Bhavani Deeksha: ముగిసిన భవానీ దీక్షలు.. ఎంతమంది దర్శించుకున్నారంటే..
ABN , Publish Date - Dec 15 , 2025 | 12:04 PM
విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి భవానీలు భారీగా తరలి వస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో భవానీ దీక్షా విరమణలు సోమవారం ముగిశాయి.
విజయవాడ, డిసెంబరు 15 (ఆంధ్రజ్యోతి): విజయవాడ ఇంద్రకీలాద్రి దుర్గామల్లేశ్వర స్వామి దేవస్థానానికి (Indrakeeladri Durga Malleswara Swamy Temple) భవానీలు భారీగా తరలి వస్తున్నారు. ఇంద్రకీలాద్రిపై పూర్ణాహుతితో భవానీ దీక్షా విరమణలు ఇవాళ(సోమవారం) ముగిశాయి. ఐదు రోజుల పాటు దుర్గమ్మను ఐదులక్షల మందికి పైగా భవానీలు దర్శించుకున్నారు. శని, ఆదివారాలు వారాంతం కావడంతో పెద్ద సంఖ్యలో దుర్గమ్మ సన్నిధికి భవానీలు, సామాన్య భక్తులు తరలివచ్చారు. జై దుర్గా జై జై దుర్గా నామస్మరణతో ఇంద్రకీలాద్రి మార్మోగుతోంది.
తెల్లవారుజాము నుంచే భవానీలు విజయవాడకు తరలివచ్చి అమ్మను దర్శించుకుని దీక్షను విరమిస్తున్నారు. ముందుగా గిరి ప్రదక్షిణ చేసుకుని ఆపై కనక దుర్గమ్మ దర్శనం కోసం క్యూలైన్లలో భవానీలు వేచి ఉన్నారు. అయితే, మరో రెండు రోజుల పాటు భవానీలు వచ్చే అవకాశం ఉంది. భవానీల రద్దీ దృష్ట్యా ఇవాళ(సోమవారం) , రేపు(మంగళవారం) దర్శనానికి ప్రత్యేక ఏర్పాట్లు చేశారు. అమ్మవారిని దర్శించుకోవడానికి భవానీలు భారీగా తరలి వస్తారని అధికారులు చెబుతున్నారు.
ఈ క్రమంలో అన్ని ఆర్జిత సేవలతో పాటు వీఐపీ ప్రోటోకాల్ సేవలు రద్దు చేశారు. ఈ సందర్భంగా ఆలయ ఈవో శీనానాయక్, చైర్మన్ బొర్రా రాధాకృష్ణ మీడియాతో మాట్లాడారు. భవానీలకు ఇబ్బందులు తలెత్తకుండా అన్నీ ఏర్పాట్లు చేశామని తెలిపారు. ఐదురోజుల పాటు అమ్మవారిని ఐదు లక్షల మందికి పైగా దర్శించుకున్నారని వివరించారు. ఇవాళ, రేపు భవానీల రద్దీ ఉంటుందని వెల్లడించారు. గురు భవానీల సమక్షంలో మాల విరమణకు ఏర్పాట్లు చేశామని చెప్పుకొచ్చారు. వీఐపీలు ఎవరు వచ్చినా ఈ రెండు రోజుల పాటు దర్శనాలు కల్పించలేమని పేర్కొన్నారు. ఈ విషయాన్ని వీఐపీ భక్తులు గమనించాలని సూచించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ఆధునాతనంగా మోడల్ పోలీస్స్టేషన్ల నిర్మాణం: హోంమంత్రి అనిత
జీవీఎంసీకి ప్రతిష్టాత్మక అవార్డులు
Read Latest AP News And Telugu News