Share News

మీకు ఇష్టమైన భాషను ఎంచుకోండి

TS Politics: ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త అక్షర సత్యం.. రేవంత్ విచారణ చేపట్టాల్సిందే.. : బండి సంజయ్

ABN , Publish Date - Mar 02 , 2024 | 04:09 PM

ధరణి పోర్టల్‌ను గత ప్రభుత్వం అనుకూలంగా మార్చుకుందని కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ ఆరోపించారు. భూదాన్ భూమి పేరుతో సాఫ్ట్ వేర్ ఉద్యోగుల భూమిని కొట్టేశారని వివరించారు. ఆంధ్రజ్యోతి పత్రికలో ఈ రోజు వచ్చిన కథనం అక్షర సత్యం అని వివరించారు.

TS Politics: ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త అక్షర సత్యం.. రేవంత్ విచారణ చేపట్టాల్సిందే.. : బండి సంజయ్

హైదరాబాద్: లోసుగులను అడ్డం పెట్టుకొని, అధికారుల అండతో కోట్ల విలువచేసే భూమిని గత పాలకులు కొట్టేశారు. ధరణి పోర్టల్‌ను పావుగా వాడుకున్నారు. రంగారెడ్డి జిల్లాలో గల వట్టివాగులపల్లిలో 63 మంది సాఫ్ట్ వేర్ ఉద్యోగులు కలిసి కొనుగోలు చేసిన 8 ఎకరాల భూమిని అప్పటి సీఎం కేసీఆర్ (CM KCR) బంధువులు రాబంధుల్లా లాక్కున్నారు. ఆ ఘటన గురించి ఆంధ్రజ్యోతి (Andhra Jyothy) దినపత్రిక శనివారం నాడు ప్రత్యేక కథనం రాసింది. ఉద్యోగులకు ఆ భూమి ఎందుకు రిజిస్ట్రేషన్ కాలేదు..? లే అవుట్‌కు అనుమతి ఎందుకు ఇవ్వలేదు..? భూదాన్ భూమి అని ఎలా చూపారు..? గత ప్రభుత్వంలో పెద్ద తలకాయ ఆ భూమిని ఎలా చేజిక్కించుకున్నారో సవివరంగా కథనం రాసింది. ఆ కథనం అక్షర సత్యం అంటున్నారు భారతీయ జనతా పార్టీ నేత, కరీంనగర్ ఎంపీ బండి సంజయ్ (Bandi Sanjay).

15 రోజుల నుంచి ఆధారాలు సేకరణ

సొంతింటి కలను సాకారం చేసుకుందామని సాఫ్ట్ వేర్ ఉద్యోగులు గ్రూపుగా ఏర్పడి 8 ఎకరాల భూమిని కొనుగోలు చేశారు. లే అవుట్ రిజిస్ట్రేషన్ చేయాలంటే జీవో 111 అని నిలిపివేశారు. తర్వాత హైకోర్టు అనుకూలంగా తీర్పు ఇచ్చింది. హమ్మయ్యా అని ఊపిరి పీల్చుకోగా.. వెంటనే అప్పటి ప్రభుత్వ పెద్ద కన్ను పడింది. బీఆర్ఎస్ నేత బోయినపల్లి వినోద్ సోదరుడు శ్రీనివాస రావు రంగంలోకి దిగాడు. భూమిని దక్కించుకునేందుకు సొసైటీ అధ్యక్షుడిని పావుగా మార్చుకున్నాడు. తిమ్మిని బమ్మిని చేసి ఆ భూమిని దక్కించుకున్నాడు. ఆ కథనంపై బండి సంజయ్ స్పందిస్తూ.. భూదాన్ భూమిపై ఆంధ్రజ్యోతి ఆధారాలతో సహా బయటపెట్టిందని వివరించారు. భూదాన్ భూములపై గత 15 రోజుల నుంచి తాను ఆధారాలు సేకరిస్తున్నానని బండి సంజయ వివరించారు. శనివారం నాడు (ఈ రోజు) ఆంధ్రజ్యోతి పత్రిక ఆ కుంభకోణాన్ని వెలుగులోకి తీసుకొచ్చిందని వివరించారు. ధరణి పేరు చెప్పి ఉద్యోగుల భూమిని బలవంతంగా లాక్కున్నారని బండి సంజయ్ విమర్శించారు.

ఆంధ్రజ్యోతి వార్త అక్షర సత్యం

భూదాన్ భూములకు సంబంధించి ఆంధ్రజ్యోతిలో వచ్చిన వార్త అక్షర సత్యం అని బండి సంజయ్ వివరించారు. 8 ఎకరాల భూమిని తక్కువ ధరకు బోయినపల్లి శ్రీనివాస రావు కొట్టేసాడని మండిపడ్డారు. దీంతో రూ.500 కోట్ల మేర కేసీఆర్ కుటుంబానికి లబ్ధి కలిగిందని వెల్లడించారు. ఆంధ్రజ్యోతి పత్రిక బయటపెట్టిన ఆధారాలపై తెలంగాణ ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి విచారణకు ఆదేశించాలని డిమాండ్ చేశారు. ధరణి పేరుతో చాలా మంది మోసపోయారని బండి సంజయ్ గుర్తుచేశారు. ధరణి బాధితులతో సమావేశం ఏర్పాటు చేస్తే జింఖానా గ్రౌండ్ కూడా సరిపోదని సెటైర్లు వేశారు. భూములు కొట్టేయడానికే గత ప్రభుత్వం ధరణి పోర్టల్ తీసుకొచ్చిందని బండి సంజయ్ విమర్శించారు. ధరణి వల్ల సామాన్యులకు నష్టం, కేసీఆర్ కుటుంబానికే లాభం జరిగిందని బండి సంజయ్ విమర్శించారు.

మరిన్ని తెలంగాణ వార్తల కోసం ఈ లింక్ క్లిక్ చేయండి.

ఇది కూడా చదవండి: TS News: ధరణి బూచితో భూమి స్వాహా.. రూ.500 కోట్ల భూమి బోయినపల్లి వినోద్‌ సోదరుడికి రిజిస్ట్రేషన్‌

Updated Date - Mar 02 , 2024 | 05:22 PM