Nitish Tejashwi meets Akhilesh: మమత దగ్గర్నుంచి నేరుగా అఖిలేష్ వద్దకు వచ్చిన నితీశ్, తేజస్వీ

ABN , First Publish Date - 2023-04-24T18:38:44+05:30 IST

నితీశ్ కుమార్ బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను కలుసుకున్నారు.

Nitish Tejashwi meets Akhilesh: మమత దగ్గర్నుంచి నేరుగా అఖిలేష్ వద్దకు వచ్చిన నితీశ్, తేజస్వీ

న్యూఢిల్లీ: బీహార్ ముఖ్యమంత్రి (Bihar CM), జేడియూ అధినేత నితీశ్ కుమార్ (JDU chief Nitish Kumar), బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీ యాదవ్ (Bihar Deputy CM Tejashwi Yadav) లక్నోలో సమాజ్‌వాదీ పార్టీ అధినేత అఖిలేష్ యాదవ్‌ను (SP chief Akhilesh Yadav) కలుసుకున్నారు. కోల్‌కతా (Kolkata) నుంచి నేరుగా లక్నో(Lucknow) వచ్చిన వారిద్దరికీ అఖిలేష్ పుష్పగుచ్ఛాలిచ్చి సాదరంగా స్వాగతం పలికారు. అనంతరం 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల ఐక్యత ఆవశ్యకతపై ముగ్గురు నేతలూ చర్చించారు. ప్రతిపక్షాలకు కాంగ్రెస్ నేతృత్వం అనే విషయంపై కూడా చర్చించారని సమాచారం. అయితే ఈ విషయంపై అఖిలేష్ గతంలోనే క్లారిటీ ఇచ్చారు. ప్రాంతీయ పార్టీలతో కలిసి పనిచేసేందుకు కాంగ్రెస్ సిద్ధపడాలన్నారు. నేతృత్వం ఎవరిదనేది పక్కన పెట్టి విపక్షాలన్నీ ఐక్యంగా ఉండాలని, అప్పుడే బలమైన బీజేపీని ఢీ కొట్టగలమని చర్చించినట్లు తెలిసింది.

అంతకు ముందు నితీశ్, తేజస్వీ టీఎంసీ(TMC) అధినేత్రి మమతా బెనర్జీతో (Mamata Banerjee) కోల్‌కతాలో సమావేశమయ్యారు. తాజా రాజకీయ పరిణామాలపై చర్చించారు. 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో విపక్షాల ఐక్యత చాటాలని నిర్ణయించారు. సమావేశానంతరం ముగ్గురూ కలిసి విలేకరుల సమావేశం నిర్వహించారు. తమ మధ్య చర్చలు సానుకూలంగా సాగాయని చర్చల అనంతరం నితీశ్ చెప్పారు. బీజేపీ పబ్లిసిటీ చేసుకోవడం తప్ప దేశాభివృద్ధి కోసం చేసిందేమీ లేదన్నారు. విపక్ష నేతలంతా కలిసి కూర్చుని వ్యూహాలు రూపొందిస్తే బాగుంటుందని మమత చెప్పారు. బీజేపీని జీరో చేయడమే తమ లక్ష్యమన్నారు. బీహార్‌లోనే నాడు డాక్టర్ జయప్రకాశ్ నారాయణ్ ఉద్యమం ప్రారంభమైందని, ఇప్పుడు కూడా ప్రతిపక్షాలకు సంబంధించి అఖిల పక్ష సమావేశం బీహార్‌లో నిర్వహిస్తే బాగుంటుందని మమత సూచించారు.

