హనుమాన్ జయంతికి పటిష్ట బందోబస్తు
ABN , Publish Date - Apr 01 , 2026 | 09:42 AM
హైదరాబాద్లో ఏప్రిల్ 2న హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు.
సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు
సీపీ సజ్జనార్
హైదరాబాద్ సిటీ: నగరంలో ఏప్రిల్ 2న హనుమాన్ శోభాయాత్ర ప్రశాంతంగా జరిగేందుకు అన్ని ఏర్పాట్లు చేసినట్లు సిటీ పోలీస్ కమిషనర్ వీసీ సజ్జనార్ తెలిపారు. కోఠిలోని ఉస్మానియా మెడికల్ కాలేజీ ఆడిటోరియంలో మంగళవారం వివిధ ప్రభుత్వ శాఖల అధికారులు, ఉత్సవ నిర్వాహకులతో సమన్వయ సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా సీపీ మాట్లాడుతూ ప్రధాన యాత్రలో సుమారు 168 శోభాయాత్రలు కలవనున్న నేపథ్యంలో అవాంఛనీయ ఘటనలు చోటుచేసుకోకుండా సుమారు 3,000 మంది పోలీసు సిబ్బందితో పటిష్ట బందోబస్తు నిర్వహిస్తున్నామన్నారు.
యాత్ర నిర్వహణలో వలంటీర్లకు తగిన శిక్షణ ఇచ్చి, రోప్ పార్టీ సభ్యులను అధిక సంఖ్యలో ఏర్పాటు చేసుకోవాలని నిర్వాహకులకు సీపీ సూచించారు. ఫ్లై ఓవర్లు, రైల్వే బ్రిడ్జిల వద్ద తగిన జాగ్రత్తలు పాటించాలని, ట్రాఫిక్ ఇబ్బందులు కలగకుండా ముందస్తు మళ్లింపులు చేపట్టాలని అధికారులను ఆదేశించారు. సోషల్ మీడియాలో రెచ్చగొట్టే పోస్టులు పెడితే కఠిన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. సమావేశం అనంతరం గౌలిగూడ రామమందిరాన్ని దర్శించుకున్న సీపీ సజ్జనార్ అక్కడి నుంచి తాడ్బండ్ హనుమాన్ దేవాలయం వరకు ఉన్న 12 కిలోమీటర్ల శోభాయాత్ర మార్గాన్ని వాహనంపై క్షేత్రస్థాయిలో పరిశీలించారు.
ఇప్పటికే ఈ ప్రాంతంలో రోడ్లపై చెత్తాచెదారం, మట్టికుప్పలు, రాళ్లు లేకుండా, రోడ్డుపైకి వచ్చే చెట్టుకొమ్మలు తొలగించే పనులు చేస్తున్నారు. కార్యక్రమంలో అడిషనల్ సీపీ తఫ్సీర్ ఇక్బాల్, ట్రాఫిక్ జాయింట్ సీపీ డి.జోయల్ డెవిస్, జీహెచ్ఎంసీ జోనల్ కమిషనర్ రవికిరణ్, డీసీపీలు వైవీఎస్ సుధీంద్ర, సీహెచ్ శ్రీధర్, చిక్కడపల్లి ఏసీపీ రమే్షకుమార్, ఇన్స్పెక్టర్ మల్లేశం, ట్రాఫిక్ ఇన్స్పెక్టర్ ఏడుకొండలు, వీహెచ్పీ, బజరంగ్దళ్ నాయకులు నరసింహ మూర్తి, రామరాజు, శ్రీకాంత్, శశిధర్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
స్వల్పంగా పెరిగిన బంగారం, వెండి ధరలు.. ఈ రోజు ఎలా ఉన్నాయంటే..
భార్యనూ తల్లినీ బెదిరించి..50 వేలకు కన్నబిడ్డ అమ్మకం
Read Latest Telangana News and National News