సర్లో పారదర్శకత ఏదీ?
ABN , Publish Date - Sep 14 , 2026 | 05:30 AM
తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (SIR) ప్రక్రియలో పారదర్శకత లోపించిందని సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఈసీకి లేఖ రాశారు.
అక్షర దోషాలకూ నోటీసుల జారీ
ఓటర్లకు సమాచారం ఇవ్వడంలో విఫలం
తాజా స్థితిని తెలియజేసే వ్యవస్థ ఉండాలి
ఈసీకి సామాజికవేత్తల లేఖ
హైదరాబాద్, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): తెలంగాణలో కొనసాగుతున్న ఓటర్ల ప్రత్యేక సమగ్ర సవరణ (సర్) ప్రక్రియలో పారదర్శకత కొరవడిందని, పౌరులకు తగిన సమాచారం ఇవ్వడంలో అధికారులు విఫలమవుతున్నారని సామాజిక కార్యకర్తలు, న్యాయవాదులు, ప్రజాసంఘాల ప్రతినిధులు ఆందోళన వ్యక్తం చేశారు. ఈ మేరకు భారత ఎన్నికల సంఘానికి (ఈసీఐ) ఆదివారం ఒక లేఖ రాశారు. తెలంగాణ ప్రధాన ఎన్నికల అధికారి (సీఈఓ) కార్యాలయానికి సైతం ఈ లేఖ కాపీని పంపారు. సర్ నోటీసులు, విచారణకు సంబంధించి ఓటర్లు ఎదుర్కొంటున్న ఇబ్బందులను వారు లేఖలో వివరించారు. సర్ ప్రక్రియలో భాగంగా... ఓటరుకు నోటీసు జారీ చేసినప్పటి నుంచి, దీనిపై తుది నిర్ణయం తీసుకునే వరకు ప్రతి దశలోనూ సమాచారం తెలుసుకునేలా ఆన్లైన్ వ్యవస్థ ఏర్పాటు చేయాలని వారు కోరారు.
ఇంకా ఏ ఆధారాలు అవసరమో స్పష్టంగా తెలియజేయాలని కోరారు. 2002 ఓటరు జాబితాతో ప్రస్తుత వివరాలు సరిగ్గా మ్యాపింగ్ కాకపోవడం, పేరు, తండ్రి పేరు, వయస్సు సంబంధిత వివరాల్లో చిన్నపాటి తేడాలు ఉన్నా (ఒక అక్షరం సరిపోలకపోయినా) నోటీసులు ఇస్తుండడంపై ఆందోళన వ్యక్తం చేశారు. ఏదైనా అక్షరం ప్రస్తుత జాబితాలో తప్పుగా నమోదై ఉంటే.. రెండు జాబితాల్లోని(గత, ప్రస్తుత) వివరాలను నోటీసుల్లో స్పష్టంగా పేర్కొనాలని.. అప్పుడే ఓటరు సరైన వివరణతోపాటు, ఆధారాలు సమర్పించగలరని తెలిపారు. నోటీసులు అందుకున్న ఓటర్లు అవసరమైన పత్రాలను ఆన్లైన్/ఆ్ఫలైన్లో సమర్పిస్తున్నారని, అనంతరం వాటి స్థితి తెలియకపోవడంతో ఇబ్బందులు ఎదుర్కొంటున్నట్లు వివరించారు. తుది జాబితా ప్రచురణకు ముందే అదనపు పత్రాలు, లేదంటే వివరణ సమర్పించేందుకు ఓటర్లకు తగిన అవకాశం ఇవ్వాలని ఈసీఐకి వారు విజ్ఞప్తి చేశారు.
ఈ వార్తలు కూడా చదవండి..
ప్రైవేటు భూమిపై ముదిరాజ్ నేతల కన్ను
ఉమ్మడి కుటుంబ వ్యవస్థకు పొన్నం కుటుంబం ఆదర్శం
Read Latest AP News And Telangana News And National News
And Telugu News