CM Chandrababu: సత్యసాయి కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు: చంద్రబాబు
ABN , Publish Date - Nov 23 , 2025 | 12:21 PM
భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు.
శ్రీ సత్యసాయి జిల్లా ,నవంబరు 23 (ఆంధ్రజ్యోతి): భగవాన్ సత్యసాయి సిద్ధాంతం ప్రపంచమంతా వ్యాపించిందని ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి నారా చంద్రబాబు నాయుడు (CM Nara Chandrababu Naidu) వ్యాఖ్యానించారు. సత్యసాయి ప్రేమ సిద్ధాంతాన్ని మనమంతా అర్థం చేసుకోవాలని.. బాబా కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారని పేర్కొన్నారు. క్రమశిక్షణ, ప్రేమ, సేవాభావం గురించి సత్యసాయి చెప్పారని.. సకలజనుల సంక్షేమాన్ని బాబా కోరుకున్నారని చెప్పుకొచ్చారు. సత్యసాయి పుట్టపర్తి శతజయంతి వేడుకలు వైభవంగా జరుగుతున్నాయి. ఇవాళ(ఆదివారం) సత్యసాయి సమాధిని ముఖ్యమంత్రి దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ప్రసంగించారు సీఎం చంద్రబాబు.
ఒక లక్ష్యం కోసం అవతరించారు..
‘భగవాన్ సత్యసాయి 1926 నవంబర్ 23వ తేదీన ఈ పుణ్యభూమిలో ఒక లక్ష్యం కోసం అవతరించారు. ఈ పవిత్ర నేలపై 86 ఏళ్లు తన జీవన ప్రయాణాన్ని సాగించి సాయి సిద్ధాంతాన్నిప్రపంచానికి అందించారు. జ్ఞానాన్ని బోధించి సన్మార్గం చూపించారు. సమాజ సేవ, సమస్యకు పరిష్కారం, ఆధ్యాత్మిక భావన, ప్రశాంత జీవనం, ముక్తిమార్గంతో కోట్లాదిమంది జీవితాలను ప్రభావితం చేశారు. ఎనిమిదేళ్ల వయసు నుంచే ప్రార్థనలు, కీర్తనలు, భజనలతో దైవ చింతన కలిగిన వ్యక్తిగా వ్యవహరించేవారు. 1940 మే 23వ తేదీన సత్యసాయి వయసు 14 ఏళ్లు... అప్పుడే ఆయన సత్యనారాయణరాజుగా ఉన్న పూర్వాసన నామాన్ని వదలుకుని సత్యసాయిగా సాక్షాత్కరించారు. దేవుళ్లు ఎక్కడో ఒకచోట అవతరిస్తారు. సతస్యాయి ఈ పుణ్యభూమిని ఎంచుకున్నారు. చిత్రావతి నది ఒడ్డున పుట్టపర్తిని ఆధ్యాత్మికతకు, దైవత్యానికి నిలయంగా మార్చారు. మావన రూపంలో మనం చూసిన దైవమే సత్యసాయి శత జయంతి సందర్భంగా ఆయన సేవలను స్మరించుకోవడం అందరి అదృష్టం’ అని సీఎం చంద్రబాబు పేర్కొన్నారు.
సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారు..