నితీశ్ ఏప్రిల్ 12న ఢిల్లీ ముఖ్యమంత్రి, ఆప్ అధినేత అరవింద్ కేజ్రీవాల్‌ను(Delhi Chief Minister Arvind Kejriwal) కలుసుకున్నారు. ప్రతిపక్షాల ఐక్యత గురించి చర్చించారు. కేంద్రంలో బలంగా ఉన్న నరేంద్ర మోదీ(PM Modi) సారథ్యంలోని బీజేపీ(BJP) ప్రభుత్వాన్ని నిలువరించాలంటే ప్రతిపక్షాలు ఏకతాటిపైకి రావాల్సిన అవసరం ఉందని చర్చించారు. ప్రతిపక్షాలు కలిసి కట్టుగా ఉంటూ కేంద్రం నుంచి మోదీ సర్కారును సాగనంపాలని నిర్ణయించినట్లు సమావేశానంతరం కేజ్రీవాల్, నితీశ్ చెప్పారు. అయితే ఆ తర్వాత వారం రోజుల వ్యవధిలోనే తాము 2024 లోక్‌సభ ఎన్నికల్లో ఒంటరిగా పోటీ చేస్తామని ఆప్ ప్రకటించింది. ప్రధాని అభ్యర్థి ఎవరనేది ప్రజలనే నిర్ణయించనీయాలని ఆప్ సూచించింది. కేజ్రీవాల్ మొదట్నుంచీ కాంగ్రెస్ పార్టీని వ్యతిరేకిస్తున్నారు. బీజేపీకి ధీటైన జాతీయ ప్రత్యామ్నాయం ఆమ్ ఆద్మీ పార్టీదేనని కేజ్రీవాల్ విశ్వాసం. ఇదే విషయాన్ని ఆయన అనేక వేదికలపై ప్రకటించారు. ఇప్పటికే ఆప్ ఢిల్లీ, పంజాబ్‌లో కాంగ్రెస్ పార్టీని ఓడించి, గోవా, గుజరాత్‌లో ఉనికి చాటుకుని జాతీయ పార్టీ హోదా కూడా పొందింది. దీంతో నితీశ్ యత్నాలు నీరుగారిపోయినట్లైంది.

వాస్తవానికి ఏప్రిల్ 12న నితీశ్ బీహార్‌ కేజ్రీవాల్‌ను కలిసే ముందు బీహార్ ఉప ముఖ్యమంత్రి తేజస్వీయాదవ్‌తో కలిసి కాంగ్రెస్ పార్టీ జాతీయ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే (Congress president Mallikarjun Kharge) ఢిల్లీ నివాసానికి వెళ్లారు. అప్పటికే అక్కడకు చేరుకున్న కాంగ్రెస్ నేత రాహుల్ గాంధీ వీరికి స్వాగతం పలికారు. అనంతరం అందరూ గ్రూప్ ఫొటోలు దిగారు. ఆ తర్వాత 2024 లోక్‌సభ ఎన్నికల నేపథ్యంలో ప్రతిపక్షాల మధ్య ఐక్యతను సాధించడంపై చర్చించారు. కాంగ్రెస్ అనుకూల పార్టీలతో పాటు కాంగ్రెసేతర పార్టీలను కూడా సంప్రదించాలని నిర్ణయించారు. ప్రధాని అభ్యర్ధి ఎవరనేదానికన్నా, ప్రతిపక్షాలన్నింటినీ ఒకేతాటిపైకి తీసుకురావడమే లక్ష్యంగా చర్చలు సాగాయి.

