ఖైరతాబాద్ ప్రజలే నా బలం.. పదవుల కోసం వెళ్లలేదు: ఎమ్మెల్యే దానం
ABN , Publish Date - Jan 29 , 2026 | 09:46 AM
బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్కు సంబంధించి తెలంగాణ స్పీకర్ ఇచ్చిన నోటీసులపై ఎమ్మెల్యే దానం నాగేందర్ స్పందించారు. పదవుల కోసం వెళ్లలేదని.. విస్మరించారు గనుకే వదలాల్సి వచ్చిందని స్పష్టం చేశారు.
హైదరాబాద్, జనవరి 29: ఖైరతాబాద్ ఎమ్మెల్యే దానం నాగేందర్పై(Khairatabad MLA Danam Nagender) అనర్హత పిటిషన్ విషయంలో కీలక పరిణామం చోటు చేసుకుంది. బీఆర్ఎస్ దాఖలు చేసిన అనర్హత పిటిషన్పై తెలంగాణ అసెంబ్లీ స్పీకర్ గడ్డం ప్రసాద్ కుమార్(Speaker Gaddam Prasad Kumar) ఈనెల 30న విచారణ జరపాలని నిర్ణయించారు. దీనికి సంబంధించి ఎమ్మెల్యే దానం నాగేందర్కు.. పిటిషనర్ బీఆర్ఎస్ ఎమ్మెల్యే పాడి కౌశిక్ రెడ్డి నోటీసులు జారీ చేశారు. ఈ నేపథ్యంలో ఏబీఎన్ ఆంధ్రజ్యోతితో దానం మాట్లాడుతూ.. పదవుల కోసం తాను ఎక్కడికీ వెళ్లలేదని, విస్మరించారు కాబట్టే వదలాల్సి వచ్చిందని వివరించారు.
‘నేను ఏ నిర్ణయం తీసుకున్నా ప్రజలు నాకు సహకరిస్తారు. ప్రజలపై ఆధారపడే నా నిర్ణయాలు ఉంటాయి. ప్రజల ఆశీర్వాదంతోనే ఆరుసార్లు గెలిచాను. ఖైరతాబాద్ ప్రజలే నాకు బలం. సేవ చేయాలనే ఉద్దేశం తప్ప పదవుల కోసం నేనెప్పుడూ ఆలోచించలేదు. ఎంతవరకు అయితే అంతవరకు ఫైట్ చేస్తాను’ అని ఎమ్మెల్యే వ్యాఖ్యానించారు.
స్పీకర్ నోటీసులు తనకు అందలేదని.. పిటిషనర్కు నోటీసులు అంది ఉండవచ్చన్నారు దానం. ఉన్న విషయాలను జస్టిఫై చేసుకోవడానికి లీగల్ అంశాలను పరిశీలిస్తున్నట్లు తెలిపారు. స్పీకర్ ఏం అడుగుతారో దానికి సమాధానం చెబుతానని, ఆ ప్రశ్నల ఆధారంగా తన సమాధానాలు ఉంటాయని ఎమ్మెల్యే స్పష్టం చేశారు.
ఇవి కూడా చదవండి
మేడారంలో మరో కీలక ఘట్టం.. పలువురు ప్రముఖులు రాక..
Read Latest Telangana News And Telugu News