోర్లు నమోదయ్యాయి. ఫస్ట్ ఇన్నింగ్స్ యావరేజ్ స్కోరు 219. కాబట్టి 250 పైచిలుకు టార్గెట్ సెట్ చేస్తే గెలిచే అవకాశాలు మెండుగా ఉంటాయి.
వాతావరణం
సండే ఫైట్కు వరుణుడు ఆటంకం కలిగించే అవకాశాలు దాదాపుగా లేనట్లే. మ్యాచ్ టైమ్కు వర్షం పడే చాన్సులు లేవని వెదర్ ఎక్స్పర్ట్స్ అంటున్నారు. బంగ్లాతో భారత్ మ్యాచ్కు ముందు దుబాయ్లో అడపాదడపా వానలు పడ్డాయి. కానీ ఇప్పుడు అక్కడ వాతావరణం మారిపోయింది. మ్యాచ్ రోజు మధ్యాహ్నం పూట వెదర్ సాధారణంగా ఉంటుందని తెలుస్తోంది. ఉష్ణోగ్రత 31 డిగ్రీల సెల్సియస్గా ఉంటుందని ఎక్స్పర్ట్స్ చెబుతున్నారు.
ఎవరికి అనుకూలం?
దుబాయ్ పిచ్లపై భారత్తో పాటు పాకిస్థాన్ కూడా ఎక్కువ క్రికెటే ఆడింది. అక్కడి వాతావరణం, పిచ్లు ప్రవర్తించే తీరు దాయాదికి కొట్టిన పిండే. అయితే ఏ సిచ్యువేషన్కైనా త్వరగా అడాప్ట్ అయ్యే రోహిత్ సేన.. తొలి మ్యాచ్లో బంగ్లాను చిత్తు చేసిన తీరు చూస్తుంటే అది మనకు హోం గ్రౌండ్లాగే అనిపిస్తోంది. అయితే పిచ్ విషయంలో మాత్రం ఇంకా పూర్తిగా అలవాటు పడలేదు కాబట్టి ఇది భారత్కు ప్రతికూలమనే చెప్పాలి. కానీ పాక్ ఒకప్పటిలా బలంగా లేకపోవడం, కివీస్ చేతుల్లో ఓడి మానసికంగా బలహీనపడటం, తప్పక గెలవాలనే ఒత్తిడి ఉన్నందున ఎడ్జ్ భారత్ వైపే ఎక్కువగా కనిపిస్తోంది.
ఇవీ చదవండి:
పాపం పాక్ ఫ్యాన్స్.. ఈసారి టీవీలు పగలగొట్టలేరు..
పాక్కు చుక్కలే.. దమ్ముంటే ఆపండి
మరిన్ని క్రీడా, తెలుగు వార్తల కోసం క్లిక్ చేయండి