Covid-19: కోవిడ్ విజృంభణపై కేంద్రం మరోసారి అలర్ట్

ABN , First Publish Date - 2023-03-16T18:40:33+05:30 IST

దేశంలో కోవిడ్ (Covid-19) విజృంభణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి అలర్ట్‌ అయింది.

Covid-19: కోవిడ్ విజృంభణపై కేంద్రం మరోసారి అలర్ట్
Covid-19

న్యూఢిల్లీ: దేశంలో కోవిడ్ (Covid-19) విజృంభణపై కేంద్ర ప్రభుత్వం మరోసారి అలర్ట్‌ అయింది. ఆరు రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్య కుటుంబ సంక్షేమ శాఖ(Union Health and Family Welfare Ministry) లేఖలు రాసింది. గుజరాత్‌(Gujarat), తెలంగాణ(Telangana), మహారాష్ట్ర(Maharashtra), కేరళ(Kerala), తమిళనాడు(Tamil Nadu), కర్నాటక(Karnataka) రాష్ట్రాలకు కేంద్ర ఆరోగ్యశాఖ లేఖలు రాసింది. కోవిడ్ కేసులు పెరుగుతుండటంతో కరోనా టెస్టులు(test), ట్రాకింగ్‌(track), వ్యాక్సినేషన్‌(vaccinations) పెంచాలని లేఖలో రాసింది. గతంలో మాదిరిగా మొత్తం ఐదు వ్యూహాలను అమలు చేయాలని సూచించింది.

భారత్‌లో ఇటీవల కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణం ఎక్స్‌బీబీ.1 వేరియంట్ యొక్క సబ్ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.16 అయి ఉండవచ్చునని SARS-CoV2 వేరియంట్స్‌‌‌ను ట్రాక్ చేస్తున్న దేశ, విదేశీ శాస్త్రవేత్తలు అంచనా వేస్తున్నారు. అయితే దీని గురించి తగినంత సమాచారం అందుబాటులో లేదని మరికొందరు నిపుణులు చెప్తున్నారు.

కోవిడ్ వేరియంట్లను ట్రాక్ చేస్తున్న ఇంటర్నేషనల్ ప్లాట్‌ఫాం ఒకటి వెల్లడించిన వివరాల ప్రకారం, ఈ వేరియంట్ల వారసత్వ పరంపర ఎక్కువగా భారత్‌ నుంచే వచ్చింది. భారత్‌లో 48 వారసత్వ పరంపర (Subvarients)లను గుర్తించారు. ఆ తర్వాతి స్థానాల్లో బ్రూనై (22), అమెరికా (15), సింగపూర్ (14) ఉన్నాయి. ఈ సబ్‌వేరియంట్లు భారత్‌తో సహా నాలుగు దేశాల్లో ఎక్కువగా ఉన్నాయి. కొన్ని ప్రాంతాల్లో ఎక్స్‌బీబీ.1.16 చాలా వేగంగా వ్యాపిస్తోందని ప్రపంచవ్యాప్తంగా కోవిడ్ వేరియంట్లను ట్రాక్ చేస్తున్న నిపుణులు గుర్తించారు.

కోవ్‌స్పెక్ట్రమ్ (covSPECTRUM) వెల్లడించిన వివరాల ప్రకారం, మహారాష్ట్ర, గుజరాత్ రాష్ట్రాల్లో ఎక్స్‌బీబీ.1.16 అధికంగా ఉంది. ఈ వేరియంట్ ఎక్స్‌బీబీ.1.5 నుంచి వచ్చినది కాదు. ఈ రెండూ ఎక్స్‌బీబీ నుంచి వచ్చినవే. మన దేశంలోని జీనోమ్ సీక్వెన్సింగ్ నెట్‌వర్క్ నిపుణుడు ఒకరు తెలిపిన వివరాల ప్రకారం, ప్రస్తుతం మన దేశంలో ఎక్స్‌బీబీ.1.ఎక్స్‌బీబీ ప్రబలంగా కనిపిస్తోంది. ఇటీవల మన దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణం ఎక్స్‌బీబీ.1.16, ఎక్స్‌బీబీ.1.5 కారణం కావచ్చు. మరికొన్ని నమూనాలను పరీక్షిస్తే మరింత స్పష్టత వచ్చే అవకాశం ఉంది. భారత దేశం నుంచి సింగపూర్, అమెరికా, బ్రూనైలకు వెళ్ళిన ప్రయాణికుల నుంచి సేకరించిన నమూనాలలో ఎక్స్‌బీబీ.1.16 ఉంది. కాబట్టి ఈ సబ్‌వేరియంట్ భారత దేశంలో కోవిడ్ కేసుల పెరుగుదలకు కారణమవుతుండవచ్చు. భారత దేశంలోనే పుట్టి ఉండవచ్చు. వ్యాపిస్తున్న అన్ని ఇతర SARS-CoV-2 వేరియంట్లను బహుశా ఎక్స్‌బీబీ.1.16 అధిగమించవచ్చు.

భారత్‌లో గతంలో కోవిడ్ కట్టడికి ఎన్ని జాగ్రత్తలు తీసుకున్నా ఫస్ట్ వేవ్, సెకండ్ వేవ్ సమయంలో అనేకమంది ప్రాణాలు కోల్పోయారు. సెకండ్ వేవ్‌లో ఆక్సిజన్ కొరత కూడా ఏర్పడటంతో ఎక్కువ మంది చనిపోయారు. ఆ తర్వాత కేంద్రం మరింత అప్రమత్తమై దేశీయంగా వ్యాక్సిన్లను తయారు చేసింది. అంతర్జాతీయ ప్రమాణాలతో తయారైన భారత వ్యాక్సిన్లు భారతీయులనే కాకుండా ప్రపంచంలోని అనేక దేశాల ప్రజలను కాపాడాయి.

Updated Date - 2023-03-16T18:40:37+05:30 IST