రూ.1 లక్ష లంచం తీసుకుంటూ అడ్డంగా బుక్కైన సచివాలయం ఉద్యోగులు
ABN , Publish Date - Sep 10 , 2026 | 03:01 PM
సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కు కావాలంటే లక్ష రూపాయలు లంచం ఇవ్వాలని ఇద్దరు సచివాలయం ఉద్యోగులు డిమాండ్ చేశారు. చివరకు ఏసీబీ అధికారులకు రెడ్హ్యాండెడ్గా దొరికిపోయారు. వివరాల్లోకెళితే...
హైదరాబాద్, సెప్టెంబరు 10: తెలంగాణ రాష్ట్ర సచివాలయంలో లక్ష రూపాయలు లంచం తీసుకుంటూ ఇద్దరు ఉద్యోగులు ఈరోజు (గురువారం) ఏసీబీకి అడ్డంగా దొరికిపోయారు. 2 లక్షల రూపాయల సీఎం రిలీఫ్ ఫండ్ చెక్కును అందించడానికి.. సెక్రటేరియట్ రెవెన్యూ శాఖలో పనిచేస్తున్న వినోద్, ఔట్ సోర్సింగ్ ఉద్యోగి రాఘవేంద్ర ఇద్దరూ కలిసి ఓ బాధితుడి నుంచి లక్ష రూపాయలు డిమాండ్ చేశారు.
దీంతో ఆ బాధితుడు ఏసీబీ అధికారులను ఆశ్రయించారు. రంగంలోకి దిగిన ఏసీబీ అధికారులు లంచం అడిగిన ఉద్యోగులను పట్టుకోవడానికి వల పన్నారు. సచివాలయం ఆవరణలోని గుడి వద్ద బాధితుడి వద్ద నుంచి లంచం తీసుకుంటున్న ఉద్యోగులను రెడ్హ్యాండెడ్గా పట్టుకున్నారు. అనంతరం ఆ సొమ్మును స్వాధీనం చేసుకుని, వారిని అదుపులోకి తీసుకున్నారు. ఇద్దరు ఉద్యోగులను నాంపల్లి ఏసీబీ కార్యాలయానికి తరలించి, విచారణ జరుపుతున్నామని అధికారులు తెలిపారు.
సచివాలయంలో సోదాలు
అయితే చిన్న స్థాయి ఉద్యోగులు ఇంత పెద్ద మొత్తంలో లంచం డిమాండ్ చేయడంపై సందేహాలు వ్యక్తమవుతున్నాయి. వీరికి ఉన్నతాధికారుల అండదండలు ఉన్నాయేమో అన్న అనుమానంతో ఏసీబీ అధికారులు సచివాలయంలో సోదాలు నిర్వహించారు. సోదాలు పూర్తయ్యాక ఈ విషయమై మరిన్ని నిజానిజాలు బయటకు వచ్చే అవకాశమున్నట్టు తెలుస్తోంది.
ఈ వార్తలనూ చదవండి:
శాసన మండలి నుంచి బీఆర్ఎస్ సభ్యుల వాకౌట్
కాంగ్రెస్ x బీఆర్ఎస్.. జిల్లాలో పదునెక్కిన రాజకీయ వేడి