రికార్డు స్థాయిలో ధాన్యం ధర
ABN , Publish Date - Jun 18 , 2026 | 11:31 AM
మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర ఈ సీజన్లో అత్యధికంగా క్వింటాకు రూ.2,906 నమోదైంది.
ఆర్ఎన్ఆర్ క్వింటాకు గరిష్ఠంగా రూ.2,906
కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో వడ్లకు హైరేట్
కేసముద్రం(మహబుబాబాద్): మహబుబాబాద్ జిల్లా కేసముద్రం వ్యవసాయ మార్కెట్లో ధాన్యం ధర ఈ సీజన్లో అత్యధికంగా క్వింటాకు రూ.2,906 నమోదైంది. గత 15 రోజులుగా ఈ మార్కెట్లో ఆర్ఎన్ఆర్ రకం వడ్లరేట్ రోజురోజుకూ పెరుగుతోంది. స్థానిక మార్కెట్కు బుధవారం ధాన్యాన్ని 11 మంది రైతులు 274 బస్తాల్లో తీసుకురాగా, ఎలక్ట్రానిక్ నేషనల్ అగ్రికల్చర్ మార్కెట్ (ఈ-నామ్) విధానంలోని ‘ఈ- వేలం’లో క్వింటాకు గరిష్ఠంగా రూ.2,906, కనిష్ఠంగా రూ.2, 226, సగటున రూ.2,589 ధరలతో వ్యాపారులు ఖరీదులు చేశారు. ధాన్యానికి ప్రభుత్వ కనీస మద్దతు ధర (ఎంఎ్సపీ) క్వింటాకు రూ.2,389 ఉండగా,
ఈ సీజన్లో అంతకంటే ఎక్కువగానే మార్కెట్లో ధరలు ఉన్నాయి. ఎల్నినో ప్రభావంతో వర్షాలు తక్కువగా ఉంటాయనే కారణాలతో వ్యాపారులు నిల్వ చేసేందుకు మార్కెట్లో ధాన్యం ఖరీదులు పెంచారు. ఈ క్రమంలో దేశీయంగా ధాన్యానికి డిమాండ్ ఏర్పడడంతో మార్కెట్లో ఈ సీజన్లో గత 15 రోజులుగా ధాన్యం సగటు ధర పెరుగుతూ వస్తోంది. ఈ నెల 1న ధాన్యం సగటు ధర రూ.2,475 నుంచి రూ.2,495 వరకు ఉన్నాయి. ఆ తర్వాత ఈనెల 4న సగటు ధర రూ.2, 589, 5న రూ.2636, 8న రూ.2,689, 9న రూ.2,729గా నమోదయ్యాయి. తాజా గా గరిష్ఠ ధర రూ.2,900 మార్కు దాటడం విశేషం.
ఈ వార్తలు కూడా చదవండి:
Read Latest AP News And Telangana News And International News And Telugu News