2024 ఎన్నికల్లో ప్రధాని అభ్యర్థి నితీశేనని తొలుత ప్రచారం జరిగింది. అయితే ఆ ప్రచారాన్ని ఆయన తోసిపుచ్చారు. రాహుల్ ప్రధాని అభ్యర్థిత్వానికి మద్దతు కూడా ఇచ్చారు. అయితే ప్రస్తుతం పరిస్థితులు మారిపోయాయి. రాహుల్‌పై అనర్హత వేటు పడటంతో కాంగ్రెస్ తరపున ప్రధాని అభ్యర్ధి ఎవరనేది తేలాల్సి ఉంది. అదే సమయంలో కాంగ్రెస్ నేతృత్వాన్ని ఇష్టపడని అనేక పార్టీలున్నాయి. కొన్ని ప్రతిపక్ష పార్టీలు ఇప్పటికే యూపిఏలో కొనసాగుతున్నారు. ఎన్సీపీ, ఉద్దవ్ శివసేన ఇప్పటికే కాంగ్రెస్ కూటమిలోనే ఉన్నాయి. స్టాలిన్ కూడా యూపిఏ భాగస్వామిగానే ఉన్నారు. బిజూ జనతాదళ్ అధినేత నవీన్ పట్నాయక్ దాదాపు అన్ని కూటములకూ దూరంగా ఉన్నారు. కాంగ్రెస్‌పై బీఆర్ఎస్ అధినేత కేసీఆర్ వైఖరి ఈ ఏడాది ఆఖరులో తెలంగాణ అసెంబ్లీ ఎన్నికల్లో వచ్చే ఫలితాలను బట్టి స్పష్టమౌతుంది.

అంతకు ముందు అదానీ అంశం ప్రజాసమస్య కాదని, అదానీ (Adani) చేసిన మేలును కూడా గుర్తించాలంటూ ఎన్సీపీ(NCP) అధినేత శరద్ పవార్ (Sharad Pawar) వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాలు అయోమయంలో పడిపోయాయి. అంతేకాదు ప్రధాని విద్యార్హత అంశం కూడా ప్రజా సమస్య కాదని పవార్ వ్యాఖ్యానించడంతో ప్రతిపక్షాల్లో ఐక్యత లేదనే సంకేతాలు ప్రజల్లోకి వెళ్లాయి. దీంతో పరిస్థితిని చక్కబెట్టేందుకు కాంగ్రెస్ నేతలు వెనువెంటనే నితీశ్‌ను తెరపైకి తీసుకువచ్చారు.

2024 లోక్‌సభ ఎన్నికల్లో బీజేపీని ఓడించాలంటే 543 నియోజకవర్గాల్లోనూ ప్రతిపక్షాల తరపున ఒక్క అభ్యర్థే ఉండాలని నితీశ్ చెప్పినట్లు తెలిసింది. ఇదే జరిగితే బీజేపీ వ్యతిరేక ఓటు చీలిపోకుండా ఉంటుందని, బీజేపీ అభ్యర్థులను ఓడించడం సులభమౌతుందని నితీశ్ రాహుల్, ఖర్గేలకు వివరించారు.

నితీశ్ యత్నాలకు మమత, అఖిలేష్ సానుకూలంగా స్పందించారు. దీంతో ప్రతిపక్షాల్లో కదలిక మొదలైంది. 2024 లోక్‌సభ ఎన్నికలే లక్ష్యంగా ప్రాంతీయ పార్టీలన్నీ ఏకమయ్యేందుకు నితీశ్ మరింతమంది నేతలను కలవనున్నారు. రాబోయే రోజుల్లో మరిన్ని సమావేశాలు జరగనున్నాయి. కొద్ది రోజుల్లోనే ప్రతిపక్ష నేతలంతా ఒకేతాటిపైకి వచ్చే అవకాశాలు కనిపిస్తున్నాయి. బీజేపీకి వ్యతిరేక పోరులో ఏదో ఒక దశలో ఆమ్ ఆద్మీ పార్టీ కూడా విపక్షాలతో కలిసి పనిచేసే అవకాశం ఉందని రాజకీయ పరిశీలకులు అంచనా వేస్తున్నారు. 2024 లోక్‌సభ ఎన్నికల తేదీ దగ్గరపడే కొద్దీ ప్రతిపక్షాల మధ్య మరింత ఐక్యత సాధ్యమయ్యే అవకాశం ఉందంటున్నారు.

Updated Date - 2023-04-24T18:53:34+05:30 IST