Bihar Elections: కోడ్ ఉల్లంఘన.. కేంద్ర మంత్రిపై కేసు
ABN , Publish Date - Nov 04 , 2025 | 05:58 PM
మొకామా ప్రాంతంలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ తరఫున లలన్ సింగ్ ఇటీవల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పోలింగ్ రోజున విపక్ష నేతలను ఇళ్ల నుంచి బయటకు రానీయరాదని, ఇళ్లకు తాళాలు వేయాలని సూచించారు.
పాట్నా: బిహార్ ఎన్నికల ప్రచారంలో వివాదాస్పద వ్యాఖ్యలు చేయడంతో కేంద్ర పంచాయతీ రాజ్ మంత్రి, జేడీయూ నేత లలన్ సింగ్ (Lalan Singh)పై పాట్నా జిల్లా యంత్రాంగం ఎఫ్ఐఆర్ (FIR) నమోదు చేసింది. వీడియా నిఘా టీమ్ (Video surveillance team) నుంచి ఫుటేజ్ను సమీక్షించిన అనంతరం ఎన్నికల ప్రవర్తనా నియమావళిని ఉల్లంఘించారనే కారణంగా భారతీయ నాగరిక్ సురక్షా సంహిత, ప్రజాప్రాతినిధ చట్టం కింద లలన్ సింగ్పై అధికారులు కేసు నమోదు చేశారు.
మొకామా ప్రాంతంలో జేడీయూ అభ్యర్థి అనంత్ సింగ్ తరఫున లలన్ సింగ్ ఇటీవల ప్రచారంలో పాల్గొన్నారు. ఆ సందర్భంగా పోలింగ్ రోజున విపక్ష నేతలను ఇళ్ల నుంచి బయటకు రానీయరాదని, ఇళ్లకు తాళాలు వేయాలని సూచించారు. నాయకులను ఓటు వేయకుండా అడ్డుకోవాలని, వాళ్లు ఒకవేళ రచ్చచేస్తే ఓటు వేయడానికి తీసుకు వెళ్లి తిరిగి ఇంటికే పరిమితం చేయాలని అన్నారు. ఇందుకు సంబంధించిన వీడియో సోషల్ మీడియాలో వైరల్ అవుతోంది.
కాగా, కేంద్ర మంత్రి మాట్లాడిన వీడియోను ఆర్జేడీ ప్రతినిధి ప్రియాంక భారతి సోషల్ మీడియాలో షేర్ చేశారు. ఎన్నికల కమిషన్ను బలహీనపరిచేలా లలన్ సింగ్ చర్యలు ఉన్నాయని, బహిరంగంగా ఓటర్లను కేంద్ర మంత్రి బెదిరిస్తుంటే ఈసీ ఎందుకు మౌనంగా ఉందని ఆమె ప్రశ్నించారు. మొకామాలో ఇటీవల దులార్ చంద్ యాదవ్ అనే జన్సురాజ్ కార్యకర్త హత్యకు గురికావడంతో అనంత్ సింగ్ను పోలీసులు నిర్బంధంలోకి తీసుకున్నారు. ప్రస్తుతం ఆయన బేవుర్ జైలులో ఉన్నారు.
ఇవి కూడా చదవండి..
రెండు రైళ్లు ఢీ.. పలువురు మృతి
హిందుజా గ్రూప్ చైర్మన్ కన్నుమూత
మరిన్ని జాతీయ, అంతర్జాతీయ వార్తల కోసం క్లిక్ చేయండి