రెవెన్యూ శాఖలో భూ దందా కలకలం.. డిప్యూటీ కలెక్టర్పై సస్పెన్షన్ వేటు
ABN , Publish Date - Jun 08 , 2026 | 04:16 PM
తెలంగాణ రెవెన్యూ శాఖలో భూ దందా కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్పై సస్పెన్షన్ వేటు పడింది. హౌసింగ్ బోర్డు భూముల పరిశీలన సమయంలో రాము నాయక్ చేసిన భారీ అక్రమాలు బయటపడ్డాయి.
హైదరాబాద్, జూన్ 8: తెలంగాణ రెవెన్యూ శాఖలో భూ దందా కలకలం రేపుతోంది. ఈ వ్యవహారంలో డిప్యూటీ కలెక్టర్ రాము నాయక్పై సస్పెన్షన్ వేటు పడింది. హౌసింగ్ బోర్డు భూముల పరిశీలన సమయంలో రాము నాయక్ చేసిన భారీ అక్రమాలు బయటపడ్డాయి. బహిరంగ మార్కెట్లో గజం రూ.2 లక్షలకు పైగా విలువ చేసే హైకోర్టు 5-6 గేట్ల మధ్య ఉన్న తెలంగాణ హౌసింగ్ బోర్డుకు చెందిన 33.53 చదరపు గజాల స్థలాన్ని రాము నాయక్ 2018 ఫిబ్రవరి 17న అక్రమంగా రిజిస్ట్రేషన్ చేయించినట్లు అధికారులు తేల్చారు.
ఇందిరమ్మ ఇండ్ల స్థలాల్లోనూ అక్రమాలు
ఇందిరమ్మ ఇండ్ల స్థలాల పరిశీలనలో అనేక అక్రమాలు వెలుగులోకి వచ్చాయి. ప్రభుత్వ భూములను కాజేయడంపై మంత్రి పొంగులేటి శ్రీనివాస్ రెడ్డి తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. భూ దందాలకు పాల్పడిన అధికారులపై ఉక్కుపాదం మోపుతామని, ప్రభుత్వ ఆస్తులను దోచుకునేవారిపై క్రిమినల్ కేసులు నమోదు చేస్తామని మంత్రి స్పష్టం చేశారు. రాము నాయిక్పై 2016 నుంచే వివిధ కేసులు ఉన్నట్లు తెలుస్తోంది. విజయనగర్ కాలనీ భూ వ్యవహారాలు, తుల్జాగూడ, లక్ష్మీగూడ, మహబూబ్గంజ్ ప్రాంతాల్లోని భూముల అక్రమ రిజిస్ట్రేషన్లపై అధికారులు విచారణను ముమ్మరం చేశారు. సబ్ రిజిస్ట్రార్ల పాత్రపై కూడా దర్యాప్తు జరుగుతోంది. అక్రమ సేల్ డీడ్లను రద్దు చేయాలని ఆదేశాలు జారీ చేశారు. భూ దందాలకు సహకరించిన ఓ సూపరింటెండెంట్ను రెవెన్యూ శాఖ డిస్మిస్ చేసింది. మరో సూపరింటెండెంట్ బోనా నాయక్పై సస్పెన్షన్ వేటు పడింది. భూకబ్జాలపై అధికారులు ప్రత్యేక నిఘా పెట్టగా.. తీగ లాగితే డొంక కదిలినట్లు భూ దందాలు ఒక్కొక్కటిగా బయటపడుతున్నాయి.
ఇవి కూడా చదవండి..
ఖమ్మం జిల్లా వెంకటాయపాలెం గ్రామాన్ని అభివృద్ధి చేస్తా: మంత్రి తుమ్మల
చేప మందు పంపిణీ.. నాంపల్లి ఎగ్జిబిషన్ గ్రౌండ్లో భద్రతను పరిశీలించిన సీపీ సజ్జనార్
Read Latest Telangana News And Telugu News