Share News

నేను లేనప్పుడే నా భర్తను చంపు

ABN , Publish Date - Sep 14 , 2026 | 06:08 AM

నాగర్‌కర్నూల్‌లో వివాహేతర సంబంధానికి అడ్డుగా ఉన్న భర్తను ప్రియుడితో కలిసి భార్య హత్య చేయించినట్లు పోలీసులు వెల్లడించారు. కేసును ఛేదించిన పోలీసులు భార్య సలీమాబేగం, గౌస్‌పాషాను అరెస్టు చేసి రిమాండ్‌కు తరలించారు.

నేను లేనప్పుడే నా భర్తను చంపు
Nagarkurnool Husband Murder Case

  • మరిదితో వివాహేతర సంబంధానికి

  • అడ్డొస్తున్నాడని అతడితో భర్తను చంపించిన భార్య

  • నాగర్‌కర్నూల్‌లో ఘటన.. నిందితుల రిమాండ్‌

నాగర్‌కర్నూల్‌ క్రైం, సెప్టెంబరు 13 (ఆంధ్రజ్యోతి): వరుసకు మరిది అయిన వ్యక్తితో వివాహేతర సంబంధం పెట్టుకున్న ఓ మహిళ.. అందుకు అడ్డొస్తున్న తన భర్తను అతడితో కలిసి చంపించింది. భర్తను హత్య చేసేందుకు ముందుగానే పథకం వేసిన ఆమె.. తాను లేనప్పుడే తన భర్తను చంపాలని ప్రియుడికి సూచించింది. నాగర్‌కర్నూల్‌లో ఈ నెల 9న జరిగిన హత్య కేసును పోలీసులు ఛేదించారు. వివరాలను డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌ ఆదివారం విలేకరులకు వెల్లడించారు. నాగర్‌కర్నూల్‌ మండలంలోని గగ్గలపల్లికి చెందిన మహమ్మద్‌ కరీమ్‌(43) జిల్లా కేంద్రంలో హోటల్‌ నిర్వహిస్తున్నాడు. అతడి పినతల్లి కుమారుడు గౌస్‌పాషాతో అతడి భార్య సలీమాబేగం రెండేళ్లుగా వివాహేతర సంబంధం కొనసాగిస్తోంది. విషయం తెలిసిన భర్త కరీమ్‌ ఆమెను మందలించాడు. ఆమె ప్రవర్తనలో మార్పు రాకపోవడంతో గతనెల పెద్దమనుషులతో పంచాయితీ పెట్టించాడు.


పెద్దల సమక్షంలో తనను తిట్టించాడన్న అక్కసుతో కరీమ్‌ను హత్య చేస్తానని గౌస్‌పాషా బెదిరించాడు. ప్రియుడితో కలిసి భర్త హత్యకు పథకం వేసిన సలీమాబేగం.. భర్త ఆస్తులను తన పేరుపై మార్పించుకుంది. తనపై అనుమానం రాకుండా ఉండేందుకు తాను లేనప్పుడే తన భర్తను చంపాలని ప్రియుడికి సూచించింది. ఆమె ఈ నెల 7న ఏపీలోని నెల్లూరు జిల్లా రహమతాబాద్‌ దర్గాకు వెళ్లింది. గౌస్‌పాషా ఈ నెల 9న రాత్రి కరీమ్‌ ఇంటికి వెళ్లి తలుపుకొట్టాడు. కరీమ్‌ తలుపులు తీయగానే కత్తితో దాడి చేసి, కుప్పకూలిన గొంతు కోసి చంపేశాడు. ఈఘటనపై కరీమ్‌ సోదరుడు హుస్సేన్‌ ఫిర్యాదు మేరకు కేసు నమోదు చేసిన పోలీసులు.. మృతుడి భార్య సలీమాబేగంను అదుపులోకి తీసుకున్నారు. ఆమె ఇచ్చిన సమాచారం మేరకు గౌస్‌పాషాను అదుపులోకి తీసుకొని విచారించగా, నేరాన్ని అంగీకరించాడు. ఇద్దరినీ రిమాండ్‌కు తరలిస్తున్నట్లు డీఎస్పీ శ్రీనివాస్‌యాదవ్‌ తెలిపారు.


ఈ వార్తలు కూడా చదవండి..

సర్‌లో పారదర్శకత ఏదీ?

ప్రైవేటు భూమిపై ముదిరాజ్‌ నేతల కన్ను

Read Latest AP News And Telangana News And National News

And Telugu News

Updated Date - Sep 14 , 2026 | 06:08 AM