అసెంబ్లీ వద్దకు సీపీ సజ్జనార్..
ABN , Publish Date - Sep 07 , 2026 | 11:14 AM
తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నల్ల టీషర్టులు ధరించి, ఫ్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు వద్దే పోలీసులు అడ్డుకోవడం తీవ్ర రచ్చకు దారి తీసింది.
హైదరాబాద్, సెప్టెంబర్ 7: తెలంగాణ అసెంబ్లీ గేటు వద్ద బీఆర్ఎస్ ఎమ్మెల్యేల ఆందోళనలతో హైటెన్షన్ వాతావరణం నెలకొంది. నల్ల టీషర్టులు ధరించి, ఫ్లకార్డులతో అసెంబ్లీ లోపలికి వెళ్లేందుకు ప్రయత్నించిన బీఆర్ఎస్ ఎమ్మెల్యేలను గేటు వద్దే పోలీసులు అడ్డుకోవడం తీవ్ర రచ్చకు దారి తీసింది. బీఆర్ఎస్ నేతలను అడ్డుకున్న పోలీసులు వారిని అరెస్ట్ చేసి తెలంగాణ భవన్కు తరలించారు. ఈ క్రమంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యే, మాజీ మంత్రి సునీతా లక్ష్మారెడ్డి చీరను పోలీసులు లాగారంటూ బీఆర్ఎస్ నేతలు ఆరోపించారు. పోలీసుల తీరుకు వ్యతిరేకంగా నినాదాలు చేశారు. విషయం తెలిసిన వెంటనే హైదరాబాద్ సీపీ సజ్జనార్ అసెంబ్లీ వద్దకు చేరుకున్నారు. మాజీ మంత్రి చీర లాగిన అంశంపై పోలీస్ సిబ్బంది నుంచి వివరాలు అడిగి తెలుసుకుంటున్నారు.
మరోవైపు ఇదే అంశంపై ఖైరతాబాద్ జోన్ డీసీపీ శిల్పవల్లి స్పందించారు. అసెంబ్లీకి బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు బ్లాక్ టీషర్ట్లు వేసుకురావడం నేరం కాదని.. కానీ వాటిపైన అభ్యంతకర పదాలు ఉండడం వల్ల వాళ్లని లోపలికి అనుమతించలేదని వివరించారు. తాము ఎవ్వరితోనూ అసభ్యకరంగా ప్రవర్తించలేదన్నారు. అలాంటిది ఏమైనా ఉంటే వీడియోలు చూసి పరిశీలిస్తామని చెప్పారు. బీఆర్ఎస్ చేసిన ఆరోపణలు పరిశీలిస్తామన్నారు. అసెంబ్లీ స్పీకర్ ఇచ్చిన సూచన మేరకు తాము నడుచుకుంటున్నట్లు డీసీపీ శిల్పవల్లి పేర్కొన్నారు.
ఇవి కూడా చదవండి...
అసెంబ్లీ గేటు వద్ద ఉద్రిక్తత.. కేటీఆర్, హరీశ్ రావు అరెస్ట్
22 ఏపై చర్చకు బీజేపీ ఎమ్మెల్యేల పట్టు.. తెలంగాణ అసెంబ్లీలో గందరగోళం
Read Latest Telangana News And Telugu News