సహజ న్యాయసూత్రం ప్రకారం ఆ వ్యాఖ్యల్ని ఎందుకు ఖండించలేదు: మల్లు రవి
ABN , Publish Date - Aug 22 , 2026 | 03:01 PM
కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తోందని బీసీలను ఒకలా, రెడ్డిలను మరోలా చూడట్లేదని తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు.
హైదరాబాద్, ఆగస్టు 22: కాంగ్రెస్ ప్రభుత్వం అందరినీ సమానంగా చూస్తోందని బీసీలను ఒకలా, రెడ్డిలను మరోలా చూడట్లేదని తెలంగాణ కాంగ్రెస్ క్రమశిక్షణ కమిటీ ఛైర్మన్ మల్లు రవి పేర్కొన్నారు. ఈ రోజు(శనివారం) ఏబీఎన్తో మాట్లాడిన ఆయన.. కాంగ్రెస్ ప్రభుత్వంపై సొంత పార్టీ నేతలు చేస్తున్న వ్యాఖ్యలపై స్పందించారు. కొండా సుస్మిత వ్యవహారంపై అధిష్ఠానం స్పందించిందని, ఈ మేరకు మంత్రి కొండా సురేఖకు షోకాజ్ నోటీసులు జారీ చేసిందన్నారు. దీనిపై మంత్రి సురేఖ వాట్సాప్లో వివరణ లేఖను పంపినట్టు తెలిపారు. అయితే.. ఈ లేఖపై ఎలాంటి నిర్ణయం తీసుకోవాలో పార్టీ పెద్దలు చర్చిస్తున్నారని చెప్పారు.
సుస్మిత చేసిన వ్యాఖ్యలు ఆమె వ్యక్తిగతమని పేర్కొన్న కొండా సురేఖ వివరణను మల్లు రవి వ్యతిరేకించారు. ‘పార్టీకి వ్యతిరేకంగా ఒకరు మాట్లాడుతుంటే దేవదాయశాఖ మంత్రి హోదాలో ఉన్న కొండా సురేఖ ఎందుకు స్పందించలేదు? పార్టీ సహజ న్యాయ సూత్రాల ప్రకారం ఖండించాల్సింది. ప్రభుత్వానికి, ముఖ్యమంత్రికి వ్యతిరేకంగా మాట్లాడుతున్నప్పుడు మౌనంగా ఎందుకు ఉన్నారు?’ అని ప్రశ్నించారు. కాగా.. గతంలో సీఎం రేవంత్ రెడ్డి, కాంగ్రెస్ పార్టీపై సుస్మిత వివాదాస్పద వ్యాఖ్యలు చేసిన సంగతి తెలిసిందే.
అలాగే మునుగోడు ఎమ్మెల్యే కోమటిరెడ్డి రాజగోపాల్ రెడ్డి పార్టీకి వ్యతిరేకంగా మాట్లాడిన అంశంపై కూడా మల్లు రవి స్పందించారు. ఈ విషయంపై ఇప్పటివరకూ ఎవరూ ఫిర్యాదు చేయలేదని, సమయం వచ్చినప్పుడు ఆ అంశాన్ని సుమోటోగా స్వీకరిస్తామని స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి...
అనకాపల్లికి గోదావరి నీళ్లు.. సెప్టెంబర్ నాటికి తీసుకొస్తాం: సీఎం చంద్రబాబు
బడుగు బలహీన వర్గాల రిజర్వేషన్ను ఎలా రద్దు చేస్తారో చూస్తాం: వీహెచ్
Read Latest Telangana News And Telugu News