Share News

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఉచిత వైద్యం..

ABN , Publish Date - Sep 04 , 2025 | 04:18 PM

ఆంధ్రప్రదేశ్ మంత్రివర్గం సమావేశంలో పలు కీలక నిర్ణయాలు తీసుకుంది. ముఖ్యమంత్రి చంద్రబాబు అధ్యక్షతన జరిగిన ఈ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి కేబినెట్ ఆమోదముద్ర వేసింది.

AP Cabinet: ఏపీ కేబినెట్ కీలక నిర్ణయం.. ఒక్కో కుటుంబానికి రూ.25 లక్షల ఉచిత వైద్యం..
Ap Cabinet on Universal Health Policy

అమరావతి: ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం రాష్ట్ర ప్రజలకు మెరుగైన ఆరోగ్య సేవలు అందించే దిశగా కీలక నిర్ణయం తీసుకుంది. ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు అధ్యక్షతన జరిగిన కేబినెట్ సమావేశంలో యూనివర్సల్ హెల్త్ పాలసీకి మంత్రివర్గం ఆమోదం తెలిపింది. ఆయుష్మాన్ భారత్ - ఎన్టీఆర్ వైద్య సేవా పథకం కింద ఈ పాలసీని అమలు చేయనున్నారు. ఈ విధానం ద్వారా, రాష్ట్రంలోని ప్రతి కుటుంబానికి ఏడాదికి రూ.25 లక్షల వరకు ఉచిత వైద్య చికిత్స అందిస్తారు. ఆర్థిక స్థితిగతులతో సంబంధం లేకుండా రాష్ట్రంలోని అన్ని వర్గాల వారికి హెల్త్ పాలసీ వర్తించేలా చర్యలు చేపట్టనుంది. రాష్ట్రవ్యాప్తంగా సుమారు 1.63 కోట్ల కుటుంబాలకు ఈ హెల్త్ పాలసీ వర్తించనుంది.


రాష్ట్ర వ్యాప్తంగా 2,493 నెట్‌వర్క్ ఆసుపత్రుల్లో హైబ్రిడ్ విధానం ద్వారా ప్రభుత్వం ఉచిత వైద్యసేవలు అందజేయనుంది. హైబ్రిడ్ విధానం కిందే మొత్తం 3,257 చికిత్సలను పూర్తి ఉచితంగా అందిస్తారు. ప్రీ-ఆథరైజేషన్ మేనేజ్‌మెంట్ ద్వారా కేవలం 6 గంటల్లోనే అనుమతులు మంజూరు చేసే విధానం అమల్లోకి రానుంది. రూ.2.5 లక్షల లోపు ఖర్చులను ఇన్సూరెన్స్ కంపెనీలు భరించనున్నట్లు సమాచారం. ఎన్టీఆర్ వైద్యసేవ ట్రస్ట్ రూ.2.5 లక్షల నుంచి రూ.25 లక్షల వరకూ వైద్య ఖర్చులు భరించనుంది. ఈ కొత్త పథకం 1.43 కోట్ల పేద కుటుంబాలు, 20 లక్షల ఇతర కుటుంబాలకు వర్తించనుంది.


మరోవైపు, పీపీపీ (పబ్లిక్ ప్రైవేట్ పార్ట్‌నర్‌షిప్) విధానంలో రాష్ట్రంలో 10 కొత్త మెడికల్‌ కాలేజీల ఏర్పాటుకు ఏపీ కేబినెట్ ఆమోదం తెలిపింది. రెండు దశల్లో ఆదోని, మదనపల్లె, మార్కాపురం, పులివెందుల, పెనుగొండ, పాలకొల్లు, అమలాపురం నర్సీపట్నం, బాపట్ల, పార్వతీపురంలలో కొత్త వైద్యకళాశాలలు ఏర్పాటు చేస్తారు. ఈ ప్రాజెక్టులకు సంబంధించి ఆర్ఎఫ్‌పీ జారీ చేసేందుకు కేబినెట్ అనుమతించింది.


అలాగే కేబినెట్ భేటీలో పలు కీలక అంశాలు చర్చకు వచ్చినట్లు తెలుస్తోంది. నిల్వలు ఉండీ యూరియా అడ్జస్ట్ చేయలేకపోతున్నారని.. వైసీపీ అసత్య ప్రచారాన్ని కంట్రోల్ చేయడంపై దృష్టి పెట్టాలని సీఎం ఆదేశించినట్లు సమాచారం. వైసీపీ దుష్ప్రచారాలపై మంత్రులు, ఎమ్మెల్యేలు తక్షణమే స్పందించాలని సూచించారు. సుగాలీ ప్రీతి కేసులో సీబీఐ విచారణ జరపాలని.. ఈ మేరకు సీబీఐ డైరెక్టర్ కు లేఖ రాయాలని సీఎం అధికారును ఆదేశించారు. సోషల్ మీడియా అడ్మిన్ బాధ్యతాయుతంగా ఉండేలా చూడాలని సూచించారు. కుప్పం కాలువలోకి నీళ్లు రావడం లేదంటూ సోషల్ మీడియాలో వస్తున్న అసత్య ప్రచారాలకు అడ్డుకట్ట వేయాలని సూచించారు.


ఈ వార్తలు కూడా చదవండి

నేడు ఏపీ కేబినెట్ భేటీ.. కీలక అంశాలపై చర్చ

సుగాలి ప్రీతి కేసుపై సీఎం చంద్రబాబు సంచలన నిర్ణయం

Read Latest Andhra Pradesh News and National News

Updated Date - Sep 04 , 2025 | 05:05 PM