Purandeswari: బీజేపీపై కుట్రలు.. పురందేశ్వరి షాకింగ్ కామెంట్స్
ABN , Publish Date - Apr 12 , 2025 | 01:53 PM
Purandeswari: మోదీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచే అంబేద్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి వ్యాఖ్యానించారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా బూత్ లెవల్లో కార్యక్రమాలు చేపట్టామని దగ్గుబాటి పురంధేశ్వరి పేర్కొన్నారు.

విజయవాడ: అంబేద్కర్ రాజ్యాంగం మారుస్తారని మోదీ ప్రభుత్వంపై కాంగ్రెస్ నేతలు దుష్ప్రచారం చేశారని బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి తీవ్ర విమర్శలు గుప్పించారు. కాంగ్రెస్ హయాంలోనే రాజ్యాంగంలో ఎక్కువసార్లు సవరణలు జరిగాయని చెప్పారు. ముస్లింల ఓటు బ్యాంకును దృష్టిలో ఉంచుకుని స్వార్ధంతో కాంగ్రెస్ నేతలు మోదీ ప్రభుత్వంపై దుష్ప్రచారం చేశారని ధ్వజమెత్తారు. బీజేపీ రాజ్యాంగంలో 22 సవరణలు చేసినా అది వివిధ వర్గాల అభ్యున్నతికి చేసినవేనని తెలిపారు. సామాజిక న్యాయం కోసం ఈ నిర్ణయాలను ప్రధానమంత్రి నరేంద్రమోదీ తీసుకున్నారని చెప్పారు. విజయవాడలోని బీజేపీ కార్యాలయంలో ఇవాళ (శనివారం) అంబేద్కర్ జయంతి వేడుకలు నిర్వహించారు. ఈ కార్యక్రమంలో బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే. అరుణ, బీజేపీ ఏపీ అధ్యక్షురాలు దగ్గుబాటి పురంధేశ్వరి, సోమువీర్రాజు, దయాకర్ రెడ్టి, గుడిసె దేవానంద్, విల్సన్, తదితరులు పాల్గొన్నారు.
ఈ సందర్భంగా దగ్గుబాటి పురంధేశ్వరి మీడియాతో మాట్లాడారు. ఈనెల 14వ తేదీన అంబేడ్కర్ జయంతి సందర్భంగా బూత్ లెవల్లో కార్యక్రమాలు చేపట్టామని దగ్గుబాటి పురంధేశ్వరి అన్నారు. సమసమాజ స్థాపన కోసం అంబేడ్కర్ కృషి చేశారని చెప్పారు. అన్ని వర్గాల వారికి సమాన న్యాయం అందించడం అంబేడ్కర్ లక్ష్యమని చెప్పారు. అదే ఆదర్శంగా బీజేపీ ప్రజల కోసం పని చేస్తోందని అన్నారు. 2014లో బీజేపీపై కాంగ్రెస్ నేతలు విష ప్రచారం చేశారని మండిపడ్డారు. నిజానికి అంబేద్కర్కు గౌరవించి సమున్నత స్థానం కల్పించింది బీజేపీనేనని ఉద్ఘాటించారు. ఆయనను గతంలో అవమానించి, రాజీనామా చేసేలా చేసిన చరిత్ర ఎవరిదో అందరికీ తెలుసునని చెప్పారు. భారతరత్న ఇచ్చినా, పార్లమెంటులో అంబేడ్కర్ చిత్ర పటం పెట్టినా, ఐదు ప్రాంతాలను పంచ్ తీర్ధ్గా , ఆయన నివాసాన్ని బీజేపీ అభివృద్ధి చేసిందని అన్నారు. ముస్లింలకు నాలుగు శాతం రిజర్వేషన్ కోసం రాజ్యాంగం మారుస్తామని డీకే శివకుమార్ చెప్పడం సరికాదని అన్నారు. భారత రాజ్యాంగం వల్లే బీసీగా ఉన్న తాను ప్రధానిగా అయ్యానని మోదీ చెప్పారని గుర్తుచేశారు. ఈ అంశాలను ప్రజలకు వివరించేందుకు తమ సమావేశం ఏర్పాటు చేశామని అన్నారు. బీజేపీ నాయకులు, కార్యకర్తలు విషయ పరిజ్ఞానం పెంచుకుని ప్రజలకు వివరించాలని దగ్గుబాటి పురంధేశ్వరి విజ్ఞప్తి చేశారు.