‘లవ్ ఆల్, సర్వ్ ఆల్వ్..హెల్ప్ ఎవర్, హర్ట్ నెవర్ అని సత్యసాయి బోధించారు. సత్యం, ధర్మం, శాంతి, ప్రేమ, అహింసా సిద్ధాంతాలతో నూతన అధ్యాయం ప్రారంభించారు. 1960లో బాబా స్థాపించిన సత్యసాయి సంస్థలతో సేవలకు రూపం వచ్చింది. విశ్వశాంతి, విశ్వ సౌభాగ్యం, సకల జనుల సంక్షేమాన్ని కోరుకున్నారు. భగవాన్ మనోదర్శనం ద్వారా దేశ విదేశాల నుంచి సంపన్నులు, ప్రముఖులు వచ్చి ఆయన సేవా మార్గాన్ని అనుసరించారు. ఎవరూ పిలవకున్నా వారంతట వారే వచ్చి బాబా సిద్ధాంతాన్ని పాటించారు. డబ్బు, పేరు, పదవి ఉన్నా ఎక్కడా లేని ప్రశాంతత పుట్టపర్తిలో అందుకున్నారు. బాబా లేకపోయినా.. ఆయన నింపిన స్ఫూర్తి ఉంది. ప్రశాంతి నిలయం ఒక ఎనర్జీ సెంటర్. శతజయంతితో పాటు ఈ రోజు మరో విశిష్టత ఉంది. ఈ ప్రశాంతి నిలయం నిర్మించి నేటికి 75 ఏళ్లు. ఆధ్యాత్మిక సంబరాలకు ఈ నిలయం వేదికైంది. భక్తుల బాధలకు, కష్టాలకు పరిష్కారం చూపే నిలయంగా మారింది. మానవ సేవే మాధవ సేవగా భావించే బాబా... సత్యసాయి సెంట్రల్ ట్రస్టు ద్వారా సేవలను మరింత విస్తరించారు. విద్య నుంచి వైద్యం వరకూ, తాగునీటి నుంచి మానసిక సంతృప్తి వరకూ అందరికీ దక్కేలా చేశారు. దేశ విదేశాల్లో ట్రస్టు ద్వారా సేవలందించారు’ అని సీఎం చంద్రబాబు వ్యాఖ్యానించారు.
ఉచిత విద్య అందిస్తున్నారు...
‘సత్యసాయి ట్రస్టు ద్వారా 102 పాఠశాలల్లోని 60 వేలమంది విద్యార్థులకు ఉచిత విద్యను అందిస్తున్నారు. ట్రస్టు ఆస్పత్రుల ద్వారా మూడు వేల మందికి ప్రతిరోజూ వైద్య సేవలు అందిస్తున్నారు. దాహార్తిని తీర్చడానికి రూ.550 కోట్లతో ఏపీ, తెలంగాణ, తమిళనాడులో 16 వందల గ్రామాల్లో 30 లక్షల మందికి పైగా నీరు అందిస్తున్నారు. చెన్నై డ్రికింగ్ మోడరేజేషన్కు రూ.250 కోట్లు ఖర్చు పెట్టారు. సత్యసాయి ట్రస్టు 140 దేశాలు, 2 వేల కేంద్రాల్లో విస్తరించింది. సత్యసాయి ఇంటర్ నేషనల్ ఆర్గనేజేషన్ 10 జోన్లుగా.. ప్రపంచ దేశాల్లో సాయి సిద్ధాంతాన్ని, సేవలను ముందుకు తీసుకెళ్తున్నాయి. చాలా గర్వపడుతున్నా... సత్యసాయికి ఈ రోజు 7.50 లక్షల మంది సేవా సభ్యులు ఉన్నారు. బాబా సేవలను వివరించేందుకు ఏపీ ప్రభుత్వం అధికారికంగా ఉత్సవాలు నిర్వహిస్తోంది. తెలంగాణ ప్రభుత్వం కూడా అధికారికంగా నిర్వహిస్తునందుకు సీఎం రేవంత్రెడ్డిని అభినందిస్తున్నా. సత్యసాయి సిద్ధాంతాన్ని ముందుకు తీసుకెళ్లేందుకు మమ్ముల్ని బాబా ఇక్కడికు రప్పించారు. వేడుకలకు హాజరైన ప్రతి ఒక్కరినీ అభినందిస్తున్నా. వసుదైక కుటుంబం భారతీయులకు మూలం. సత్యసాయి బోధనల ద్వారా దాన్ని నిలబెట్టుకుందాం’ అని సీఎం చంద్రబాబు సూచించారు .
ఈ వార్తలు కూడా చదవండి...
సత్యసాయి చూపిన మార్గంలో కోట్లాది భక్తులు నడుస్తున్నారు: మంత్రి నారా లోకేశ్
ఏపీలో భారీ పేలుడు.. ఏమైందంటే..
Read Latest AP News And Telugu News