రాంచందర్రావు అరెస్ట్.. తోపులాట.. ఉద్రిక్తత
ABN , Publish Date - Sep 07 , 2026 | 12:55 PM
తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ ముట్టడికి యత్నించిన బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావును పోలీసులు అరెస్ట్ చేశారు. ఈ క్రమంలో అక్కడ తీవ్ర ఉద్రిక్తత చోటు చేసుకుంది. ఈరోజు(సోమవారం) ఉదయం నుంచి దశలవారీగా అసెంబ్లీ ముట్టడికి వస్తున్న బీజేపీ శ్రేణులను పోలీసులు ఎప్పటికప్పుడు అరెస్ట్ చేస్తున్నారు. వరుసగా అసెంబ్లీ ముట్టడికి కమలం పార్టీ నేతలు రావడంతో అక్కడ గందరగోళ పరిస్థితి నెలకొంది. మరోసారి అసెంబ్లీ ముట్టడికి బీజేపీ యత్నించడంతో.. ఆ పార్టీ రాష్ట్ర అధ్యక్షుడు రాంచందర్ రావు సహా పలువురు కార్యకర్తలను పోలీసులు అదుపులోకి తీసుకున్నారు.
రాంచందర్రావు అరెస్ట్ సందర్భంలో తోపులాట చోటు చేసుకుంది. దీంతో గన్పార్క్ వద్ద ఉద్రిక్తత నెలకొంది. బీజేపీ తెలంగాణ చీఫ్ను పోలీసులు తీసుకెళ్లకుండా రోడ్డుపై పడుకుని మరీ బీజేవైఎం నేతలు నిరసనకు దిగారు. రాంచందర్ రావును తీసుకెళ్తున్న పోలీస్ వాహనంపైకి బీజేవైఎం రాష్ట్ర అధ్యక్షుడు గణేష్ కుండే ఎక్కడంతో.. వెంటనే పోలీసులు అతడిని లాగి పడేశారు. ఆ వెంటనే పలువురు కార్యకర్తలు కారుకు అడ్డంగా పడుకున్నారు. పోలీసులు వారిని చెదరగొట్టి బీజేపీ రాష్ట్ర అధ్యక్షుడిని అక్కడి నుంచి తీసుకెళ్లేందుకు యత్నించారు. దీంతో అసెంబ్లీ వద్ద బీజేపీ నేతలు, పోలీసుల మధ్య తోపులాట జరిగింది. ఈ క్రమంలో ఇద్దరు కార్యకర్తలకు చేతులు విరగగా, పలువురు కార్యకర్తలకు తీవ్ర గాయాలయ్యాయి. వెంటనే వారిని ఆస్పత్రికి తరలించి చికిత్స అందజేస్తున్నారు. పరిస్థితిని అదుపులోకి తెచ్చేందుకు పోలీసులు యత్నిస్తున్నారు. వరుసగా బీజేపీ నేతల ముట్టడితో అసెంబ్లీ పరిసర ప్రాంతాల్లో హైటెన్షన్ నెలకొంది.
ఇవి కూడా చదవండి...
అసెంబ్లీ వద్దకు సీపీ సజ్జనార్..
LP మీటింగ్ కూడా కేసీఆర్ ఫామ్హౌస్లోనే చేస్తారా: మంత్రి సీతక్క
Read Latest Telangana News And Telugu News