అంబేడ్కర్ రాజ్యాంగ స్పూర్తిని ప్రజలకు వివరిస్తాం: డీకే అరుణ
అంబేడ్కర్ జయంతి వేడుకలను ఈనెల 13వ తేదీ నుంచి 25వ తేదీ వరకు నిర్వహించాలని నిర్ణయించామని బీజేపీ జాతీయ ఉపాధ్యక్షురాలు డీకే అరుణ తెలిపారు. అంబేడ్కర్ జయంతి వేడుకలను గ్రామగ్రామాన నిర్వహిస్తామని తెలిపారు. అంబేడ్కర్ రాజ్యాంగ స్పూర్తిని తాము ప్రజలకు వివరిస్తామని అన్నారు. బీజేపీ అధికారంలోకి వస్తే రాజ్యాంగం మార్చేస్తామని కాంగ్రెస్ నేతలు అసత్యాలు ప్రచారం చేశారని మండిపడ్డారు. కానీ అంబేడ్కర్ను, ఆయన రాజ్యాంగాన్ని అవమానించిన చరిత్ర కాంగ్రెస్దేనని విమర్శించారు. నెహ్రూ అయితే అంబేడ్కర్ను ఓడించడనికి చాలా కుట్రలు చేశారని ఆరోపించారు. అధికారమే లక్ష్యంగా, ఓట్ల రాజకీయం కోసం రాజ్యాంగానికి కాంగ్రెస్ సవరణలు చేసిందని డీకే అరుణ విమర్శించారు.
మోదీ ప్రధానమంత్రి అయిన నాటి నుంచే అంబేడ్కర్ ఆశయాలను ముందుకు తీసుకెళ్లారని డీకే అరుణ చెప్పారు. మోదీ చేసిన సవరణలు దేశం హితం, ప్రజా హితం గురించే చేశారని తెలిపారు. కాంగ్రెస్ అబద్దాలు ప్రచారం చేసింది కాబట్టే...ప్రజలు వారికి గుణపాఠం చెప్పారని అన్నారు. దేశం అభివృద్ధి, అన్నివర్గాలు, అన్నిప్రాంతాల అభివృద్ధి లక్ష్యంగా మోదీ పాలన చేస్తున్నారని ఉద్ఘాటించారు. సమాజంలో అన్ని వర్గాల వారికి న్యాయం చేసేలా బీజేపీ ప్రభుత్వం ఆలోచనలు చేస్తుందని తెలిపారు. బీజేపీ కార్యశాల ద్వారా పార్టీ లక్ష్యాలు, అంబేడ్కర్ ఆశయాలను ప్రజలకు వివరించేలా శిక్షణ ఇస్తామని అన్నారు. రేపు సాయంత్రం అంబేడ్కర్ విగ్రహాలను శుద్ది చేసి దీపాలు పెడతామని చెప్పారు. 14వ తేదీన అంబేడ్కర్ జయంతిని ఘనంగా నిర్వహిస్తామని అన్నారు. కాంగ్రెస్ పార్టీ అంబేడ్కర్ను ఏ విధంగా అవమానించి, పార్టీ నుంచి బయటకు పంపారనే విషయాలను ప్రజలకు వివరిస్తామని చెప్పారు. బీజేపీ ఏ విధంగా అంబేడ్కర్ ఆశయాలను అమలు చేస్తుందనే విషయాన్ని ప్రజల్లోకి తీసుకెళ్తామని డీకే అరుణ పేర్కొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి
AP Inter Results 2025: ఇంటర్ ఫలితాలు త్వరగా తెలుసుకోవాలంటే దీనిపై క్లిక్ చేయండి
Tirumala Temple Incident: తిరుమలలో అపచారం.. ఏం జరిగిందంటే
59 ఏళ్ల వయసులో చెట్టెక్కిన హీరో
Read Latest AP News And Telugu News