AP Government: క్వాంటమ్ వ్యాలీపై ఏపీ ప్రభుత్వం కీలక నిర్ణయం
ABN , Publish Date - Jun 30 , 2025 | 12:04 PM
క్వాంటమ్ వ్యాలీపై ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం కీలక నిర్ణయం తీసుకుంది. దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో క్వాంటమ్ వ్యాలీ పార్క్ని ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జనవరి నుంచి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. అమరావతిలో టెక్ వ్యాలీ పార్కులోనే లక్షల మందికి ఉద్యోగావకాశాలు, ఇతర రాష్ట్రాలూ సేవలు వినియోగించుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించనుంది.

అమరావతి: దేశంలోనే తొలిసారిగా ఐబీఎం, టీసీఎస్, ఎల్ అండ్ టీ సహకారంతో క్వాంటమ్ వ్యాలీని (Quantum Computing Valley) ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఏర్పాటు చేయనుంది. జనవరి నుంచి ఏపీలో క్వాంటమ్ వ్యాలీ కార్యకలాపాలు ప్రారంభంకానున్నాయి. అమరావతిలో టెక్ వ్యాలీ పార్కులోనే లక్షల మందికి ఉద్యోగావకాశాలు, ఇతర రాష్ట్రాల సేవలను వినియోగించుకునే వెసులుబాటును ఏపీ ప్రభుత్వం కల్పించనుంది. అమరావతిలో 50 ఎకరాల్లో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు కానుంది. క్వాంటమ్ వ్యాలీతో రూ. 4 వేల కోట్ల పెట్టుబడులు వస్తాయని ప్రభుత్వ అంచనా వేస్తోంది.
అయితే అమరావతిలో ఏర్పాటు చేసే క్వాంటమ్ కంప్యూటింగ్ వ్యాలీపై ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబునాయుడు (AP CM Nara Chandrababu Naidu) అధ్యక్షతన వర్క్షాప్ ఇవాళ(సోమవారం) ప్రారంభమైంది. క్వాంటమ్ వ్యాలీపై విజయవాడలోని నోవాటెల్లో వర్క్షాప్ నిర్వహించారు. వివిధ బహుళ జాతి ఐటీ కంపెనీ, విద్యార్థులు ఏర్పాటు చేసిన స్టాల్స్ని సీఎం చంద్రబాబు, ఐటీ శాఖ మంత్రి నారా లోకేష్ పరిశీలించారు. సాంకేతికతలో వస్తున్న అత్యాధునిక విషయాలను ముఖ్యమంత్రి చంద్రబాబు, మంత్రి లోకేష్ అడిగి తెలుసుకున్నారు. విద్యార్థులు రూపొందించిన నూతన ఆవిష్కరణలను చంద్రబాబు, లోకేష్ ఆసక్తిగా అడిగి తెలుసుకున్నారు. ఈ కార్యక్రమంలో ఫార్మా, వాణిజ్య రంగాలకు చెందిన కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు.
ఈ సదస్సుకు దిగ్గజ ఐటీ కంపెనీల ప్రతినిధులు, టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి. రాజన్న, మైక్రోసాఫ్ట్ ఇండియా ఎండీ రాజీవ్ కుమార్, ఏటీ అండ్ టీ కార్పొరేట్ వైస్ ప్రెసిడెంట్ శ్రీధర్ సిద్ధు, వార్నర్ బ్రదర్స్ ఇండియా ఇన్నోవేషన్ సెంటర్ హెడ్ మనీష్వర్మ, భారత్ బయోటెక్ వ్యవస్థాపకురాలు సుచిత్రా కె. ఎల్లా, హైదరాబాద్లోని అమెరికా కాన్సులేట్ జనరల్ జెన్నిఫర్ లార్సన్, నేషనల్ క్వాంటమ్ మిషన్ డైరెక్టర్ జేబీవీ రెడ్డి, రెడ్డీ ల్యాబ్స్ ఫణిమిత్ర, అస్ట్రా జెన్కా ఎండీ ప్రవీణ్రావు, ఐబీఎం ఇండియా వైస్ ప్రెసిడెంట్ స్కాట్ క్రౌడర్, కేంద్ర శాస్త్రసాంకేతిక మంత్రిత్వశాఖ కార్యదర్శి అభయ్ కరాండికర్, కేంద్ర ప్రభుత్వ ప్రిన్సిపల్ సైంటిఫిక్ అడ్వైజర్ అజయ్ కుమార్ సూద్లు వీరితో పాటు అమెజాన్, హెచ్సీఎల్, ఎల్ అండ్ టీ, ఐఐటీ మద్రాస్, తిరుపతి, బ్యాంక్ ఆఫ్ అమెరికా వంటి సంస్థల ప్రతినిధులు, రాష్ట్ర ప్రభుత్వ ఉన్నతాధికారులు హాజరయ్యారు.
సీఎం చంద్రబాబుకి సపోర్టు చేస్తాం: టీసీఎస్ హెడ్ రాజన్న
2025 అంతర్జాతీయ క్వాంటమ్ టెక్నాలజీని సంవత్సరం క్రితం ప్రకటించారని టీసీఎస్ ప్రెసిడెంట్ అండ్ గ్లోబల్ హెడ్ వి. రాజన్న తెలిపారు. ఏపీలో క్వాంటమ్ వ్యాలీ ఏర్పాటు చేయడం వల్ల రీసెర్చ్ చేసేవారికి ఎంతో ఉపయోకరంగా ఉంటుందని అన్నారు. ఇది కంప్యూటర్ సెంటర్ మాత్రమే కాదని.. భారత్కు ఓ ఆస్తి కూడా అని ఉద్ఘాటించారు. ముఖ్యమంత్రి చంద్రబాబు విజన్ను సపోర్టు చేయడంలో టీసీఎస్ ముందు ఉంటుందని వ్యాఖ్యానించారు. టీసీఎస్, ఐబీఎం 50 ఏళ్లుగా కలిసి పనిచేస్తున్నామని వివరించారు. టీసీఎస్ ఏపీతో కలిసి పనిచేయడానికి ఎంతో ఆనందం వ్యక్తం చేస్తోందని అన్నారు. ఎన్టీఆర్ భరోసా, విద్యార్థుల చదువు విషయంలో ఏపీ ప్రభుత్వంతో ఇప్పటికే చర్చించామని రాజన్న పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి:
సీఎం చంద్రబాబు అధ్యక్షతన క్వాంటం వ్యాలీ నేషనల్ వర్క్ షాప్
ఆర్నెల్లలో పోలీసు శాఖలో ఏఐ యాప్లు
For More AP News and Telugu News