త్వరలోనే పెండింగ్ ఓవర్సీస్ స్కాలర్షిప్ల విడుదల: భట్టి విక్రమార్క
ABN , Publish Date - May 28 , 2026 | 09:34 PM
తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ ప్రోత్సాహానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇవాళ ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో ఆయన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించారు.
ఖమ్మం, మే 27: తెలంగాణ ప్రభుత్వం గ్రీన్ ఎనర్జీ (హరిత ఇంధనం) ప్రోత్సాహానికి అత్యంత ప్రాధాన్యం ఇస్తోందని రాష్ట్ర ఉప ముఖ్యమంత్రి మల్లు భట్టి విక్రమార్క స్పష్టం చేశారు. ఇవాళ(గురువారం) ఖమ్మం జిల్లా బోనకల్ మండలం గార్లపాడు గ్రామంలో ఆయన సోలార్ పవర్ ప్లాంట్లను ప్రారంభించారు. ఈ సందర్భంగా డిప్యూటీ సీఎం మాట్లాడుతూ.. రాష్ట్రవ్యాప్తంగా ఎంపిక చేసిన గ్రామాల్లో సోలార్ పవర్ ప్రాజెక్టులను అందుబాటులోకి తెస్తున్నామని, ఇందులో భాగంగా వ్యవసాయ మోటార్ల కోసం 7.5 కిలోవాట్ల సోలార్ యూనిట్లను మంజూరు చేస్తున్నట్లు ప్రకటించారు.
పైలట్ ప్రాజెక్ట్ కింద బోనకల్, కొడంగల్ మండలాల్లో పూర్తిస్థాయిలో ఈ సౌర యూనిట్లను అందిస్తున్నట్లు డిప్యూటీ సీఎం వివరించారు. రాష్ట్రంలో రైతులకు నాణ్యమైన, అంతరాయం లేని విద్యుత్ను అందిస్తున్నామని భట్టి విక్రమార్క పునరుద్ఘాటించారు. రైతు సంక్షేమానికి తమ ప్రభుత్వం కట్టుబడి ఉందన్నారు. ఇటీవల కురిసిన అకాల వర్షాలకు తడిసిన 9,214 మెట్రిక్ టన్నుల ధాన్యాన్ని కొనుగోలు చేసి అన్నదాతలను ఆదుకున్నామని ఆయన గుర్తుచేశారు. రైతు పండించిన ప్రతి గింజనూ ప్రభుత్వమే కొంటుందని భరోసా ఇచ్చారు. విద్యార్థులకు కూడా ఆయన ఒక తీపి కబురు అందించారు. సుదీర్ఘకాలంగా పెండింగ్లో ఉన్న ఓవర్సీస్ స్కాలర్షిప్లను త్వరలోనే విడుదల చేస్తామని, ఇందుకు సంబంధించి ఆయా శాఖలకు ఇప్పటికే అనుమతులు మంజూరు చేశామని డిప్యూటీ సీఎం వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి...
దేశంలో పెరుగుతున్న ఎండలు.. ప్రజలకు ప్రధాని మోదీ కీలక సూచనలు
అకాల వర్షాలతో తెలంగాణ సర్కార్ అలర్ట్.. సీఎం రేవంత్రెడ్డి కీలక సూచనలు