Kerala And Chhattisgarh Electoral Rolls: కేరళలో 24, ఛత్తీస్గఢ్లో 27 లక్షల ఓట్ల తొలగింపు
ABN , Publish Date - Dec 23 , 2025 | 08:44 PM
కేరళలో 24 లక్షల మంది పేర్లను ముసాయిదా ఎన్నికల జాబితా నుంచి తొలగించగా, ఛత్తీస్గఢ్లో 27 లక్షల మంది పేర్లను తొలగించారు.
తిరువనంతపురం: దేశవ్యాప్తంగా పలు రాష్ట్రాలు/కేంద్రపాలిత ప్రాంతాల్లో జరుపుతున్న రెండో విడత ఎన్నికల జాబితా స్పెషల్ ఇంటెన్సివ్ రివిజన్ (SIR) ప్రక్రియలో భాగంగా కేరళ (Karala), ఛత్తీస్గఢ్ (Chhattisgarh) ముసాయిదా ఎన్నికల జాబితాను ఎన్నికల కమిషన్ మంగళవారంనాడు ప్రచురించింది. కేరళలో 24 లక్షల మంది పేర్లను ఎన్నికల జాబితా నుంచి తొలగించింది. ఛత్తీస్గఢ్లో 27 లక్షల మంది పేర్లను తొలగించింది. ఎలక్షన్ కమిషన్ వెబ్సైట్లో ముసాయిదా జాబాతాను ప్రకటించామని, అన్ని రాజకీయ పార్టీలకు ప్రతులను షేర్ చేశామని ప్రధాన ఎన్నికల కమిషనర్లు ప్రకటించారు.
కేరళలో..
కేరళ ముసాయిదా ఓటర్ల జాబితాలో 2 కోట్ల 54 లక్షల 42 వేల 352 ఓటర్లు నమోదయ్యారు. 24 లక్షల 8 వేల 503 మంది పేర్లను ఓటర్ల జాబితా నుంచి తొలగించారు. వీరిలో 6,49,885 మంది ఓటర్లు మృతి చెందగా, 6,45,548 మంది ఓటర్ల చిరునామా గల్లంతైంది. 8,16,221 మంది రిజిస్టర్డ్ అడ్రస్ నుంచి శాశ్వతంగా షిఫ్ట్ అయ్యారు. అదనంగా 1,36,028 మంది ఓటర్లను డూప్లికేట్ ఎంట్రీల కారణంగా, 1,60,830 మంది ఓటర్లను ఇతర కేటగిరిల కింద గుర్తించి తొలగించారు. ఎన్నికలకు ముందు కేరళ ఎన్నికల జాబితాలో 2,75,50,855 మంది ఓటర్లు ఉండగా, 8.65 శాతం ఓటర్లను ఎస్ఐఆర్ అనంతరం తొలగించారు. ముసాయిదా జాబితాకు సంబంధించి ఎలాంటి అభ్యంతరాలు, సమస్యలు ఉన్నా 2026 జనవరి 22 వరకూ ఈసీ దృష్టికి తీసుకువచ్చే వెసులుబాటు కల్పించారు. ఫిబ్రవరి 21న తుది ఓటర్ల జాబితా ప్రచురిస్తారు.
ఛత్తీస్గఢ్లో..
ఛత్తీస్గఢ్లో ఎస్ఐఆర్ అనంతరం ముసాయిదా ఓటర్ల జాబితా విడుదల చేశారు. 27 లక్షల మందికి పైగా ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. మొత్తం 2 కోట్ల 12 లక్షల 30 వేల 737 ఓటర్లలో 1 కోటి 84 లక్షల 95 వేల 920 మంది ఓటర్లు తమ ఎన్యూమరేషన్ ఫారంలు సమర్పించారు. జాబితా నుంచి తొలగించిన వారిలో 6,42,243 మంది ఓటర్లు మృతి చెందగా, 19,13,540 మంది బదిలీ కావడం, ఆబ్జెంట్ కావడం జరిగింది. 1,79,043 మంది పలు చోట్ల ఓటర్లుగా నమోదు చేసుకోవడంతో వారి పేర్లు తొలగించారు.
అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో..
అండమాన్ నికోబార్ ఐలాండ్స్లో ముసాయిదా ఎన్నికల జాబితాను కూడా మంగళవారంనాడు ఎన్నికల కమిషన్ విడుదల చేసింది. 2 లక్షల 46 వేల 390 మంది ఓటర్లు ముసాయిదా జాబితాలో చోటుచేసుకున్నారు. 64,014 మంది పేర్లను ఓటర్లను జాబితా నుంచి తొలగించారు. రివిజన్ ఎక్సర్సైజ్కు ముందు అండమాన్ నికోబార్ ఐలాండ్స్ ఎన్నికల జాబితాలో 3,10,404 మంది ఓటర్లు ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
మధ్యప్రదేశ్ ఎస్ఐఆర్లో 42 లక్షల ఓట్ల తొలగింపు
దీపూదాస్ను అన్యాయంగా చంపేశారు.. ఆడియో సందేశంలో షేక్ హసీనా
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి