కాంగ్రెస్ది ప్రతీకార పాలన
ABN , Publish Date - Mar 07 , 2026 | 09:57 AM
ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్ విమర్శించారు.
క్రషర్ల దందా చేస్తున్న మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి
కోచ్ ఫ్యాక్టరీలో స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు కల్పించాలి
డైవర్షన్ కోసమే ప్రగతి ప్రణాళిక కార్యక్రమాలు
బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్
హనుమకొండ: ఎన్నికల సమయంలో కాంగ్రెస్ పార్టీ చేవెళ్ల డిక్లరేషన్ పేరుతో ఎస్సీ, ఎస్టీ ప్రజలను మోసం చేసిందని, కాంగ్రెస్ది ప్రజా పాలన కాదు.. ప్రతీకార పాలన అని బీఆర్ఎస్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి ఆర్ఎస్ ప్రవీణ్కుమార్(RS Praveen Kumar) విమర్శించారు. శుక్రవారం హనుమకొండ బాలసముద్రంలోని బీఆర్ఎస్ కార్యాలయంలో విలేకరుల సమావేశం నిర్వహించారు. ఈ సందర్భంగా ప్రవీణ్కుమార్ మాట్లాడుతూ.. కాంగ్రెస్ ప్రభుత్వం ఎస్సీలకు ఇచ్చిన హామీల అమలు గురించి సమాధానం చెప్పాలని డిమాండ్ చేశారు.
కాంగ్రెస్ అధికారంలోకి వచ్చిన తర్వాత ఎస్సీ, ఎస్టీ వర్గాలకు ఎలాంటి ప్రయోజనం కలుగలేదని విమర్శించారు. చేవెళ్ల డిక్లరేషన్లో భాగంగా ఎస్సీలకు రూ.12లక్షల ఆర్థిక సహాయం, ప్రభుత్వ కాంట్రాక్టర్లో 18శాతం వాటా వంటి హామీలు ఇచ్చిన వాటిలో ఒక్కటి కూడా అమలు చేయలేదన్నారు. రాష్ట్రప్రభుత్వం చేపట్టిన 99 రోజుల ప్రజా పాలన ప్రగతి ప్రణాళిక కార్యక్రమం ప్రజల దృష్టి మరల్చే ప్రయత్నమేనని విమర్శించారు. ఇప్పటికే అధికారులు చేసే సాధారణ పనులనే కొత్త కార్యక్రమంగా ప్రకటించడం ఆశ్చర్యకరమని పేర్కొన్నారు. కాంగ్రెస్ పాలనలో అభివృద్ధి లేకపోయినా ప్రగతి ప్రణాళిక పేరుతో ప్రచారం చేయడం ప్రజలను మభ్యపెట్టే ప్రయత్నమని అన్నారు. రాష్ట్రంలో జరిగిన వివిధ అంశాలపై కాంగ్రెస్ ప్రభుత్వం ప్రతిపక్ష బీఆర్ఎస్ పార్టీ నేతలపై అక్రమ కేసులు పెట్టి ఇబ్బందులకు గురి చేస్తోందని మండిపడ్డారు.
మంత్రి పొంగులేటి శ్రీనివాస్రెడ్డి కాంట్రాక్టర్గా మేడారం పనుల్లో నాణ్యత లేని పనులు చేసి నిధులను దుర్వినియోగం చేశారని ప్రవీణ్కుమార్ ఆరోపించారు. పేదలు, దళితుల భూముల్లో మంత్రి క్రషర్లు ఏర్పాటు చేసి దందా నిర్వహిస్తున్నారని విమర్శలు చేశారు. కాజీపేట కోచ్ ఫ్యాక్టరీ ఏర్పాటులో బీఆర్ఎస్ పార్టీ పోరాటంతోనే పనులు జరుగుతున్నాయని, స్థానికులకే 70 శాతం ఉద్యోగాలు కల్పించాలని డిమాండ్ చేశారు. ఈ కార్యక్రమంలో కుడా మాజీ చైర్మన్ మర్రి యాదవరెడ్డి, బీఆర్ఎస్ కార్పొరేటర్లు, డివిజన్ అధ్యక్షుడు, నాయకులు ఇమ్మడి రాజు, జన్ను జకార్య, గబ్బెట శ్రీను, మంద శ్యామ్ తదితరులు పాల్గొన్నారు.
ఈ వార్తలు కూడా చదవండి:
వంటగ్యాస్ షాక్.. దేశంలో ఎల్పీజీ ధరలు భారీగా పెంపు
బెంచీలు కొన్నారు.. పిల్లలు నేలపైనే కూర్చున్నారు!
Read Latest Telangana News and National News