ముస్లిం ఉద్యోగులకు పనివేళల్లో మార్పు.. తెలంగాణ ప్రభుత్వ ఉత్తర్వులు
ABN , Publish Date - Feb 17 , 2026 | 05:45 PM
రంజాన్ మాసాన్ని పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది.
హైదరాబాద్, ఫిబ్రవరి17 (ఆంధ్రజ్యోతి): రంజాన్ మాసాన్ని(Ramadan Special Timings) పురస్కరించుకుని ముస్లిం ప్రభుత్వ ఉద్యోగులకు రాష్ట్ర ప్రభుత్వం (Telangana Government) ప్రత్యేక సౌకర్యం కల్పించింది. ఉపవాసాలు పాటించే ఉద్యోగుల సౌకర్యార్థం సాయంత్రం 4 గంటలకే విధులు ముగించుకునేలా ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. పవిత్ర రంజాన్ మాసం సందర్భంగా ముస్లిం ఉద్యోగులకు తెలంగాణ ప్రభుత్వం ప్రత్యేక వెసులుబాటు కల్పించింది. ఉపవాసాలు పాటించే ముస్లిం ఉద్యోగుల ఆరోగ్యం, ఆధ్యాత్మిక అవసరాలను దృష్టిలో ఉంచుకుని ఈ నిర్ణయం తీసుకుంది. ప్రభుత్వ ఉత్తర్వుల ప్రకారం.. ఈ నెల 19వ తేదీ నుంచి వచ్చే నెల 20వ తేదీ వరకు ముస్లిం ఉద్యోగులు తమ విధులను సాయంత్రం 4 గంటలకే ముగించుకునే అవకాశం ఉంటుంది.
ప్రభుత్వ నిర్ణయం వెనుక ఉద్దేశం..
సాయంత్రం వేళల్లో ముస్లిం సోదరులు ఇఫ్తార్ (ఉపవాస విరమణ), ప్రత్యేక ప్రార్థనల (నమాజ్) కోసం తగిన సమయం కేటాయించుకునేలా ఈ నిర్ణయం తీసుకున్నారు. సాధారణ పనివేళల కంటే ఒక గంట ముందే విధులను ముగించుకోవడం వల్ల ట్రాఫిక్ ఇబ్బందులు లేకుండా వారు సమయానికి ఇంటికి చేరుకునే అవకాశం ఉంటుంది. రంజాన్ మాసంలో ముస్లింలు ఉదయం నుంచి సాయంత్రం వరకు ఉపవాసం ఉండడం వల్ల సాధారణ విధుల్లో కొంత ఇబ్బంది ఎదురవుతుంది. దీనిని దృష్టిలో ఉంచుకుని ప్రతి సంవత్సరం లాగానే ఈసారి కూడా ప్రభుత్వం ఈ ప్రత్యేక వెసలుబాటును ప్రకటించింది.
ఈ ఉత్తర్వులు రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ కార్యాలయాలు, పబ్లిక్ సెక్టార్ సంస్థలు, ప్రభుత్వ ఆధీనంలోని కార్యాలయాలకు వర్తిస్తాయని తెలంగాణ ప్రభుత్వం స్పష్టం చేసింది. సంబంధిత శాఖాధికారులు ఈ ఉత్తర్వులను అమలు చేయాలని ప్రభుత్వం ఆదేశించింది. ఈ నిర్ణయాన్ని ముస్లిం ఉద్యోగులు స్వాగతిస్తూ ప్రభుత్వానికి కృతజ్ఞతలు తెలిపారు.
ఈ వార్తలు కూడా చదవండి...
మాజీ మంత్రి ఎర్రబెల్లి భావోద్వేగం. ఎందుకంటే..
ఇబ్రహీంపట్నం మున్సిపల్ చైర్మన్ ఎన్నిక రద్దు: హైకోర్టు స్టేతో మారిన సమీకరణాలు
Read Latest Telangana News And AP News And Telugu News