Share News

సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ.. వృద్ధురాలి బంగారం అపహరణ..

ABN , Publish Date - Feb 19 , 2026 | 07:26 PM

సంగారెడ్డి జిల్లా జోగిపేట బస్టాండ్‌లో 16 తులాల బంగారం చోరీ జరిగింది. హైదరాబాద్‌లో వివాహ వేడుకకు వెళ్తున్న వృద్ధురాలు చెగురి లక్ష్మి బ్యాగు నుంచి దుండగులు నగలను అపహరించారు. బాధితురాలి ఫిర్యాదుతో రంగంలోకి దిగిన జోగిపేట పోలీసులు నిందితుల కోసం వేట సాగిస్తున్నారు..

సంగారెడ్డి జిల్లాలో భారీ చోరీ.. వృద్ధురాలి బంగారం అపహరణ..
Jogipet Bus Stand Theft

సంగారెడ్డి జిల్లా, ఫిబ్రవరి 19 (ఆంధ్రజ్యోతి): సంగారెడ్డి జిల్లా జోగిపేట పట్టణంలోని ఆర్టీసీ బస్టాండ్‌లో పట్టపగలే భారీ చోరీ (Jogipet Bus Stand Theft) జరిగింది. ఓ శుభకార్యానికి వెళ్తున్న వృద్ధురాలిని లక్ష్యంగా చేసుకున్న దుండగులు.. ఆమె బ్యాగులోని 16 తులాల బంగారాన్ని అత్యంత చాకచక్యంగా అపహరించారు. అల్లాదుర్గానికి చెందిన చెగురి లక్ష్మి అనే వృద్ధురాలు.. హైదరాబాద్‌లోని తన మేనకోడలి కుమారుడి వివాహానికి హాజరయ్యేందుకు బయలుదేరింది.


ఈ క్రమంలో అల్లాదుర్గం నుంచి జోగిపేట బస్టాండ్‌కు చేరుకున్న ఆమె.. అక్కడ దిగి, తన బంధువుతో కలిసి హైదరాబాద్ వెళ్లే మరో బస్సు ఎక్కేందుకు సిద్ధమైంది. అయితే బస్సు ఎక్కుతున్న సమయంలో ప్రయాణికుల రద్దీని అదునుగా చేసుకున్న గుర్తు తెలియని దుండగుడు.. ఆమె వద్ద ఉన్న బ్యాగు నుంచి 16 తులాల బంగారు ఆభరణాలను దొంగిలించి పరారయ్యాడు. ఈ భారీ చోరీ ఘటన స్థానికంగా కలకలం రేపింది. చోరీకి పాల్పడిన వ్యక్తిని గుర్తించేందుకు పోలీసులు ప్రత్యేక చర్యలు చేపట్టారు.


పోలీసుల దర్యాప్తు..

బంగారం పోయిందని గుర్తించిన బాధితురాలు.. కన్నీరుమున్నీరుగా విలపిస్తూ జోగిపేట పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేసింది. బాధితురాలి ఫిర్యాదు మేరకు పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు ప్రారంభించారు. బస్టాండ్ ఆవరణ, పరిసర ప్రాంతాల్లో ఉన్న సీసీ (CC) కెమెరాల ఫుటేజీని పరిశీలిస్తున్నారు.


అనుమానిత వ్యక్తుల కదలికల ఆధారంగా నిందితుడిని పట్టుకునేందుకు గాలింపు చర్యలు చేపట్టారు. బస్టాండ్‌లు, రద్దీ ప్రాంతాల్లో ప్రజలు అప్రమత్తంగా ఉండాలని పోలీసులు సూచించారు. ముఖ్యంగా విలువైన వస్తువులు తీసుకెళ్తున్నప్పుడు జాగ్రత్తగా ఉండాలని హెచ్చరించారు. అనుమానాస్పద వ్యక్తులు కనిపిస్తే వెంటనే పోలీసులకు సమాచారం ఇవ్వాలని సూచించారు. నిందితుడిని త్వరగా గుర్తించి బంగారాన్ని స్వాధీనం చేసుకుంటామని పోలీసులు తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

జాతిపిత ప్రజల్లోకి ఎందుకు రావట్లేదు.. కేసీఆర్‌పై కడియం శ్రీహరి సెటైర్లు

మల్లికార్జున ఖర్గేతో తెలంగాణ కాంగ్రెస్ నేతల భేటీ.. పలు కీలక అంశాలపై చర్చ..

Read Latest Telangana News And AP News And Telugu News

Updated Date - Feb 19 , 2026 | 07:53 PM