ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే లక్ష్యం: మంత్రి రాజనర్సింహ
ABN , Publish Date - Sep 10 , 2026 | 01:44 PM
రాష్ట్రంలోని ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే తెలంగాణ ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు.
హైదరాబాద్, సెప్టెంబర్ 10: ఉద్యోగులు, పెన్షనర్లకు మెరుగైన వైద్య సేవలు అందించడమే రాష్ట్ర ప్రభుత్వ లక్ష్యమని వైద్య ఆరోగ్య శాఖ మంత్రి దామోదర్ రాజనర్సింహ తెలిపారు. వారు కోరుకున్న విధంగా ఆరోగ్య సేవలు అందిస్తామని స్పష్టం చేశారు. జులై 17 నుంచి నూతన ఈహెచ్ఎస్ సదుపాయం అమలు చేస్తున్నామని గుర్తు చేశారు. ఈహెచ్ఎస్ పరిధిలో 17 లక్షలకు పైగా లబ్ధిదారులు ఉన్నారని వివరించారు. అర్హులందరికీ డిజిటల్ హెల్త్ కార్డులు జారీ చేస్తామని ప్రకటించారు. ఓటీపీతో హెల్త్ కార్డు డౌన్లోడ్ చేసుకునే అవకాశం కూడా కల్పిస్తున్నట్లు ఆయన చెప్పారు.
గురువారం శాసనమండలిలో సభ్యులు అడిగిన ప్రశ్నకు ఆయన సమాధానం ఇచ్చారు. ఈహెచ్ఎస్ కింద ఏడాదికి రూ.1,056 కోట్ల బడ్జెట్ కేటాయించామని చెప్పారు. నెలకు రూ.88 కోట్ల నిధులు సమకూరుతున్నాయని వివరించారు. ఉద్యోగులు, పెన్షనర్లు 1.5 శాతం చొప్పున చెల్లింపు.. ప్రభుత్వం కూడా అంతే మొత్తం చెల్లిస్తుందని పేర్కొన్నారు.
921 ఆసుపత్రుల్లో ఇన్పేషెంట్ వైద్య సేవలు అందుతాయని అన్నారు. ఆ జాబితాలో 114 ప్రభుత్వ, 807 ప్రైవేట్ ఆసుపత్రులు ఉన్నాయని తెలిపారు. రాష్ట్రవ్యాప్తంగా మొత్తం 37 వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేస్తున్నామని అన్నారు. ప్రస్తుతం 12 జిల్లాల్లో 12 వెల్నెస్ కేంద్రాలు ఏర్పాటు చేశామని చెప్పారు. మరో 25 వెల్నెస్ కేంద్రాల ఏర్పాటు చేయాల్సి ఉందని తెలిపారు. ఇప్పటివరకు 8,511 కేసులకు రూ.55.14 కోట్ల ప్రీ-ఆథరైజేషన్ చేసినట్లు మంత్రి దామోదర్ రాజనర్సింహ వెల్లడించారు.
ఈ వార్తలు కూడా చదవండి..
కనీస వేతనాలు చెల్లించడంలో దేశానికి తెలంగాణ ఆదర్శం: మంత్రి వివేక్
ఈగోలు లేకుండా ప్రజల కోసం పనిచేద్దాం: కలెక్టర్లతో సీఎం చంద్రబాబు
For More TG News And Telugu News